ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

మొన్ననే ప్రభాస్ కొత్త సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. దీంతో ఈ సినిమా చాన్నాళ్ల తర్వాత పట్టాలపైకి వచ్చినట్టయింది. సో.. ఈ ఏడాది ఏదో ఒక టైమ్ లో ప్రభాస్ నుంచి సినిమా రావడం ఖాయమని అతడి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. 2020లో ప్రభాస్ నుంచి సినిమా రావడం లేదు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఈయన చేస్తున్న సినిమా 2021లో విడుదలవుతుంది.

ఈ ఏడాది ప్రభాస్ నుంచి సినిమా రాదనే విషయాన్ని అతడి పెదనాన్న కృష్ణంరాజు నిర్థారించారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు కృష్ణంరాజు ప్రకటించారు.

"ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. మరో మూడు నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తాం. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం"

ఇలా ప్రభాస్ కొత్త సినిమా షెడ్యూల్ బయటపెట్టాడు కృష్ణంరాజు. ఈ సినిమాలో తను కూడా నటిస్తున్నానని తెలిపిన కృష్ణంరాజు.. తమ బ్యానర్ లోనే ఇదొక గొప్ప చిత్రంగా నిలిచిపోతుందంటున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది ప్రభాస్ నుంచి సినిమా రాదనే విషయం తేలిపోయింది. బహుశా ఈ గ్యాప్ లో సినిమా పూర్తిచేయడంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటాడేమో.

Show comments