టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అత్యవసరంగా చరిత్రాత్మక తీర్పు కావాలట! 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఏంటో ఆయన మరిచిపోయినట్టున్నారు. లేక అలాంటి తీర్పునే మరోసారి కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు.
జగన్ ప్రభుత్వంపై ఏదో ఒక విమర్శ చేయాలనే ఆతృతలో ఆయనేం మాట్లాడుతున్నారో, చంద్రబాబుకే తెలుస్తున్నట్టు లేదు. వైసీపీ దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు తిరుపతి ఉప ఎన్నిక ఓ అవకాశమని ఆయన తాజాగా చెప్పు కొచ్చారు.
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి ద్వారా చరిత్రాత్మక తీర్పునకు తిరుపతి వేదిక కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి ఒక సందేశాన్ని తిరుపతి ప్రజలు పంపాలని ఆయన కోరారు.
ఆలయాలపై దాడులు చేసిన వైసీపీ వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. వైసీపీ వాళ్లపై కేసులు లేవా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్, సీఎం జగన్ డైరెక్షన్లో డీజీపీ బాగా నటిస్తున్నారని బాబు విమర్శించారు.
చంద్రబాబు విమర్శల తీరు చూస్తుంటే ...మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుందనే సామెతను గుర్తు చేస్తోంది. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్టు డీజీపీ సవాంగ్ ఇప్పటికే ప్రకటించారు. 21 మంది నిందితుల్లో ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ కూడా చేశారు.
వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే వైసీపీ వాళ్లపై కేసులు పెట్టరా? అని బాబు ప్రశ్నించడం వింతగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు ఆలయాలపై దాడులు చేసి సొంత ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని అనుకుంటారా? కనీస లాజిక్ లేకుండా మాట్లాడ్డం ...బహుశా ఆ విద్య చంద్రబాబుకు మాత్రమే సొంతమేమో!