విశాఖ అందం అక్కడ వెలిగింది

తెలుగందం అంటేనే ఒక స్పెషల్. ఇక విశాఖ సిటీనే ఒక అందాల సుందరి. ఈ నగరం నుంచి వెళ్ళిన అందం ఏకంగా మిస్ సౌత్ ఇండియాగా నెగ్గడం అంటే ఆశ్చర్యం లేదు కానీ ఆనందం కలుగుతోంది అన్న మాట వినిపిస్తోంది.

ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్ధినిగా ఉన్న చరిష్మా క్రిష్ణ మిస్ సౌత్ ఇండియాగా ఎంపిక అయింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళ రాష్ట్రం కోచీలో నిర్వహించిన ఈ అందాలా పోటీలలో విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించిన చరిష్మా నిజంగా తన పేరుకు తగినట్లుగా చరిష్మాతో ఆకట్టుకుంది.

ఈ పోటీలకు ఏపీ, తెలంగాణాతో పాటు, కర్నాటక. తమిళనాడు, కేరళ రాష్ట్రాల యువతులు అంతా హాజరయ్యారు. అయితే అందరిలోనూ అందాల సుందరిగా నిలిచి విజేత అయింది చరిష్మా క్రిష్ణ. ఇక ఆమె ఒక వైపు తన చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూనే ఇంకో వైపు కళాకారిణిగా నటిగా రాణిస్తోంది. అలాగే మోడలింగ్ లోనూ రాణిస్తోంది.

మంచి అవకాశాలు ఇస్తే టాలీవుడ్ లో కూడా వెలిగిపోవాలనుకుంటోంది. ఆమె నట శిక్షకుడుగా ప్రముఖుడిగా ఉన్న ఎల్ సత్యానంద్ వద్ద నటనలో ట్రైనింగ్ తీసుకుంటోంది. మరి ఈ విశాఖ అందం వెండితెర మీద వెలుగులు విరజిమ్ముతుందా అంటే చూడాలి.

Show comments