పవన్‌కు ఆ క్రెడిబిలిటీ ఇంకా మిగిలుందా?

రైతన్నల కన్నీళ్లు తుడవడానికి ఏ నాయకుడు ప్రయత్నించినా సరే.. వారికి చేయెత్తి మొక్కవలసిందే. వారి గురించి ఎవరు పట్టించుకున్నా ప్రత్యేకంగా.. వారి కృషిని ప్రస్తావించవలసిందే. అలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. రాయలసీమ రైతుల సాగునీటి కష్టాలను గురించి ఒక కసరత్తు ప్రారంభించారు.

సుజలసీమ పేరుతో.. రాయలసీమ నీటి ఇక్కట్లు తీర్చడానికి ఏం చేయవచ్చునో మేథోమధనం చేయడానికి, కార్యచరణ ప్రణాళికను రూపొందించడానికి ఆయన సీమ జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఇందుకోసం సీమ ప్రజలు, సీమ రైతుల బాగు కోరుకునే వారినుంచి సలహాలు సూచనలు కూడా అర్థిస్తున్నారు. ఈ ప్రయత్నం అభినందనీయమే. అయితే.. ఇలాంటి ప్రయత్నాన్ని ఫలితం దిశగా నడిపించగలరనే క్రెడిబిలిటీ ప్రజల్లో పవన్ కల్యాణ్ కు ఉందా? ఇప్పటికే ఆయన చేసిన అనేకానేక రాజకీయ గిమ్మిక్కుల్లాగానే ఇది కూడా మిగిలిపోతుందా? అనే అనుమానం ప్రజలకు  కలుగుతోంది.

పవన్ కల్యాణ్ తాజాగా ప్రకటించిన ప్రకారం.. విజయవాడ కార్యాలయంలో సుజలసీమ పేరుతో ఒక ప్రత్యేకవిభాగం ఉంటుంది. వీరి ఆధ్వర్యంలో ప్రజలు, విజ్ఞుల నుంచి వారం రోజుల పాటు సూచనలు  స్వీకరిస్తారు. ఆ తర్వాత.. ప్రతి రాయలసీమ జిల్లా లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. చిన్నా పెద్దా కలిపి 23 నదులున్న ప్రాంతానికి నీటి ఇక్కట్లు లేకుండా చూడడానికి  ఒక ప్రణాళికను రూపొందిస్తాం అంటున్నారు.

అయితే ఇలాంటి మంచి ప్రయత్నాలు పవన్ కల్యాణ్ గతంలో చాలా చేశారు. అన్నీ బూడిదలో పోసిన పన్నీరు వంటి ప్రయత్నాలే. చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా అవసరం లేదంటూ.. తన స్థాయి డ్రామాలు తాను రక్తికట్టిస్తున్నప్పుడు.. పవన్ కల్యాణ్ ఒక నిజనిర్ధరణ కమిటీ వేశారు. అప్పట్లో పవన్ కు చిత్తశుద్ధి ఉన్నదేమో అని మేధావులు కొందరు నిజంగానే నమ్మారు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్, ఉండవిల్లి అరుణ్ కుమార్, మాజీ న్యాయమూర్తులు ఇంకా అనేకులు ఆయనకు సహకరించారు. కొన్ని రోజుల తరబడి సుదీర్ఘమైన కసరత్తు జరిగింది.

చివరికి ఆ కమిటీ ఏం తేల్చిందో.. హోదావిషయంలో రాష్ట్రానికి ద్రోహం చేసిందెవరో? దానిని సాధించడం ఎలాగో ఏమీ తేల్చకుండా పవన్ ఆ కసరత్తును సాంతం మడతపెట్టేశారు. అలాగే జగన్మోహన రెడ్డి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు అన్నారు! ఆ కసరత్తు ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు సీమ సాగునీటి కష్టాలు తీరుస్తా అంటున్నారు. దీన్నయినా చిత్తశుద్ధితో ఒక కొలిక్కి తీసుకువచ్చి ప్రజలకు హితం చేస్తారా? లేదా, షూటింగ్ షెడ్యూలు గ్యాప్ లలో రౌండ్ టేబుల్ మీటింగులు పెడుతూ.. ప్రహసనప్రాయంగా నడుపుతారా? అనేది తేలాల్సి ఉంది.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

Show comments