దేశవ్యాప్తంగా అమలువుతోన్న ‘లాక్ డౌన్’ ఈ నెల 14వ తేదీతో ముగియాల్సి వుంది. మరోపక్క, కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 2 వేలకు చేరుకుంది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య చాలా ఎక్కువగా వుండడం ఆందోళన కలిగించే విషయమే. ప్రధానంగా ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్కి వెళ్ళి వచ్చిన వారిలో చాలామందికి కరోనా వైరస్ సోకడం, వారి నుంచి వారి బంధువులు, సన్నిహితులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అవుతుండడంతో.. ప్రమాధ ఘంటికలు మోగేసినట్లే కన్పిస్తోంది.
‘21 రోజుల లాక్డౌన్ని మరికొన్నాళ్ళు పొడిగించే ప్రతిపాదన ఏమీ లేదు..’ అని ఇటీవలే కేంద్రం ప్రకటించినా, తాజా పరిణామాలు చూస్తోంటే, ఏప్రిల్ 14 తర్వాత కూడా మరికొన్ని రోజులు ‘లాక్డౌన్’ కొనసాగే అవకాశాలున్నాయనే విషయం సుస్పష్టమవుతోంది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
మరోపక్క, ఈ రోజు సాయంత్రం లేదా రేపు.. కేంద్రం నుంచి మరో ‘కీలక ప్రకటన’ రాబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లాక్ డౌన్ని మరింత కఠినంగా పాటించాల్సిందేనని ఇప్పటికే ఒకటికి పదిసార్లు కేంద్రం, రాష్ట్రాల్ని ఆదేశించింది. అయినాగానీ, ఫలితం పెద్దగా కన్పించడంలేదు. కొన్ని చోట్ల జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ‘కరిÄన నిర్ణయాలు’ తప్పవు అనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి.
అయితే, ఆ ‘కఠిన నిర్ణయాలు’ ఎలా వుంటాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. దేశంలో 2 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా, అమెరికా సహా ఇటలీ, స్పెయిన్, ఇరాన్ తదితర దేశాలతో పోల్చితే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త నెమ్మదిగానే వుంది. అయినాగానీ, ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, రెండు మూడు రోజుల వ్యవధిలోనే పరిస్థితుల్ని తల్లకిందులు చేసేయగల శక్తి కరోనా వైరస్కి వుంది మరి.
కొద్ది రోజుల క్రితమే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏప్రిల్ 7 తర్వాత కొత్తగా తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యే అవకాశం వుండకపోవచ్చని చెప్పారు. ఆ 7వ తేదీకి ఇంకో ఐదు రోజులు మాత్రమే వుంది. కానీ, పరిస్థితులేమో.. కొంత ఆందోళనకరంగానే వున్నాయి. తెలంగాణలోనే పరిస్థితి ఇలా వుంటే, దేశంలో ఇతర రాష్ట్రాల్లో పరిస్థితేంటి.? 21 రోజుల లాక్ డౌన్ ముగిసే సరికి దేశంలో పరిస్థితులు ఎలా మారతాయి.? వేచి చూడాల్సిందే.