బొత్సతో తక్కువ మాట్లాడితే మంచిది కదా?

మంత్రి బొత్స సత్యానారాయణ ఎంతో సీనియారిటీ ఉన్న కీలక నాయకుడు. ఇప్పుడు రాజధాని ఏర్పాటు కాబోతున్న కారణంగా.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెరిగిన ప్రాధాన్యం. నేపథ్యంలో ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తోంది. తాజాగా.. విశాఖలో చంద్రబాబు అడుగుపెట్టిన తర్వాత.. జరిగిన రాద్ధాంతం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏ ఉద్దేశంతో ఓ మాట అన్నారో గానీ.. అది చంద్రబాబు ఏ పాపమూ ఎరగడన్నట్లుగా ఉండడం గమనార్హం.

విశాఖ పరిణామాల గురించి బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం అన్నారు. పెళ్లికి వెళ్తూ వెళ్తూ కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేశారనేది చంద్రబాబు ఆరోపణ. ఈ మాటలు ఎవరైనా వింటే.. నిజంగా చంద్రబాబు మీద సానుభూతి కలుగుతుంది. చంద్రబాబునాయుడు విశాఖ వచ్చింది కేవలం పెళ్లికి వెళ్లడానికి కాదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మక దుష్ప్రచారాన్ని కొనసాగించడానికి ఆయన విశాఖ వచ్చేరనేది అందరికీ తెలిసిన సంగతి.

బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలతో రాజకీయ ప్రత్యర్థులకు ఉచితంగా ఎడ్వాంటేజీ అందివ్వడం ఇది తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో ఆయన మాటలు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతుంటాయి. జగన్ ఢిల్లీ వెళ్లి రాగానే.. అవసరమైతే ఎన్డీయేలో కలుస్తాం అనే మాటలు మాట్లాడి బొత్స పెద్ద చర్చకే తెరతీశారు. ఆ తర్వాత ఆయన నాలుక కరచుకోవాల్సి వచ్చింది. ఒకటి రెండు సందర్భాల్లో తన మాటలు తను అనుకున్న ఉద్దేశంతో కాకుండా భిన్నార్థంతో ప్రజల్లోకి వెళ్లే సరికి.. బొత్స మీడియాతో నేరుగా మాట్లాడకుండా ప్రెస్ నోట్ మాత్రమే పంపడం కూడా జరిగింది.

సాధారణంగా  బొత్స ప్రెస్ మీట్ లలో చాలా బోళాగా మాట్లాడుతుంటారు. విలేకర్లు ఏ మాటను ఎలా వక్రీకరించగలరో.. ముందు వెనుక చూసుకోకుండా జవాబులు ఇచ్చేస్తుంటారు. ఇలాంటి బోళాతనం వల్లనే తరచూ ఆయనకు చిక్కులు వస్తుంటాయని.. ఆయన తీరు గురించి బాగా ఎరిగిన వారు చెబుతుంటారు. ఇంత సీనియర్ అయిన తర్వాత కూడా ఆయన పద్ధతిమార్చుకోవాలనేది కొందరి సూచన. నేరుగా ప్రెస్ తో  మాట్లాడే బదులు ప్రెస్ రిలీజ్ ఇస్తోంటే స్పష్టత ఉంటుందని కూడా కొందరు అంటున్నారు.

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

Show comments