మద్యం నియంత్రణ అభినందించి తీరాలి!

గొడవ ఏదైనా దానికి కారణం అయితే మద్యమే అవుతుందని కొంతమంది అంటూ ఉంటారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేసరికి మద్యం తీసుకుని గొడవలు పడేవాళ్లు చాలామంది ఉంటారు. పగలంతా శ్రమించి కష్టపడే వాళ్లలో కూడా కొందరు మద్యానికి బానిసై సాయంత్రానికి సంపాదించిన దాన్ని అలా ఖర్చుచేసి కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ ఉంటారు.

మద్యపాన నిషేధం అనేది ప్రస్తుత రోజుల్లో అంత సాధ్యంఅయ్యే విషయంకాదు. ఇదే సమయంలో రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధిస్తే పక్కరాష్ట్రాల నుంచి దొంగగా తెచ్చి అమ్ముతారు. ఇలా ఎలాచూసినా ఇది చాలా తీవ్రమైన సమస్యే! ఇలాంటి నేపథ్యంలో ఏపీలో నూతన మద్యవిధానాన్ని తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధానం ఎలా ఉండబోతోందో త్వరలోనే పూర్తిగా అర్థంకాబోతోంది.

ముందుగా కట్టడి చేయాల్సింది గ్రామాల్లోని బెల్ట్‌షాప్‌లను. వాటిని కట్టడిచేస్తే సమస్య కొంతవరకూ తగ్గినట్టే. అందుకే ప్రభుత్వమే పూర్తిగా మద్యపాన నియంత్రణను చేపట్టనున్నందట ఏపీలో. మొత్తం మద్యంషాపులు ప్రభుత్వమే పూర్తిగా నియంత్రణలోకి తీసుకోనుందని సమాచారం.

ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పద్ధతి అమల్లో ఉంది. అక్కడ ప్రభుత్వాలే మద్యపాన దుకాణాలను నిర్వహిస్తున్నాయి. మద్యం అమ్మకానికి కూడా కొంత సమయాన్ని సెట్‌ చేశారు. ఏపీలో కూడా ఆ తరహాలో అమలు చేయడం ద్వారా పరిస్థితిని ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవచ్చు.

మద్యం షాపుల సంఖ్యను తగ్గించడం, జాతీయ రహదారుల సమీపంలో మద్యం దుకాణాలను పూర్తిగా నిషేధించడం వంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. మద్యం షాపుల సంఖ్యను తగ్గించనున్నట్టుగా ప్రభుత్వమే స్పష్టంచేసింది. ఈ ఏడాదిలోనే పాతికశాతం వరకూ షాపులు తగ్గిపోనున్నాయని ప్రకటించారు.

ఏదేమైనా ఇవి ఆహ్వానించదగిన అంశాలే. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని కొందరు ప్రజలు తెగ ఫీలయిపోతున్నారు. ఆదాయం తగ్గినా ఫర్వాలేదు, మంచి సమాజం ముఖ్యం.
-ఎల్‌.విజయలక్ష్మి

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది

Show comments