నెల్లూరు జిల్లా వైసీపీలో కలకలం

ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ, టికెట్ల కేటాయింపులు మొదలయ్యే కొద్దీ వైఎస్సార్సీపీలో అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గం కేటాయించడంతో దానిపై ఆశలు పెట్టుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అసంతృప్తితో పార్టీని వీడుతున్నానని టీడీపీలో చేరడంపై ఇంకా ఆలోచించుకోలేదని ఈరోజు ప్రెస్ మీట్ లో బొమ్మిరెడ్డి స్పష్టంచేశారు. 

టీడీపీ మునిగేనావ అని తేలిపోవడంతో ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ వైసీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ వైసీపీ అభ్యర్థిత్వాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఉన్నవారికి హామీలిచ్చినా పార్టీ గెలుపు కోసం సర్దుబాట్లు చేయాల్సిన తప్పని పరిస్థితి వైఎస్ జగన్ పై పడింది. అందుకే కొన్నిచోట్ల అభ్యర్థుల విషయంలో ఆయన కఠినంగానే ఉంటున్నారు. 

దీనిలో భాగంగానే నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించారు. దీంతో ఇప్పటివరకూ ఆశలు పెట్టుకున్న బొమ్మిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు ఇటీవలే వైసీపీలో చేరిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాత్రం రామనారాయణ రెడ్డి అభ్యర్థిత్వపై పెదవి విప్పలేదు. ఈయన ఆనంతో సర్దుబాటు చేసుకుని కలిసి వెళ్లే అవకాశం ఉంది. 

అయితే టీడీపీనుంచి గట్టి హామీ లభించడం వల్లే బొమ్మిరెడ్డి పార్టీని వీడారని అంటున్నారు. ఆయన ఆత్మకూరు నుంచి టీడీపీ తరపున అసెంబ్లీ బరిలో నిలబడాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ మార్పు నెల్లూరు జిల్లాలో ఎన్నికల హీట్ ని మరింత పెంచింది. 

Show comments