ఇంట దిక్కులేదు.. దేశమంతా చేస్తారట!

ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత! కానీ, ఇంట గెలిచే ఆలోచన గానీ, సత్తా గానీ లేని నాయకులు.. దేశమంతా గెలిచేస్తామని అంతలావు డైలాగులు పలుకుతూ ఉంటే విన్నవారికి ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో సీపీఐ నాయకులు చెబుతున్న మాటలు కూడా ఇలాగే నవ్వు తెప్పిస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కమ్యూనిస్టులు తొలినుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా సీపీఐ ప్రధానన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ..  ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యమంత్రికి సూచనలు, సలహాలు ఎవరు ఇస్తున్నారో అర్థం కావడంలేదని డి.రాజా వాపోతున్నారు. అమరావతినుంచి రాజధానిని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని సీపీఐ నాయకులు అంటున్నారు. సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ఢిల్లీ స్థాయిలో  ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు చెబుతున్నారు. అందుకోసం వారు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారట.

చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ.. వారు అడుగుతున్న డిమాండ్ కు ఉన్న ప్రజాబలం ఎంత? మూడు ప్రాంతాలకు రాజధానుల్ని వికేంద్రీకరించడం అనే ఐడియాకు అమరావతి ప్రాంతంలో తప్ప తతిమ్మా అన్నిచోట్ల నుంచి ప్రజల్లో మంచి స్పందన ఉంది. నిజం చెప్పాలంటే.. చివరికి అమరావతి ప్రాంతంలో కూడా.. ప్రతి వ్యక్తీ ఈ పోరాటాల్ని సమర్థిస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు. అక్కడ వర్గాలున్నాయి. ఇంకాస్త గట్టిగా పరిశీలిస్తే.. గుంటూరు జిల్లా అంతటా  కూడా అమరావతి రైతుల పోరాటం పట్ల సానుభూతి సమంగా లేదు. పొరుగు జిల్లాలు కృష్ణా, ప్రకాశం నుంచి కూడా వీరికి లభిస్తున్న మద్దతు అత్యల్పమే. అంతకు మించి, ఇతర జిల్లాలకు వెళితే.. అక్కడి ప్రజలంతా వీరి దీక్షలను ఈసడించుకుంటున్నారు. ‘ఏం అమరావతి మాత్రమేనా.. మా ప్రాంతాలు అభివృద్ధి కావొద్దా’ అంటూ ఎదురు ప్రశిస్తున్నారు.

కనీసం ఒక రాష్ట్రంలో కూడా ప్రజల మధ్య ఏకరీతిగా సానుభూతి లేని బలహీనమైన అంశాన్ని తీసుకుని దాని మీద దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రకటిస్తున్నదంటే.. సీపీఐ ఎంతగా ప్రజల మనోగతాలకు దూరమైపోతోందో కదా అని పలువురు విమర్శిస్తున్నారు. అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో ఒకటో రెండో సీట్లు గెలవగల తమ సహజమైన బలాన్ని కూడా చంపేసుకుంటున్నదని ప్రజలకు దూరం అవుతున్నదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు

Show comments