అక్షింతలు పడ్డాకే.. మాట మార్చాడా?

భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఉన్నపళంగా ప్లేటు ఫిరాయించారు. నిన్నటిదాకా రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం.. పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి చెందిన అంశం అంటూ.. జగన్మోహన రెడ్డి అధికార వికేంద్రీకరణ ప్రయత్నానికి వత్తాసు పలుకుతూ వచ్చిన జీవీఎల్ నరసింహారావు.. ఇవాళ హఠాత్తుగా రాజధాని మొత్తం అమరావతిలోనే ఉండాలంటూ తమ పార్టీ భాజపా రాజకీయ తీర్మానం చేసిన సంగతిని ప్రస్తావిస్తున్నారు. అయితే.. భాజపా కేంద్ర నాయకత్వం నుంచి తనకు అక్షింతలు పడిన తర్వాతనే.. జీవీఎల్ తన వైఖరి మార్చుకున్నాడనే అభిప్రాయం ఇప్పుడు పలువురిలో కలుగుతోంది.

నిజానికి జీవీఎల్ పుణ్యమాని రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ రెండు రకాల ధోరణులు అనుసరిస్తున్నదనే అభిప్రాయం ప్రజలకు కలిగింది. కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి తదితరులంతా అమరాతి రాజధానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉండగా... జీవీఎల్ మాత్రం అధికార వికేంద్రీకరణకు, మూడు రాజధానులకు జైకొట్టారు. భాజపా ఈ విషయంలో రెండు నాల్కల ధోరణి అన్నట్లుగా ప్రచారం జరిగింది.

తదనంతర పరిణామాల్లో ఏం జరిగిందో తెలియదు గానీ.. తాజాగా జీవీఎల్ నరసింహారావు మాట మార్చారు. ఒకవైపు అమరావతి కొనసాగాలనే రాజకీయ తీర్మానం గుర్తు చేస్తూనే... మరోవైపు హైకోర్టును కర్నూలుకు తరలించే విషయం న్యాయశాఖ మంత్రితో మాట్లాడతానని ఆయన అంటున్నారు. నిజానికి కర్నూలులో హైకోర్టు అనేది భాజపా ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానం. తమ పార్టీ వాగ్దానాన్ని జగన్ అమలు చేస్తోంటే.. దాని మీద భాజపా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

విశాఖ గొడవలనుంచి మాత్రం.. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు చేసినదే ఇప్పుడు జగన్ కూడా చేశారని అంటూనే... ఈ రెండు పార్టీలూ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాల్జేస్తున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించడం విశేషం.

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

Show comments