'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

-చంద్రబాబు ట్రూపు కొత్త డ్రామా!
-ఇంకా ఎవరిని మోసం చేసేయత్నం?
-ఇదొక వ్యూహమా? ప్రజలను ఫూల్స్‌ చేసే ప్రయత్నమా!
-అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!
-ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!

అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇలానే అనుకున్నారు.. 'మేం ఓడిపోవడం ఏమిటి?' అని, తీరా ఓడిపోయాకా.. 'మేం ఓడిపోవడం ఏమిటి?' అంటూ తెలుగుదేశం వాళ్లు ప్రజల ముందు కొత్త డ్రామాకు తెరతీశారు! ప్రజలు తెలుగుదేశం పార్టీకి కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చి, మూడు ఎంపీ సీట్లను ఇచ్చి చితకొట్టినా తెలుగుదేశం పార్టీ తీరులో, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరణలో, ఆ పార్టీ  మీడియా ట్రూపు భజనలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు! మళ్లీ అదే తీరుతో సాగుతున్నట్టుగా ఉన్నారు.  కొత్త డ్రామాకు తెరతీసి ప్రజలను మరోరకంగా భ్రమల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మొదలైనట్టుగా ఉంది. అయితే తమ గారడీలకు ప్రజలు పడిపోరని, అధికారాన్ని చేతిలో పెట్టుకుని తాము హడావుడి చేసినప్పుడే పడని ప్రజలు ఇప్పుడు ఎలా పడతారు.. ఇలాంటి డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటారు తప్పా.. సీరియస్‌గా తీసుకోరని.. తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఇప్పుడప్పుడే అర్థం అయ్యేలా లేదు. ఇంకోసారి ప్రజాతీర్పుతో గట్టిదెబ్బ తగిలే వరకూ ఇదే డ్రామాను కొనసాగించేలా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లు!

నవ్వుతున్నారు బాబోయ్‌!
తెలుగుదేశం పార్టీకి ఇలాంటి నినాదాలు, డ్రామాలు కొత్తవి ఏమీకావు. తెలుగు ప్రజలకు ఇలాంటి డ్రామాలను ఎన్నింటినో చూపి వినోదాన్ని అందిస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ. ఒక సినిమా నటుడు పెట్టిన పార్టీ అది. అయితే ఆయన కన్నా ఆయన అల్లుడు పెద్ద ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్‌ సినిమాల్లో నటిస్తే, చంద్రబాబు నాయుడు రియల్‌ టైమ్‌లో ఇలాంటి డ్రామాలను రక్తికట్టిస్తూ ఉంటారు. అలాంటి తీరులో ఇప్పుడు తాజా స్టేజి డ్రామా 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..'కు ఎక్కెడెక్కడి నుంచి జూనియర్‌ ఆర్టిస్టులను బాగానే తీసుకొస్తూ ఉన్నారు. వారు నటించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ.. వారితో చంద్రబాబు నాయుడు కూడా ఒక రేంజల్లో నటించేస్తూ ఉండటమే అసలైన చర్చనీయాంశంగా మారింది.

'నువ్వెట్టా ఓడిపోయావయ్యా..' అని వీరాభిమానులు అడిగితే అడిగారు, వాళ్లకంటే తెలియకపోవచ్చు. చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలియదా? తను ఎందుకు ఓడిపోయిందీ చంద్రబాబుకు తెలియదా? తెలియనట్టుగా నటిస్తూ ఉన్నారా? తెలియకపోతే అది చంద్రబాబు నాయుడి అమాయకత్వం అవుతుంది, తెలిసీతెలియనట్టుగా వ్యవహరిస్తే అది తనను తాను మోసం చేసుకోవడం అవుతుంది, తెలుసుకోలేకపోతే అది ఆయన అసమర్థత అవుతుంది. అయితే బయటివాళ్లకు తెలుస్తున్నది ఏమిటంటే.. చంద్రబాబుకు అన్నీతెలుసు! అన్నీ తెలిసే ఈ కొత్త డ్రామాకు తెరలేపారు. కానీ.. ఇది మరీ సిల్లీగా ఉంది. స్లంప్‌లో ఉన్నప్పుడు ఇలాంటి సిల్లీ పనులు చేస్తే వ్యవహారం మరింత సిల్లీగా మారుతుందని మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లు తెలుసుకోలేకపోతున్నారు!

తనయుడినే ఓడించారు!
ఈ ఓటమి తెలుగుదేశం పార్టీకి పెను ఉప్పెన లాంటిది. ఆ పార్టీ భవితవ్యాన్ని పూర్తిగా ప్రశ్నార్థకంలోకి నెట్టిన ఓటమి ఇది. స్వయానా చంద్రబాబు నాయుడి తనయుడిని ఎంతో ఏరికోరి ఎంచుకున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎన్నో జాకీలు వేసిలేపినా లోకేష్‌ నిలదొక్కుకోలేకపోయారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో లోకేష్‌ను తెలుగుదేశం నేతలే ఇక నమ్మే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేని వ్యక్తి, ఎవరోరాసిన ట్వీట్లను పోస్టు చేయడం తప్ప రాజకీయంగా తన నేర్పును ఏదీ లేనివ్యక్తి.. తమను మళ్లీ అధికారం వైపు తీసుకెళ్తారని నమ్మే తెలుగు తమ్ముళ్లు ఎవరైనా ఉంటారా? తెలుగుదేశం సినిమాను దగ్గర నుంచి చూస్తూ ఉన్న వాళ్లకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. లోకేష్‌ను నమ్ముకుని గోదావరి ఈదేంత అమాయకులు అక్కడ ఎవరూ కనిపించడం లేదు! లోకేష్‌ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడుకు కుప్పంలో మెజారిటీ తగ్గిపోయిన వైనం ఆయనను ప్రజలు ఏ రేంజ్‌లో తిరస్కరించారో చాటిచెబుతూ ఉంది.

47వేల నుంచి 30వేలకు పడిపోయింది చంద్రబాబు మెజారిటీ! 17 వేలమంది సొంత నియోజకవర్గంలోనే అదనంగా ఈసారి చంద్రబాబు తిరస్కరించారు. రెండో రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసేసరికి చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు. అనామకుడు, కనీసం ప్రచారం కూడా చేయని ప్రత్యర్థి చేతిలో చంద్రబాబు నాయుడు రెండు రౌండ్ల పాటు వెనుకబడ్డారు. తన మెజారిటీని చాలావరకూ కోల్పోయారు. రానున్న ఐదేళ్లలో కుప్పంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సరిగా వర్కవుట్‌ చేసుకుంటే? పరిస్థితి ఎలా ఉంటుందో వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. పులివెందుల్లో గెలుస్తాం.. అనే దగ్గర నుంచి కుప్పాన్ని నిలబెట్టుకునేందుకు వచ్చేసారికి చాలా కష్టపడాల్సిన పరిస్థితుల్లోకి పడిపోయింది తెలుగుదేశం!

ఎందుకు ఓడిపోయారో వివరించి చెప్పాలా?
ఎన్నికల ముందు ఇలాంటి వేషాలను ఏపీ ప్రజలు చూడనే చూశారు. పోలవరం బస్సుయాత్రలు, చంద్రబాబు భజనలు, 'జయము జయము చంద్రన్నా.. నీకు ఎవరుసాటి..' అంటూ పాటలు... అంతకు ముందు ధర్మపోరాట దీక్షలు... ఒకటేమిటి ఎన్నో ఎపిసోడ్స్‌ చూశారు జనాలు. ప్రజాధనంతో అలాంటి డ్రామాలను ఎన్నింటినో రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఇంకానయం ఏమైనా ఛాన్స్‌ ఉంటే.. చంద్రబాబును కలిసి ఇలా 'మీరెట్టా ఓడిపోయారయ్యా..' అని ఆయన ముందు ఏడ్పుల కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేవారు! అలాంటి అధికారాలు ఏవీ చేతిలో లేవు కాబట్టి.. ప్రజల సొమ్ము ఎంతోకొంత సేవ్‌ అవుతోంది. లేకపోతే ఆర్టీసీతో మాట్లాడి, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి.. చంద్రబాబు వద్దకు జనాలను తీసుకెళ్లి 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..' అనే డ్రామాను బీకరమైన స్థాయిలో నడిపించేవారు.. అని తెలుగుదేశం పార్టీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ మీద నమ్మకం ఉన్నవాళ్లు అంటున్నారు!

ఇంతకీ తన దగ్గర హాశ్చర్యపోతున్న వాళ్లకు చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయిన విషయాన్ని వివరించి చెబుతున్నారా? అనే అంశం మీద కూడా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం అంత చిత్తుగా ఎందుకు ఓడిపోయారో చెప్పమంటే చెప్పడానికి ఎన్నో విషయాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటినీ చంద్రబాబు నాయుడు తన దగ్గరకు వచ్చిన వాళ్లకు వివరిస్తున్నారా? లేక వాళ్లకు వివరించినా వేస్ట్‌ అని ఊరికే అయిపోతున్నారా? అంటూ సోషల్‌ మీడియా కొంతమంది స్పందిస్తున్నారు!

కాదేదీ ఈవెంట్‌కు అనర్హం!
ప్రతిదాన్నీ ఒక ఈవెంట్‌లా ప్లాన్‌ చేయడం తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీకాదు. చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా కన్నా ఒక ఈవెంట్‌  మేనేజర్‌గా బాగా పనికొస్తారని గత ఐదేళ్ల ఆయన పాలన చాటి చెప్పింది. వందల కోట్ల రూపాయలు పెట్టి పుష్కరాలు నిర్వహించడం, అనునిత్యం ఏదో ఒక పేరుతో ప్రజాధనాన్ని కరిగించేయడం, జలహారతులు, ఒక్కో ప్రాజెక్టుకు వీలైనన్నిసార్లు శంకుస్థాపనలు.. ఇంకా దీక్షలు, ధర్నాలు, పోలవరం సందర్శనలు.. ఐదేళ్లూ ఈవెంట్లే!

వాటికి సినీ దర్శకుల డైరెక్షన్‌, చంద్రబాబుది క్రియేటివిటీ, ప్రజల సొమ్ముతో ఆయనే వాటికి నిర్మాత. అలా ఐదేళ్లపాటు తీసిన డ్రామాను ప్రజలు తిరస్కరించారు. ఆ డ్రామాను చూసి విసుగొచ్చి తెలుగుదేశం పార్టీని చితకొట్టారు. అయినా తెలుగుదేశం మరో ఈవెంట్‌కు ప్లాన్‌ చేసింది. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..' అంటూ దాన్ని నడిపిస్తూ ఉంది. ప్రజలు చిత్తుగా ఓడించినా.. దాంట్లోనూ ఒక ఈవెంట్‌ను నిర్వహించుకోవడం చంద్రబాబుకే సాధ్యం అవుతున్నట్టుగా ఉంది.

తందానా తానా.. అంటున్న మీడియా!
ఫలితాలు వచ్చిన నాలుగైదు రోజులకే మొదలుపెట్టేశారు అనుకూల మీడియా వర్గాల వారు. 'చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం గురించి ప్రజలు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు.. తామంతా క్యూల్లో నిలబడి ఓటేసినా చంద్రబాబు గెలవకపోవడం గురించి మహిళలు ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ..' అంటూ మొదలుపెట్టిన పచ్చమీడియా, ఆ డ్రామాను మరింతగా పెంచుతోంది. ఒక రైతు ఎవరో చంద్రబాబును కలిశారని, చంద్రబాబు ఓడిపోవడంతో ఖరీఫ్‌కు పెట్టుబడికి డబ్బులు లేకుండా పోయాయని ఆ రైతు తెగ బాధపడిపోయాడని మరో కామెడీ ఎపిసోడ్‌ను హైలెట్‌ చేసే ప్రయత్నం చేసింది పచ్చమీడియా.

ఇది ఎంత పచ్చి కామెడీనో ఏమాత్రం ఇంగితం ఉన్న వారికి అయినా అర్థం అవుతుంది. రైతులకు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో ఎప్పుడూ పెట్టుబడి డబ్బులు ఇవ్వలేదు. ఖరీఫ్‌లో పెట్టుబడికి అని, రబీలో పెట్టుబడికి అని ఎలాంటి డబ్బులూ ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ముందు ఒక స్కీమ్‌ను ప్రకటించారు. 'అన్నదాత సుఖీభవ' అంటూ రెండు వేల రూపాయల డబ్బును రైతుల ఖాతాలోకి జమ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే  అది కేంద్రం స్కీమ్‌. కేంద్రం ఆ ప్రోగ్రామ్‌ను అనౌన్స్‌ చేయగానే.. ఆ డబ్బుకు తాము కూడా మరికొంత జోడించి రైతులకు వేస్తామంటూ కొత్త స్కీమ్‌ను అనౌన్స్‌ చేశారు. అయితే అది రైతులకు అందిందీ లేదు. కేవలం ఎన్నికల ముందు ఒక గారడీగా ఆ స్కీమ్‌ను ప్రకటించారు.

ఓట్లను కొనుగోలు చేయడానికి రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లలోకి వేయాలని అనుకున్నారు. అయితే అందులో కూడా ఫెయిల్‌ అయ్యారు. అదీ జరిగిన కథ. అయితే అక్కడకు గత ఐదేళ్ల నుంచి చంద్రబాబు నాయుడే పెట్టుబడలన్నింటికీ డబ్బులు వేసినట్టుగా, ఆయన ఇప్పుడు ఓడిపోవడంతో పెట్టుబడికి రైతులకు డబ్బులు అందనట్టుగా ఈ కథను కల్పించారు. ఇలాంటి తీరును గమనించాకా.. ఇవన్నీ డ్రామాలు అని అనడానికి ఎవరైనా ఎందుకు వెనుకాడతారు? మరీ ఇంత ప్రహసనంగా ఉంటే.. ఈ కామెడీలు చేసి నవ్వుకోక మరేం చేస్తారు? ఈ విషయం గురించి డ్రామాకు స్క్రీన్‌ ప్లే ఇచ్చి, దర్శకత్వం వహిస్తున్న వాళ్లే ఆలోచించుకోవాలేమో!

ఎందాకా కామెడీ ఎపిసోడ్లు?
ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆకలి మీద ఉంది. మరోవైపు తెలుగుదేశం నేతల్లో భయాందోళనలు పతాక స్థాయికి చేరాయి. ఐదేళ్లలో చేసిన అవినీతి ఏ రూపంలో వచ్చి తమను చుట్టుకుంటుందో, ఏ కేసులను తమ మీదకు తెస్తుందో అనే భయం తెలుగుదేశం నేతల్లో స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఒక్క కోడెల కుటుంబం మీదే డజనుకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కోడెల మాత్రమేకాదు.. చాలామంది కాళ్ల కింద భూమి కదిలిన ఫీలింగ్స్‌ కలుగుతున్నాయట. తెలుగుదేశం పార్టీలో ఉంటే కేసుల పీడ చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిపోయేకి అక్కడ సీఎం జగన్‌ గేట్లు లాక్‌ చేసి, కీస్‌ తన చేతిలో పెట్టుకున్నారు. ఓడిపోయిన వాళ్లను జగన్‌ అసలు ఎంటర్‌టైన్‌ చేసే పరిస్థితి ఉండదు. దీంతో భారతీయ జనతా పార్టీ వైపు తెలుగుదేశంలోని వారు ఆశగా చూస్తున్నారు. ఫలితాలు వచ్చిన నెల కూడా గడవక ముందే తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎవరు  ఉంటారో.. చెప్పడం కూడా కష్టం అయ్యింది. చంద్రబాబు మెడకే బోలెడన్ని కేసులు చుట్టుకునే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తూ ఉంది. టక్కున మోడీ దగ్గరకు వెళ్లి ప్రసన్నం చేసుకోవడానికీ అవకాశం లేకుండా చేసుకున్నారు చంద్రబాబు. మోడీపై అడ్డగోలు మాటలు ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత అయినా ఆపారా? అంటే అదీ లేదు!

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుందంటారు. చంద్రబాబు నాయుడు తను ఏం చేసినా ప్రజలు కళ్లు మూసుకునే ఉంటారని అనుకున్నారు. అందుకే మోడీతో దోస్తీ చేసినంత సేపూ దోస్తీ చేసి, తర్వాత ఇష్టానుసారం మాట్లాడసాగారు. పచ్చి అవకాశవాదిలా వ్యవహరించారు. కేవలం మోడీతోనే గాక ప్రజా ప్రయోజనాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇసుమంత నిజాయితీ అయినా చూపలేదు! అందుకే ప్రజలు చాచి ఓటుతో కొట్టారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇక్కడకు తయారైంది. ఇదంతా జరిగింది. ఇంకా ఏమీ అర్థంకానట్టుగా చంద్రబాబు నాయుడు డ్రామాల్లో బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్లు కాస్త త్వరగా ముగించుకుంటే.. అసలు కథ వేరే మొదలు కాబోతోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకు ఓడిపోయారో  తొందరగా అర్థం చేసుకోవాలని, అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నా చంద్రబాబుకు ఉండే ప్రయోజనాలు లేవని, ఓడిపోవడం వల్ల ఏం జరగబోతోందో అనేదే చంద్రబాబుకు త్వరలో అర్థం అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పుడు ఈ ఊసే ఎత్తరే!
కౌంటింగ్‌ ముగిసిన తర్వాత, ఫలితాల వెల్లడికి ముందు.. చంద్రబాబునాయుడు పదే పదే ఈవీఎంల మీద మాట్లాడారు. ఈవీఎంల మీద నమ్మకం లేదన్నారు. ఈవీఎంలు ట్యాంపర్‌ చేయవచ్చన్నారు. వీవీ ప్యాట్లు లెక్క పెట్టాలన్నారు. ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్ల మీద నిర్వహించాలని అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయడు ఈవీఎంల ఊసు ఎత్తడంలేదు! మోడీ మోసం చేశారని లేదా, ఈవీఎంలు ట్యాంపర్‌ చేశారని తెలుగుదేశం అధినేత మాట్లాడటంలేదు. మోడీ అధికారంలోకి రాడనే ధైర్యంతో చంద్రబాబు నాయుడు ఫలితాల వెల్లడికి ముందు ఈవీఎంల మీద కూడా ఎడాపెడా మాట్లాడారు. ఇప్పుడు తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారాయన. అలా మాట్లాడితే మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అని చంద్రబాబు నాయుడు భయపడుతూ ఉన్నారని, అందుకే ఈవీఎంల మీద నెపాన్ని నెట్టి తప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఈవీఎంల గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా మోడీకి తన మీద మరింత ఆగ్రహం కలుగుతుందనే విషయం చంద్రబాబుకు తెలియనిది ఏమీకాదని, అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంల గురించి మాట్లాడకుండా, డ్రామా ఆర్టిస్టులు, కులగజ్జి జనాల డ్రామాల్లో తనూ ఒక పాత్రధారిగా వ్యవహరిస్తూ ఉన్నారని.. అయితే ఈ డ్రామాలను జనాలు నమ్మేరోజులు పోయాయని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతే ఆ నష్టం తెలుగుదేశం పార్టీకే అని పరిశీలకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు డ్రామాలను జనాలు నమ్మలేదు, ప్రతిపక్షంలో కూర్చుని ఇలాంటి పనులు చేస్తే ఇదంతా ప్రజలు నవ్వుకునేందుకు వినోదంగా పనికి వస్తుంది!

ఆత్మ విమర్శ అవసరం..
ఓటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఆత్మవిమర్శ కనిపించడం లేదు. తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కానట్టుగా ఆ పార్టీ నేతలు పైకి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీ అభిమానులు కూడా అలాగే వ్యవహరిస్తున్నట్టున్నారు. అయితే అంత పెద్ద ఓటమికి ఎదురయ్యాకా అర్థంకాకపోవడం అంటూ ఏమీలేదు. అంతా అర్థం అయ్యే ఉంటుంది. అయితే అధికారం చేతిలో ఉన్నప్పుడు జరుగుతున్న తప్పుల తీవ్రతను తెలుగుదేశం వాళ్లు అర్థం చేసుకోలేకపోయినట్టుగా ఉన్నారు. ఈవీఎంల మీద నెపం నెట్టేయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. ప్రీపోల్‌ సర్వేలు, అధ్యయనాలు కూడా తెలుగుదేశం పార్టీ ఓటమిని అంచనా వేశాయి. కాబట్టి టీడీపీ ఓటమి అనూహ్యమైనది ఏమీ కాదు. జరిగిన పొరపాట్ల గురించి ఆత్మవిమర్శ చేసుకోవడం తెలుగుదేశంపార్టీకి అవసరం. అయితే ఆ పార్టీ మాత్రం అందుకు సిద్ధంగా కనిపించడం లేదు!
-తెలకపల్లి రవి, విశ్లేషకులు.

దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు..
అద్భుతం జరిగితే తప్ప చంద్రబాబు నాయుడుకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదు. అందుకు కారణం ఆయన వయసే. ఒకవేళ అధికారం చేతిలో ఉంటే తన వారసుడిని, యువనేతగా చంద్రబాబు నాయుడు తీసుకురాగలిగే వారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఈ పరిణామాల మధ్యన  చంద్రబాబు నాయుడు,  ఆయన అనుకూల మీడియా కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ దిక్కుతోచని స్థితిలో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. టీడీపీకి ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం చాలా తక్కువ. ఆ మాత్రం దానికి  చంద్రబాబు ఓటమి గురించి గుండెలు బాదుకునే జనాలు ఉన్నారంటే నమ్మడం చాలా కష్టం. ఈ నాటకాలు చాలా కృతకంగా ఉన్నాయి. ఓట్ల శాతం విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది. క్రితం సారి ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే వెనుకబడింది. ఈ సారి మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, టీడీపీకి ఉన్న ఓట్ల శాతం వ్యత్యాసం చాలా ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఈ డ్రామాలన్నీ ప్రహసనాలే.
-రాకా సుధాకర్‌రావు, సీనియర్‌ జర్నలిస్టు, విశ్లేషకులు.

టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!
అధికారం చేతిలో ఉన్నన్ని రోజులూ తమకు కావాల్సినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రతి అంశంలోనూ ప్రజలను తాము నమ్మిస్తున్నట్టుగా తెలుగుదేశం వారు భావించారు. తిమ్మిని బమ్మిని చేశామనుకున్నారు. ప్రజలు కూడా నమ్మినట్టుగానే కనిపించి.. తీరా ఓటు దగ్గర తమ తీర్పును గట్టిగా ఇచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ భ్రమల్లోంచి బయటకు రావడంలేదు. ఓటమిని తక్కువ చేసి చూపించి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జరుగుతున్న ఒక స్టంట్‌ ఇది. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఇలాంటి నేపథ్యంలో కూడా ఈ డ్రామాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాచేస్తే హాస్యాస్పదం అవుతుందని నమ్మే స్థాయిని తెలుగుదేశం పార్టీ దాటిపోయింది. ఇదివరకే అది రుజువు అయ్యింది. ఆ క్రమంలోనే ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు.
-వాకా మంజులారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!

Show comments