విశాఖ రెడీ...!

రాజధాని దర్జాను అందుకోవడానికి విశాఖ రెడీ అయిపోతోంది. ఇప్పటికే విశాఖకు ఆ అధికారిక హోదా వచ్చేసింది. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే విశాఖలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స‌మ్మిట్లు జరిగాయి. తొలి మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే బాబు నిర్వహించారు.

ఇపుడు ఎటూ జగన్ విశాఖను రాజధాని అంటూ ప్రతిపాదించడంతో విశాఖలో కొత్త కళ సంతరించుకుంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరిలోనూ రాజధాని చర్చ సాగుతోంది.

సగటు ప్రజానీకం  తొందరలోనే విశాఖ రాజధాని అవుతుందిటగా అంటూ మొదలెట్టే మాటలు రాజకీయాల దాకా పోతున్నాయి. ఈ పరిణామంతో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీ నేతలు ధీమాగా జనంలోకి వస్తూండంగా టీడీపీ నాయకులు మాత్రం పూర్తి కంఫ్యూజన్లోనే ఉంటున్నారు.

వారికి అధినాయకుడు, పార్టీ ఎక్కువ అయిపోవడంతో విశాఖ రాజధానిపైన పుల్ల విరుపు మాటలే మాట్లాడుతున్నారు. రేపటి రోజుల అవి లోకల్ బాడీ ఎన్నికల్లో చేటు తెస్తాయని తెలిసినా కూడా టీడీపీ నాయకులు మాత్రం బాబు భజనలో తరించేస్తున్నారు.

ఇక విశాఖ రాజధాని విషయంలో స్థానికంగా ఉన్న బీజేపీ ఒకసారి వెల్ కం చెప్పి మళ్ళీ నాలిక మడతేసింది. ఇక వామపక్షాలకు సంబంధించి స్థానిక నాయకులు వ్యతిరేక ప్రకటనలు ఎక్కడా  చేయడం లేదు. మేధావులు మాత్రం విశాఖకు ఇన్నాళ్ళకు న్యాయం జరిగిందని అంటున్నారు. విశాఖ వంటి నగరాన్ని ఉంచుకుని వేరే చోట లక్షల కోట్లు ఖర్చు చేయడం దండుగమారి వ్యవహారం అంటున్నారు.

మరో వైపు విశాఖలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలకు రంగం సిధ్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ హరిచందన్ సహా మంత్రులు  విశాఖకు రాజధాని హోదా తరువాత వస్తారని తొలిసారి అంటున్నారు.

అదే విధంగా ఇంటర్నేషనల్  స్మార్ట్ సిటీల సమ్మిట్ కూడా ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు విశాఖలో జరగనుంది. మొత్తం మీద చూసుకుంటే  విశాఖ మన రాజధాని అనుకుంటూ సాగర కెరటాలు దర్పం  ఒలకబోస్తున్న సన్నివేశం  కనిపిస్తోంది

Show comments