ఎమ్బీయస్‌: దగాపడ్డ ప్రకాశం పంతులు గారు

ఉండవల్లి ‘‘వైయస్సార్‌తో..’’ అనే పుస్తకం రాశారు. పసల సూర్యచందర్రావు అనే కాంగ్రెసు నాయకుడు తనతో చెప్పిన ఆంధ్రకేసరి ప్రకాశం గారి ఉదంతాన్ని వైయస్‌కు చెపితే ఆయన చాలా చలించిపోయాడని దానిలో రాశారు. అది తెలుసుకుంటే ధర్మసంకటం అనే పరిస్థితి ఏమిటో వేరే వివరించనక్కరలేదు. దానిలో ప్రకాశం గారు చేసిన పనిని అర్థం చేసుకోవాలంటే ఆయన వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకోవాలి. అందుకు ఉపోద్ఘాతంగా రెండు విషయాలు రాస్తాను.

మీలో చాలామందికి తెలిసి వుంటుంది. ప్రకాశంగారు నిరుపేదగా జన్మించారు. స్వయంకృషితో లాయరై, బారిస్టరై విపరీతంగా ఆర్జించారు. అయితే ఆస్తంతా స్వాతంత్రోద్యమానికి ఖర్చు పెట్టేశారు. ఎవరైనా తన దగ్గరకు వచ్చి సాయం అడిగితే జేబులో ఎంతుంటే అంతా యిచ్చేసేవారు. ఆయన అలా యిచ్చేస్తున్నాడని ఆందోళన పడి అభిమానులు, ప్రజలు ఆయనకు విరాళాలు యిచ్చేవారు. ఆయన దాన్ని దాచుకునేవాడు కాదు. మళ్లీ అదంతా అర్థులకు యిచ్చేసేవాడు. జేబులో డబ్బుందా లేదా అన్న చింతే వుండేది కాదాయనకు.

ప్రతాప్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అనేకమంది దర్శకులకు, నటీనటులకు తొలి అవకాశం యిచ్చిన నిర్మాత కె.రాఘవకు మా ‘‘హాసం క్లబ్‌’’లో సన్మానం చేసినప్పుడు ఆయన ఒక ఉదంతం చెప్పాడు. రాఘవ అనాథ.  పొట్టకూటి కోసం మద్రాసు చేరి ప్రకాశం గారి దగ్గర కారు తుడిచే కుర్రాడిగా చేరారు. అప్పుడాయన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఓ రోజు పొద్దున్నే కారులో చెంగల్పట్టుకి బయలుదేరారు. దారిలో ఆకలేసి టిఫెన్లు తిందామన్నారు. రాఘవ వెళ్లి దగ్గర్లో ఉన్న హోటల్లో టిఫెన్లు కట్టించుకుని వస్తే అందరూ తిన్నారు. బిల్లు ఎంతయింది అంటే రెండో, మూడో రూపాయలైంది. ప్రకాశం తన సెక్రటరీ కేసి తిరిగి, ఇచ్చేయ్‌ అన్నారు. ‘మీరు వంద రూపాయలిచ్చి, అది ఖర్చయ్యాక మళ్లీ అడగమంటారు. వందా నిన్ననే ఖర్చయిపోయాయి. జేబులో ఏమీ లేదు’ అన్నాడతను. ప్రకాశం గారి జేబు ఎప్పటిలాగానే ఖాళీ. ఇక మిగిలింది డ్రైవరు, క్లీనర్‌ రాఘవ.

ప్రకాశం రాఘవతో ‘‘వెళ్లి ఆ హోటల్‌ వాడితో ఇలా ప్రకాశం తాలూకు అని చెప్పు. చెంగల్పట్టులో ఎవరినైనా అప్పడిగి, తిరిగి వచ్చేటప్పుడు బాకీ తీర్చేస్తామని చెప్పు’’ అన్నారు. రాఘవ చెప్పగానే హోటల్‌ వాడు అయ్యయ్యో ప్రకాశం గారా, టిఫిన్‌ తెప్పించుకున్నది అంటూ మరిన్ని టిఫిన్లు ప్యాక్‌ చేయించి, కారు దగ్గరకు వచ్చి ఆయనకు దణ్ణం పెట్టి, డబ్బూగిబ్బూ ఏమీ వద్దు, మీలాటి వారు నా హోటల్‌ టిఫిన్‌ తినటమే నా అదృష్టం అని చెప్పుకున్నాడు.  అదీ ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి. డబ్బు పట్ల ఆయన నిర్లక్ష్యం. ప్రకాశం గారు మనుష్యులను నమ్మి బోల్తా పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తన ఆత్మకథలో ఆయన రాసుకున్న ఒక ఘట్టాన్ని చెపుతున్నాను.

ప్రకాశం ‘‘స్వరాజ్య’’ అనే పత్రికను పెట్టడానికి ఓ కంపెనీ నెలకొల్పి దానికి ఎండీగా తనుంటూ, ఇన్వెస్టరుగా తన భార్య పేరు పెట్టారు. ప్రెస్‌ పెట్టడానికి ఒక యింటిని నెలకు రూ. 300 అద్దెపై మూడేళ్ల లీజుకు తీసుకున్నారు. ఈయన జైలుకి వెళ్లి వస్తూండడంతో పత్రిక నష్టాల్లో పడింది. 1932లో ఆయన అరెస్టు అయ్యేనాటికి లినోటైపు కంపెనీకి, యింటి యజమానికి రూ. 20 వేల దాకా బాకీలు పడ్డారు. అయితే లక్షలు విలువ చేసే మెషినరీ అక్కడ వుంది. పత్రిక ఆగిపోతుందని భయపడిన కంపెనీ మేనేజరు కృపానిధి  యిల్లు గలాయన సూర్యనారాయణ వద్దకు వెళ్లి ‘‘అద్దె బకాయికు ఒత్తిడి చేయకండి, పైన కాస్త ఋణం యివ్వండి, పంతులుగారు బయటకు వచ్చేవరకు పత్రిక నడపాలి.’’ అన్నాడు. అప్పు యిచ్చినట్లే యిచ్చి మొత్తం మెషినరీతో సహా అచ్చాఫీసును కొట్టేద్దామని సూర్యనారాయణకు దుర్బుద్ధి పుట్టింది.

ప్రకాశం భార్య హనుమాయమ్మ రూ. 1.13 లక్షల డబ్బు కంపెనీకి అప్పు యిచ్చి కంపెనీ ఆస్తులపై ఫ్లోటింగ్‌ హక్కు పొంది ఉన్నారు. ఆ సరికి ఆ అప్పు రూ.2 లక్షలైంది. ఆమె కున్న యావత్తు హక్కు తనకు దఖలు పరిచి, ఆ తర్వాత కంపెనీవారు యావదాస్తీ తన పేర తనఖా రాస్తే తప్ప ఒక్క కాణీ కూడా అప్పు యివ్వనని సూర్యనారాయణ చెప్పాడు. ఆవిడ అలా రాయాలంటే వెల్లూరు జైల్లో ఉన్న ప్రకాశం గారు ఆ మేరకు ఆవిడ పేర ఉత్తరం రాసి యివ్వాలి. ఇలాటి అన్యాయపు ప్రతిపాదనకు ప్రకాశం గారిని కన్విన్స్‌ చేయడం చాలా కష్టం. అందుకని ఆయనను గందరగోళ పరిచి రాయించుకోవడమే మార్గం. దానికోసం ఆ సూర్యనారాయణ పెద్ద ప్లాను వేశాడు. కృపానిధిని వెంటబెట్టుకుని ఒక శనివారం నాడు సాయంత్రం వెల్లూరు జైలుకి వెళ్లి జైలు సూపర్నెంటుని కలిశాడు. చాలా జరూరు పనిమీద వచ్చామని, రేపు ఉదయం ఆరు గంటలకు ప్రకాశం గార్ని కలవాలని, ఐదు నిమిషాలు చాలని రిక్వెస్టు చేశారు. ముందస్తు దరఖాస్తు పెట్టుకోకపోయినా అర్జంటు అన్నారు కదాని ఆయన సరేనన్నాడు.

ప్రకాశం గారికి ఏ సమాచారమూ లేదు. ఎవరు వస్తున్నారో తెలియదు. ఉదయం ఆరు గంటకల్లా కలవాల్సి వచ్చింది. అందునా కృపానిధిని బయట నిల్చోబెట్టి, సూర్యనారాయణ ఒక్కడే కటకటాల వద్దకు వచ్చాడు. సూపర్నెంటు కాస్త అవతలగా నుంచుని, నిమిషనిమిషానికి లెక్కపెడుతూ టైమై పోతోంది అంటూ కేకలు పెడుతున్నాడు. ఇవతల సూర్యనారాయణ కొంపలు మునిగిపోతున్నాయని కంగారుపెట్టి, వెంటనే భార్యపేర ఉత్తరం రాసి యిమ్మనమని చెపుతూ కాగితం కలం చేతిలో పెట్టాడు. విషయాలు తెలుసుకుందామంటే కృపానిధి దగ్గర్లో లేడు. ఇలాటి గందరగోళ పరిస్థితుల్లో ప్రకాశం గారు ఆ ఉత్తరం రాసి అతని చేతిలో పెట్టేశారు. వాళ్లావిడ యీయన చెప్పినట్లుగానే చేసింది. దాంతో ప్రెస్‌ ఆస్తంతా సూర్యనారాయణ చేతిలోకి వెళ్లిపోయింది. ఈయన జైల్లోంచి బయటకు వచ్చాక న్యాయపోరాటం చేసినా పూర్తి లాభం దక్కలేదు. లక్షలు చేసే ప్రెస్సు మెషినరీ, భూమి వందలూ, వేలల్లో ఎగిరిపోయాయి.

తన ప్రవర్తనను సమీక్షించుకుంటూ ప్రకాశం గారు ఆత్మకథలో రాసుకున్నారు- ‘నా సొంత ఆస్తులే కాదు, నన్ను నమ్మి నా యందు ఉన్న అఖండిత విశ్వాసంతో, యీ దేశీయులే గాక పై దేశాల వారు కూడా, ఏ విధమైన ఆపేక్షలూ లేకుండా విరివిగా చేసిన ధనసహాయం చేర్చి నెలకొల్పిన ఆ ‘స్వరాజ్య’ సంస్థను మూసివేయడం నాకు ఎంతమాత్రమూ యిష్టం లేదు. ఆనాటి నా సంతకమే మూసివేతకు కారణమైంది. నా జీవితంలో ఎప్పుడూ ప్లీడరుగా, అడ్వకేటుగా, రాజకీయవేత్తగా పనిచేసి, అటువంటి చికాకు పరిస్థితులలో నేను చిక్కుకోలేదు. ఆ సమయంలో నా సహజ వివేకం కూడా నన్ను విడిచిపెట్టి పారిపోయిందనుకుంటాను. అందుకే సూర్యనారాయణ నన్ను మోసపుచ్చగలిగాడు.’ అని.

ఇప్పుడు ఉండవల్లి చెప్పిన ఉదంతం రాస్తాను. ఓ సిమెంటు డీలరు వద్దకు కోటేశ్వర్రావు అనే వ్యక్తి వచ్చి 200 బస్తాల సిమెంటు ఎలాట్‌మెంట్‌ ఆర్డరు చూపించి, ‘నువ్వు నాకు సిమెంటు యివ్వనక్కరలేదు, బస్తాకి రూపాయి చొప్పున యిచ్చేసి, యీ బస్తాలను బ్లాక్‌లో బస్తాకు రెండు రూపాయలు ఎక్కువేసి అమ్ముకో’ అన్నాడు. ఆ ఆర్డరు మీద ముఖ్యమంత్రి ప్రకాశం సంతకం ఉంది. ఆ డీలరు దాన్ని ప్రతిపక్ష నాయకులకు అందజేశాడు. కనుక్కుంటే ఆ వ్యక్తికి స్థలం లేదని, యిల్లు కట్టుకునే స్తోమత లేదని తేలింది. ముఖ్యమంత్రే అలాటి కొందరు ఏజంట్ల ద్వారా సిమెంటు బ్లాక్‌ మార్కెట్‌ను ఎన్‌క్యాష్‌ చేసుకుంటున్నారని, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ప్రతిపక్షం వారు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో యీ ఉత్తరం చూపించి నిలదీద్దామనుకున్నారు. స్పీకరు తన ఛాంబర్‌లో ప్రకాశం గారికి, ప్రతిపక్ష నాయకులకు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం గారికి అప్పుడు 80 ఏళ్లు. అందర్నీ ఏరా అనే అవాటు.

వీళ్లు చెప్పేదేమిటో ప్రకాశం గారికి మొదట అర్థం కాలేదు. ‘సిమెంటేమిటిరా?’ అన్నారు. ఉత్తరం చూపిస్తే ‘అవును, యీ సంతకం నాదే. ఓర్నీ పైన సిమెంటు అని రాశాడా వీడు!’ అని ఆశ్చర్యపడ్డారు. అదేమిటి, చూడకుండానే సంతకం పెట్టారా? అని అందరూ ఒక్కసారిగా అడిగారు. ‘అవునురా, సంగతి చెప్తానుండండి. ఈ కోటేశ్వర్రావు వాళ్ల నాన్న చలపతి అని బాగా డబ్బున్నవాడు. స్వాతంత్య్రపోరాటంలో జైలుకి వెళ్లినవారి కుటుంబాలను ఆదుకునేవాడు. వేలాది కుటుంబాలను పోషించే భారం నెత్తిన వేసుకుని ఆస్తంతా కరగదీసేశాడు. పోయాడు. ఇప్పుడు ఆయన భార్యకి పెద్ద రోగమొచ్చింది. వెల్లూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. చేతిలో పైసా లేదు. అప్పుడు కోటేశ్వర్రావు నా దగ్గరకు వచ్చి సాయం చేయమన్నాడు. జేబులన్నీ వెతికితే ఎనిమిది రూపాయలున్నాయి. అది యిస్తే నిష్ఠూరంగా చూశాడు. ఏం చెయ్యమంటావురా, నా దగ్గర యింతే ఉంది అన్నాను.

‘ముఖ్యమంత్రివి, రెండొందలివ్వలేవా అని వాడంటూంటే నాకు ఎందుకు బతికున్నానా అనిపించింది. లెక్కలేనంత సొమ్ముని మాలాటి వాళ్ల కోసం, మనం యీనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం కోసం చేతికి ఎముక లేకుండా దానం చేసిన చలపతి భార్యను యీ రోజు మృత్యుముఖం నుంచి రక్షించుకోవడానికి రెండొందలైనా యివ్వలేని నేనెందుకు? ఈ పదవెందుకు? అనిపించింది. నువ్వు తలచుకుంటే రెండొందలు యివ్వలేవా? అని వాడు నిలదీశాడు. తలచుకుంటున్నానురా, ఎలాగివ్వమంటావో చెప్పు, ఏం చెయ్యమన్నా చేస్తాను అన్నాను. మర్నాడు యీ కాగితం తెచ్చి సంతకం పెట్టు, నాకు డబ్బు సర్దుబాటవుతుంది అన్నాడు. మీరనేది నిజమే, సంతకం పెట్టేముందు చదవాల్సింది, కానీ చదివినా సంతకం పెట్టేసి వుండేవాణ్ని. అది నా బలహీనత. వాడిని ఎలాగైనా ఆదుకోవాలనే నా తాపత్రయం. నా సొంత డబ్బయినా, ప్రభుత్వం డబ్బయినా అంతే.

‘ఇంత బలహీనమనస్కుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రసంపద కాపాడలేడు అని మీరు అనుకుంటే తప్పేమీ లేదు. నా సొంత ఆస్తే తగలేసుకున్నవాణ్ని, యింత బాధ్యత ఏం మోస్తాను. అన్నట్టు చలపతి భార్య ఆసుపత్రికి తీసుకెళ్లకుండానే పోయిందట. ఆ డబ్బు వెనక్కి యిచ్చేస్తానని కబురు చేశాడు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినవాడ్రా. తల్లికోసం యీ వెధవపని చేశాడు. ఇచ్చేస్తాడులే. ఇక నా రాజీనామా సంగతంటారా, దానిలో అనారోగ్య కారణమో మరోటో రాసి లేఖ తయారు చేయించండి. ఈ కథంతా అందరికీ తెలియటం నాకంత యిష్టం లేదు.’ అని ముగించారు ప్రకాశం.

కళ్ల వెంబడి నీళ్లు కారుతూండగా ప్రతిపక్ష నాయకుడు లేచి నిలబడి ‘‘పంతులుగారూ, క్షమించండి’’ అన్నాడు. స్పీకరుగారు తలదించుకుని కన్నీరు కారుస్తున్నాడు. గదిలో అందరికీ ఏడుపు ఆగటం లేదు. ఎందుకంటే వారిలో చాలామంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారున్నారు. తాము జైలులో వుండగా తమ కుటుంబాలు ఎటువంటి అవస్థలు పడ్డాయో తెలుసు వారికి. విషయం అంతటితో ముగిసిపోయింది. ఎవరూ రాజీనామా గురించి యిక ప్రస్తావించలేదు. ఇలాటి పరిస్థితిని ధర్మసంకటం అని నేనెందుకు అంటానంటే ప్రకాశం గార్ని యీ విషయంలో తప్పు పట్టాలా లేదా, ఆయన చేత రాజీనామా చేయించాలా వద్దా అని చటుక్కున చెప్పడం కష్టం. చట్టప్రకారం నేరం చేశారు. కానీ దాని వెనకాల వున్న కారణాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష వేయకూడదు అనగలమా? - (ఫోటో- ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, తెన్నేటి విశ్వనాథం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)

Show comments