బాబు మనిషితో పవన్ కల్యాణ్ అనుబంధం!

లింగమనేని రమేశ్.. గత నాలుగేళ్లుగా బాగా వినిపిస్తున్న పేరు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు విజయవాడ కరకట్టపై మకాం పెట్టాకా బాబుకు అత్యంత సన్నిహితుడిగా ఈయన పేరు వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఏపీలో పెట్టిన అధికారిక నివాసం లింగమనేని ఎస్టేట్స్ లో భాగం. చంద్రబాబు నాయుడు అక్కడ మకాం పెట్టి లింగమనేని రియలెస్టేట్ వ్యాపారానికి ఊపునిచ్చాడు అనే వార్తలతో మొదలు.. ఇంకా అనేక వ్యవహారాల్లో లింగమనేని పేరు వినిపించింది.

ఇక అమరావతి కోసం చేసిన భూ సేకరణ.. లింగమనేని ఎస్టేట్ ముందుకు వచ్చి ఆగిపోయింది. లింగమేని ఎస్టేట్స్ కు సంబంధించిన సరిహద్దు రాయికి అడుగు దూరంలో అమరావతి ఆగిపోతుందనమాట. ఇలా ఏపీ ప్రభుత్వం లింగమనేని రమేశ్ కోసం చాలా త్యాగాలే చేసిందని, ఈయన వ్యాపారాలకు చంద్రబాబునాయుడు చాలా సహకారమే అందిస్తున్నాడనే మాటలు నాలుగేళ్లుగా వినిపిస్తూ ఉన్నాయి.

ఇక ఇదే సమయంలో లింగమనేని పవన్ కల్యాణ్ కు కూడా సన్నిహితుడు అయ్యాడు. ఆ మధ్య అమరావతి ప్రాంతంలో దేవాలయ ఆరంభోత్సవ సమయంలో లింగమనేని అటు చంద్రబాబుకు, ఇటు పవన్‌కు అనుసంధాన కర్తగా వ్యవహరించాడు.

వారిద్దరి సమావేశానికి కూడా ఏర్పాట్లు చేశాడు లింగమనేని అంటారు. ఇక పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంతంలో భూమి కొనుగోలులో కూడా లింగమనేని పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. అదలా ఉంటే.. ఇప్పుడు తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్ వెంట లింగమనేని ఉండటం గమనార్హం.

తిరుమలలో కూడా పవన్ కల్యాణ్ బ్యాచ్ లో లింగమనేని కనిపిస్తున్నాడంటే ఇతడు జనసేనాధిపతికి ఎంత సన్నిహితుడయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విరుచుకుపడుతూ ఉన్నాడు. అయితే పవన్ సన్నిహిత బ్యాచ్ లో చంద్రబాబు నాయుడి సన్నిహితుడు ఉన్నాడు. ఇదే బంధం అబ్బా? ఈ సెక్షన్ కింద ఇది చెల్లుబాటు అవుతుందో!

Show comments