జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రానికి అంతా ఇళ్ల బాల్కానీల్లోకి చేరి చప్పట్లు కొట్టాలని, మీ కోసం పని చేస్తున్న వాళ్లను ఉత్సాహ పరచాలని మోడీ పిలుపునిచ్చారు. అదేదో అని మొదట అనుకున్నారు. దేశంలో ఎన్ని ఇళ్లకు బాల్కానీలుంటాయి? ఇండియాలో బాల్కానీలు ఉండే ఇళ్లెన్ని? ఈ విషయాలు శ్రీమాన్ మోడీగారికి తెలియనివా? అయినా పిలుపుని ఇచ్చేశారు. బాల్కానీలు ఉన్న వారి పరిస్థితి ఓకే, అవి లేని మోడీ భక్తులే రోడ్ల మీదకు వచ్చారు. తప్పట్లు, తాళాలూ పట్టుకుని రోడ్డెక్కి రచ్చ రచ్చ చేశారు!
జనతా కర్ఫ్యూ ప్రయోజనం కాస్తా ఆ రోజు సాయంత్రం ఉత్తరాదిన మోడీ భక్తులు రోడ్డెక్కి చేసిన హడావుడితో నీరు కారిపోయే ఉంటుంది. గుంపులు గుంపులుగా కూడి వారు రచ్చ చేశారు. ఇప్పుడేమో మోడీ దీపాలు అంటున్నారు. ఆదివారం లైట్లు ఆఫ్ చేసి దీపాలు ఆన్ చేయాలట.
ఇది ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో అని ఆందోళన చెందాల్సి వస్తోంది. మోడీ పిలుపును ఇచ్చాడు కాబట్టి.. సెలబ్రిటీలు దీన్ని తమను వార్తల్లో నిలిపే అవకాశంగా తీసుకోవచ్చు. వాళ్ల వైభవాలు వేరే. ఇళ్లలో లైట్లు ఆర్పినా, ఫొటోలు అందంగా వచ్చేలా లైటింగు పెట్టుకుని వారు ఆదివారం హడావుడి చేస్తారు. అయితే ఎటొచ్చీ ఉత్తరభారతదేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మోడీ భక్తులు.. మళ్లీ రోడ్ల మీదకు వస్తారేమో!
రోడ్లు ఎక్కి దీపాలు పట్టుకుని కరోనా మీద విజయం సాధించినట్టుగా ర్యాలీలు గట్రా తీస్తారేమో! జనతా కర్ప్యూ రోజున వారు చేసిన రచ్చను చూసి.. ఆదివారం రోజున మరెలాంటి రచ్చ చేస్తారో అని తటస్థులు భయపడుతూ ఉన్నారు. ఇలాంటి తర్కం లేని పిలుపులను మోడీ ఎందుకు ఇస్తారో, ఎందుకు అనవసరమైన రచ్చలు చేయిస్తారో అని తల పట్టుకోవాల్సి వస్తోంది సామాన్యులు. చూడాలి మోడీ భక్తుల ఆదివారం ఎలాంటి రచ్చలు రేపుతుందో!