అదును చూసి దర్శకుడిని దెబ్బ కొట్టిందా!

'సంజూ'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ.. తన ఫేవరేట్ హీరో సంజయ్ దత్ తోనే మున్నాభాయ్ పార్ట్ త్రీని రూపొందిద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాడు కొన్ని రోజులుగా. మున్నాభాయ్ సీరిస్ లో పార్ట్ త్రీతో సత్తా చూపిద్దాం అని ఈ దర్శకుడు తహతహలాడుతున్న తరుణంలో ఈయన అసిస్టెంట్ మీ టూ అనేసింది. సంజూ మేకింగ్ దశలో ఉన్నప్పుడు రాజ్ కుమార్ హీరాని తనను వేధించాడని అంటోంది.

నిజానిజాల సంగతి అటుంచితే.. ఇదే విషయాన్ని సదరు నటీమణి సంజూ విడుదల అయ్యాకా చెప్పి ఉండవచ్చు లేదా, హిరానీ తనను వేధించిన రోజే చెప్పి ఉండవచ్చు, లేదా మరేదైనా సమయంలో చెప్పి ఉండొచ్చు. అయితే… సరిగ్గా మున్నాభాయ్ పార్ట్ త్రీకి ప్రకటన వచ్చే తరుణంలో ఆమె ఈ దర్శకుడిపై ఆరోపణ చేయడం మాత్రం ఆసక్తిదాయకం. కేవలం హిరానీ మాత్రమే కాదు.. ఇది వరకూ మీ టూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లంతా కూడా..ఏదో ఒక సినిమా తో బిజీ అయ్యే ముందే వివాదంలోకి పడిపోయారు.

హౌస్ ఫుల్ సీరిస్ దర్శకుడిపై ఇలాగే అతడి అసిస్టెంట్ ఆరోపణలు చేయడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోవడంతో అతడి కెరీరే గల్లంతయిపోయే పరిస్థితి. ఇప్పుడు రాజ్ కుమార్ హీరానీ వంతు. ఇతడు ఎదుర్కొంటున్న ఆరోపణలతో మున్నాభాయ్ మూడో భాగం నిలిచి పోయే పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. 

ఈ దర్శకుడి విషయంలో బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. చాలా మంది హిరాని అలాంటి వాడు కాదనే అంటున్నారు. అయినా తమకెందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా… విచారణతో అసలు విషయం తేలుతుందని ముక్తాయింపునిస్తున్నారు!