నిజంగా ఇది బ్రేకింగ్ న్యూసే. ఇంకా చెప్పాలంటే బిగ్ బ్రేకింగ్, షేకింగ్ న్యూస్. తెలుగు న్యూస్ (వ్యూస్) చానళ్లు ఏమయ్యాయ్? ఆ చానళ్ల ప్రతినిధులు ఏ కలుగుల్లో దాక్కున్నారో తెలియడం లేదు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురించి ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉంటే..."కరోనా కరోనా" అంటూ ఎంత సేపూ ఆ పాటే పాడుతున్నారేందయ్యా?
ఇంతకూ లోకేశ్ గురించి బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని ప్రశ్నిస్తారా? అక్కడికే వెళ్దాం. కరోనాను తరిమే కొట్టే క్రమంలో ప్రధాని మోడీ లాక్డౌన్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు అంతా...తమ తమ ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.
మరి మన లోకేశ్ బాబు ఇంటి నుంచి ఎలా తప్పించుకున్నాడో తెలియదు కానీ...ఆయన ఒక్కసారిగా బయటికి వచ్చాడు. ఇంటిలో లోకేశ్ కనిపించకపోవడంతో, ఎప్పట్లాగే ట్విటర్లో ఆడుకుంటున్నాడేమో అని అక్కడ వెతికినా కుటుంబ సభ్యులకు కనిపించ లేదట. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కరోనా వేళ లోకం తెలియని లోకేశ్ ఎక్కడెక్కడికి వెళ్లాడో, ఏ మూలన ఏ కరోనా రోగి ఉన్నాడో, అమాయక జీవికి ఎక్కడ తగిలిస్తారోనని ఇంటిల్లిపాది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే ఇంట్లోనూ, ట్విటర్లోనూ 24 గంటలూ ఉండటంతో పిచ్చి పట్టినట్టై...మనసుకు కాస్త రిలాక్స్ కోసం లోకేశ్ అలా రోడ్డు మీదికి వచ్చాడు. సహజంగా ట్విటర్లో తప్ప మరెక్కడా కనిపించని, మాట వినపించని లోకేశుడు...భూమిపై ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యే సరికి...దేవతలు దివి నుంచి భువికి దిగి వచ్చినంత ఆశ్చర్యానికి, ఆనందానికి ఎల్లో మీడియాతో పాటు తెలుగు తమ్ముళ్లు లోనయ్యారు.
ట్విటర్ నుంచి భూమిపై అడుగు పెట్టిన లోకేశ్ మీడియాతో మాట్లాడడం నిజంగా బిగ్ బ్రేకింగ్గానే చెప్పుకోవాలి. మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ బాటలో వైసీపీ నేతలు నడుస్తున్నారని, ఇప్పటికీ 420 బుద్ధులు వదులుకోలేక పోతున్నారని తనదైన స్టైల్లో విమర్శలు చేశాడు. వీఐపీలమంటూ వైసీపీ నేతలు..డాక్టర్ల మాస్కులు కొట్టేయ్యడం దారుణమన్నాడు. ట్విటర్ తప్ప మరే లోకం తెలియని, తెలుసుకోవాలని అనుకోని లోకేశ్, తన పార్టీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు. ఆ తర్వాత తన ట్విటర్ గూట్లోకి యధావిధిగా చేరుకున్నాడు.