మహర్షి చిత్రానికి గాను దేవిశ్రీప్రసాద్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. రంగస్థలం, భరత్ అనే నేను తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రంజింప చేయలేకపోయిన దేవిశ్రీప్రసాద్ 'వినయ విధేయ రామ' చిత్రానికి గుర్తుంచుకునే పాట ఒక్కటీ కంపోజ్ చేయలేకపోయాడు. మహర్షితో అయినా మళ్లీ దారికి వస్తాడని ఆశించారు కానీ ఈసారి కూడా తన పాత బాణీలనే అటు తిప్పి, ఇటు తిప్పి వినిపించాడు.
చివరకు నేపథ్య సంగీతం పరంగాను దేవి ఆకట్టుకోలేకపోవడంతో మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. పైకి ఏమీ తెలియనట్టు వ్యవహరించినా కానీ తనపై జరుగుతోన్న ట్రోలింగ్ అతనికి తెలియకుండా లేదు. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అన్న చందంగా సినిమాలు ఎక్కువ చేయడం వల్ల తన మ్యూజిక్ ఆకట్టుకోవడం లేదని దేవి గ్రహించాడు.
అందుకే ఇకపై పెద్ద సినిమాలకి, తనతోనే ఎక్స్క్లూజివ్గా పని చేసే దర్శకులకి మాత్రమే మ్యూజిక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే అంతకుముందు చేసుకున్న ఒప్పందాలు కూడా కాన్సిల్ చేసుకున్నాడు. సెలక్టివ్గా సినిమాలు చేయడం వల్ల మంచి ట్యూన్స్ అందించే సమయం, వెసులుబాటు వుంటుందని భావిస్తోన్న దేవిశ్రీప్రసాద్ మరోసారి తిరిగి తన మ్యూజికల్ మ్యాజిక్తో శ్రోతలని సమ్మోహితులని చేస్తాడనే ఆశిద్దాం.