రోజాను అడ్డుకుంటే అసెంబ్లీనీ ఎత్తేస్తారా?

ఎమ్మెల్యే రోజాకు అమరావతి నిరసనల సెగ తగిలింది. అవకాశం దొరికితే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడంలో, నిలదీయడంలో దుడుకుగా ప్రవర్తించడం తరచుగా జరుగుతూనే ఉంది. తద్వారా పరిస్థితి చేయి జారినప్పుడు.. సహజంగా ఆందోళనకారుల మీద సానుభూతి కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి కూడా అదే జరిగింది. కానీ.. ఆందోళనకారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోజా అన్నమాటలు కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. అసెంబ్లీని కూడా ఇక్కడినుంచి ఎత్తేయాలా? అంటూ ఆమె మాట్లాడిన మాటలు మాత్రం అభ్యంతరకరం.

ఎమ్మెల్యే రోజా నాగార్జున యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగతి తెలుసుకుని.. ఆమెను అడ్డగించాలని నిర్ణయించిన ఆందోళన కారులు గేట్ల వద్ద పొంచి ఉండగా.. మరో మార్గంలోంచి రోజా వెళ్లిపోయారు. పక్కనే ఉన్న పెదపరిమి గ్రామంలో ఆమెను మహిళలు అడ్డుకున్నారు. జై అమరావతి అనాల్సిందిగా డిమాండు చేశారు. మొత్తానికి రోజా గంటకు పైగా కారులోనే నిర్బంధం తరహాలో ఉండిపోవాల్సి వచ్చింది.

అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ ఆందోళన కారులపై నిప్పులు చెరిగారు. తనను అనరాని మాటలు అన్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలుగా కూడా మమ్మల్ని ఇక్కడ తిరగనివ్వరా? అసెంబ్లీకి కూడా మేం రావొద్దా? అసెంబ్లీనీ ఉండనివ్వరా అంటూ ఆగ్రహించారు.

ఈ మాటల ద్వారా నన్న అడ్డుకుంటే.. అసెంబ్లీ కూడా ఇక్కడ ఉండదు అని రోజా బెదిరంచదలచుకున్నారో లేదా.. ఆ కోపంలో ఫ్లోలో అనేశారో తెలియదు. జగన్మోహన రెడ్డి మూడు ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా.. రాజధాని ఏర్పాటును విస్తరించాలనుకున్నారు. అమరావతి ప్రజలు ఇన్నాళ్లపాటూ రకరకాల ఆశలతో ఉన్నారు గనుక.. అవి భంగపడి ఇప్పుడు ఇలా ఆందోళనలు చేస్తుండవచ్చు గాక.. అంత మాత్రాన అమరావతి ప్రాంతానికి ఇచ్చిన అసెంబ్లీ హామీని కూడా వమ్ము చేస్తారని అనుకోనక్కర్లేదు.

అయితే రోజా ఇలా.. అసెంబ్లీని కూడా ఉండనివ్వరా.. అంటూ మాట్లాడడం, ఆందోళనకారుల్ని మరింత రెచ్చగొట్టే వ్యవహారం మాత్రమే అవుతుంది. ఆందోళన జరుగుతున్నప్పుడు ఎంతో ఓపికగా గంటకు పైగా కారులోనే ఉండిపోయి.. పరిస్థితి చేయిదాటకుండా సహకరించిన రోజా.. అదే మాదిరిగా.. మాటల్లో కూడా సంయమనం పాటిస్తే బాగుంటుంది.

నా మీదనే దాడి చేయిస్తావా

Show comments