ఒక వైపు మానవ జాతి మనుగడకే ప్రమాదకరంగా కరోనా తయారైందని రాస్తూ...మరో వైపు ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ సీఎం జగన్పై విషాన్ని కక్కడం మాత్రం ఆర్కే మరిచిపోలేదు. వైఎస్ జగన్పై పగ తీర్చుకునేందుకు ఆర్కే కరోనాను ఓ అవకాశంగా, ఆయుధంగా తీసుకున్నాడు. చేతిలో కలం ఉంది కదా అని , తానేం రాసినా ప్రశ్నించే వాళ్లే లేరని విర్రవీగుతున్న ఆర్కే...అగ్రరాజ్యం అమెరికా పెత్తనాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నాడు.
చూడండి...చూడండి....అగ్రరాజ్యం వద్దనున్న సంపద గానీ, ఆయుధ సంపత్తి గానీ...అమెరికన్లను కరోనా నుంచి రక్షించలేకపోతున్నాయని అవహేళన చేస్తున్న ఆర్కే....దాని నుంచి మాత్రం తానేమీ గుణపాఠం నేర్చుకోలేదు. కరోనా నుంచి లోకం గుణపాఠం నేర్వాలని హితవు చెబుతున్న ఆర్కే...తాను మాత్రం అందుకు అతీతమనే రీతిలో తన వక్రబుద్ధిని, పక్షపాత వైఖరిని సిగ్గూఎగ్గూ లేకుండా రాతల్లో ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
ఈ వారం ‘కరోనా కార్చిచ్చు’ శీర్షికతో ఆర్కే కొత్త పలుకు ఆర్టికల్ రాశాడు. ఎప్పట్లాగే జగన్పై ఈ వారం కూడా దుమ్మెత్తి పోశాడు.
‘ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విషయానికి వస్తే.. ఆయన కరోనా వైరస్ అనేది ఒక మహమ్మారి అని గుర్తించడానికి కూడా ప్రారంభంలో అంగీకరించలేదు. ఇప్పటికీ ఆయన ఈ వైరస్ ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఈ ముప్పును గుర్తించడానికి ఇష్టపడని వారి నుంచి ఇంతకంటే మెరుగైన చర్యలను ఆశించలేం. ఏపీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్య వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలిసింది. ‘‘అతడు ఎవరి మాటా వినడు. సమస్యను అర్థం చేసుకోడు. ఉత్తర కొరియా అధినేత కిమ్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు..’’ అన్న వ్యాఖ్యలు కేసీఆర్ తన సన్నిహితుల వద్ద చేశారని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు కూడా జగన్మోహన్రెడ్డి వైఖరిని ఆక్షేపిస్తున్నారు’....జగన్ గురించి ఆర్కే రాసిన పిచ్చి రాతలివి.
కరోనా గురించి సీఎం జగన్ సీరియస్గా తీసుకోకపోతే పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తక్కువ నమోదు అయ్యాయో ఆర్కే సమాధానం చెబుతాడా? వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేయడం వల్ల ఏపీలోని ప్రతి ఒక్కరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే కరోనాను మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కట్టడి చేశారనేది వాస్తవం. పాలకుడు జగన్ కావడంతో, ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి ఆర్కే మనసు అంగీకరించడం లేదు.
మరి జగన్ సర్కార్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న ఆర్కే....కరోనా వైరస్ విషయాన్ని తాను మాత్రం ఎందుకు సీరియస్గా తీసుకోలేదు. ఒక వైపు వార్తా పత్రికల వల్ల కూడా కరోనా వ్యాప్తి జరుగుతుందన్న ప్రచారం భయపెడుతుంటే, తాను మాత్రం ఆంధ్రజ్యోతిని ఎందుకు మూసివేయలేదు? పైగా వార్తా పత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాపించిదనే తప్పుడు సమాచారాన్ని ఆంధ్రజ్యోతి జనంలోకి తీసుకెళుతున్నదనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. తన వ్యాపారాన్ని మాత్రం కొనసాగించేందుకు రకరకాల వ్యక్తులు, సంస్థల అభిప్రాయాలకు ప్రతిరోజూ తన పత్రికలో ప్రాధాన్యం ఇస్తున్న విషయం వాస్తవం కాదా? తన పత్రికలో గత మూడు నాలుగు రోజులుగా వార్తా పత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ప్రచురించిన వార్తల కథేంటో తెలుసుకుందాం.
‘వార్తాపత్రికలతో కరోనా వైరస్ వస్తుందన్నది ఈ శతాబ్దపు పెద్ద జోక్. ఈ ప్రచారంలో వాస్తవం లేదు. కరోనాపై అవగాహన కల్పించడంలో పత్రికలే కీలక పాత్ర పోషించాలి’....అని ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం అభిప్రాయపడ్డారు. అసలు డాక్టర్ సమరానికి, వార్తా పత్రికలకు ఏంటి సంబంధం? కరోనా అనేది ఎయిడ్స్ లాంటి రోగం కూడా కాదు. మరి సెక్స్ డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సమరం అభిప్రాయానికి ఇక్కడ విలువ ఎక్కడ?
అలాగే, ‘పత్రికలతో కరోనా వ్యాపించదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ’ శీర్షికతో మరో వార్త క్యారీ చేశారు. ఈ వార్తా కథనం ఇలా సాగింది.
‘మీడియా కూడా అత్యవసర సేవల్లో భాగమేనని, లాక్డౌన్ సమయంలో మీడియా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సైతం మార్చి 19న ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం.. వార్తాపత్రికలను తాకొచ్చని, అవి సురక్షితమేనని తేల్చిచెప్పింది. మన ఇంటికి వచ్చే పేపర్లు కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినా అవి సురక్షితమేనని, ముద్రణ నుంచి ఇళ్లకు చేరే దాకా అనేక దశల్లో, పలు వాతావరణాల్లో ప్రయాణించే వార్తాపత్రికల ద్వారా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని తెలిపింది’ అని ఆంధ్రజ్యోతిగా చెబితే పాఠకులు, ప్రజలు నమ్మరనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసనీయతను వాడుకోవాలని చూడటం నిజం కాదా?
‘శానిటైజ్డ్ వార్తా పత్రికగా ‘ఆంధ్రజ్యోతి’ శీర్షికతో ఓ చక్కటి వార్త ప్రచురించారు.
‘ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి శానిటైజ్డ్ వార్తాపత్రికగా ‘ఆంధ్రజ్యోతి’ పాఠకుల ముందుకు వస్తోంది. తద్వారా వార్తల నాణ్యతలోనే కాదు.. పాఠకుల ఆరోగ్యం విషయంలోనూ రాజీపడేది లేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపుతోంది. పత్రికారంగంలో ‘ఆంధ్రజ్యోతి’కి ఉన్న ప్రత్యేకతను గుర్తుచేస్తూ.. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో ఎలాంటి అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రింటింగ్ జరిగే క్రమంలోనే పత్రికలను శానిటైజర్ స్ర్పేతో శుద్ధి చేస్తున్నారు’...అని రాసుకొచ్చారు.
ప్రధానంగా ఆర్కే ఓ ముఖ్య విషయాన్ని విస్మరిస్తున్నాడు. పత్రికను శానిటైజ్ చేస్తే ప్రయోజనం లేదు. అందులో ప్రచురించే వార్తలను శానిటైజ్డ్ చేయాలి. శుభ్రమైన, ఆరోగ్యకరమైన వార్తలను రాయడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పైన పేర్కొన్న ఉదాహరణలు....కరోనాను ఆర్కే సీరియస్గా తీసుకోలేదని చెప్పేందుకే. కరోనాను పారదోలడంలో కేవలం ప్రభుత్వాలే అన్నీ చేయలేవు. ప్రజలంతా సహకరిస్తేనే కరోనాను కట్టడి చేయగలం. ఆర్కే వరకూ ఒక నీతి, జగన్కైతే మరో నీతా?
సీఎం జగన్పై తన అక్కసునంతా వెళ్లగక్కి చివర్లో మాత్రం...ఏది ఏమైనా పాలకులను, అధికార యంత్రాంగాన్ని విమర్శించడానికి ఇది సరైన సమయం కాదని రాయడం ఆర్కేకు మాత్రమే తెలిసిన నీచమైన విద్య.
ఆర్కే రాతల్లోని కొన్ని హితవు వాక్యాలను తీసుకుని ఆయనకే అప్పచెబుదాం. ఎందుకంటే అవి ఆయనకు కూడా వర్తిస్తాయి కాబట్టి. ఆర్కే రాతల్లోని ప్రత్యేకత ఏమంటే తనకు తానే హితవు చెప్పుకుంటాడు. ఈ వారం కూడా అదే జరిగింది.
జర్నలిజాన్ని విచ్చలవిడిగా విధ్వంసం చేసుకుంటూ పోవడం వల్లే కరోనా వైరస్ లక్షణాలున్నరాతలు తన కలం నుంచి పుట్టుకొస్తున్నాయని ఇప్పటికైనా ఆర్కే గుర్తించడం మంచిది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంది జర్నలిస్టులున్నప్పటికీ తనకు మాత్రమే నిద్రలో కూడా వైఎస్ జగన్ కలలో ఎందుకొస్తున్నాడో ఆర్కే ఆలోచించాలి. కరోనా కారణంగా దినపత్రికల పేజీలు తగ్గడంతో వార్తల కాలుష్యం, విష వాయువుల కాలుష్యం తగ్గాయని నివేదికలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పత్రికల బెడద మరింత తగ్గితే మనిషి బతికే కాలం కూడా పెరుగుతుందని పలు ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి.
ఫోర్త్ ఎస్టేట్గా చెబుతున్న జర్నలిజాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్న ఆర్కే, రామోజీలాంటి మీడియా యజమానులు జర్నలిజంతో పాటు ప్రజల కోసం తాము ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కరోనా వైరస్ గుర్తు చేస్తోంది. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ప్రకృతి కోసం ఎంతో కొంత, ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుండగా.. ఆర్కే, రామోజీ, టీవీ5 యజమానితో పాటు మరికొందరు ఎల్లో మీడియా యజమానులు మాత్రమే మీడియాను చెరబట్టారు. ఆ చెర నుంచి కనీసం కరోనా అయినా మీడియాకు విముక్తి కల్పిస్తుందో, లేదో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.