'మెగా' స్ట్రాటజీలో సాయి ధరమ్

చిరంజీవి నుంచి పవన్ వరకు, రామ్ చరణ్, బన్నీ ఇలా ఎవరైనా మెగా హీరోల బలం వారి ఫ్యాన్స్ బేస్. అందుకే ఫ్యాన్స్ విషయంలో మాత్రం మెగా హీరోలు ఎవరైనా కాస్త జాగ్రత్తగానే వుంటారు. మెగా ఫ్యాన్స్ విషయంలో నాగబాబు ఏక్టివ్ గా వుంటారు.

మొదట్నించీ ఫ్యాన్స్ ఆయన దగ్గరగా వుంటూ వస్తున్నారు. రాను రాను మెగా హీరోలు పెరిగిన తరువాత ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటున్నారు. ప్రతి సినిమాకు ముందు ఫ్యాన్స్ ను మీట్ అవ్వడం, వారికి విందు ఇవ్వడం, విడుదల టైమ్ లో హాడవుడికి వారి సహాయం తీసుకోవడం కోసం ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు.

గతంలో సాయి ధరమ్ తేజ ఫ్యాన్స్ విషయంలో కాస్త చురుగ్గా వున్నారు. తనే చాలా ఊళ్లకి వెళ్లి ఫ్యాన్స్ ను స్వయంగా కలిసి వచ్చిన సందర్భాలు వున్నాయి. తరువాత తరువాత తేజు కాస్త బిజీ అయిపోయాడు. ఇప్పుడు మళ్లీ సాయి ధరమ్ తేజ ఫ్యాన్స్ విషయంలో కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది.

రెండు రోజుల క్రితమే తనను కలిసిన ఫ్యాన్స్ కు మాంచి విందు ఇచ్చాడు. అలాగే అన్ని జిల్లాల ఫ్యాన్స్ కు జవాన్ సినిమాకు సహకరించమని కబుర్లు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ తలుచుకుంటేనే ఓపెనింగ్స్ బలంగా వుంటాయి.

ఈ విషయం పైనే ఇప్పుడు సాయి ధరమ్ దృష్టి పెట్టినట్లు వినికిడి. గత కొంత కాలంగా సాయి ధరమ్ కెరీర్ ఒడిదుడుకుల్లో వుంది. జవాన్ సినిమా, ఆ తరువాత వచ్చే వివి వినాయక్ సినిమాలు అతని కేరీర్ కు కీలకం. అందుకే ఏ ఒక్క అవకాశం వదలకూడదనుకుంటున్నారు. ఫ్యాన్స్ మద్దతుతో సహా. అందుకే సాయి ధరమ్ ప్రణాళికలు అన్నీ.

Show comments