ఏపీ కాంగ్రెస్.. ఈ పేరే కామెడీ అయిపోయింది. ఏపీలో కాంగ్రెస్ ఎక్కడుంది? అనే ప్రశ్నకు సమాధానం వేరే అక్కర్లేదు. ఏపీ లో కాంగ్రెస్ లేదనే విషయం ప్రజలందరికీ అర్థం అయిపోయింది. తమను గుర్తించమని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా తలకిందుల తపస్సు చేసినా ప్రజలు గుర్తించేలా లేరు పాపం! రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ ను అలా శూన్య స్థితిలోకి నెట్టేసింది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో తామున్నామని కాంగ్రెస్ వాళ్లు అనిపించుకుంటున్నారు. కామెడీ చేసైనా తమ ఉనికిని చాటుకోవాలనికి వాళ్లు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. ఎన్నికలకు ముందేమో తమ ప్రకటనలతో కాంగ్రెస్ వాళ్లు కామెడీలు చేశారు. ఎన్నికలకు ముందేమో జగనే తమ టార్గెట్ అని ప్రకటించి కాంగ్రెస్ వాళ్లు మరింత అభాసుపాలయ్యారు. ఇప్పుడు కమిటీలతో కామెడీ చేస్తూ ఉన్నారు.
ఏకంగా 11 మంది పీసీసీ ఉపాధ్యక్షులను నియమించిందట కాంగ్రెస్ హై కమాండ్! ఇక లేకపోయారా? బహుశా లేరేమో! ఉన్న నేతలందరికీ తలా ఒక హోదా ఇచ్చేసి ఉండవచ్చు. అయినా నేతలు మిగిలినట్టుగా ఉన్నారు! మరో 18 మందికి పార్టీ కార్యదర్శుల హోదాలట! కొందరు మహా మహా నేతలకు రెండు హోదాలట. అలాంటి రెండు హోదాలను పొందిన వారిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి శ్రీమాన్ కిరణ్ కుమార్ రెడ్డి గారున్నారట! ఆపై.. ఇంకా సమన్వయ కమిటీలట. మరి ఎవరితో సమన్వయం చేయడానికో!
ఈ కమిటీలు..కంగాళీలతో కాంగ్రెస్ పార్టీ 2024 కళ్లా ఏపీలో బలోపేతం అవుతుందట, ఆ లక్ష్యంతోనే కమిటీలు వేశారట. ఈ మధ్యకాలంలో పొలిటికల్ జోక్స్ తో మనస్ఫూర్తిగా నవ్వుకోని వాళ్లెవరైనా ఉంటే.. ఏపీ కాంగ్రెస్ కమిటీలను పరిశీలిస్తే.. అంతకన్నా వేరే కామెడీ అవసరం లేకపోవచ్చు!