రాజకీయ శత్రువును.. జైలుకెళ్లి పరామర్శించారు!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నివాసాల ముందు నిలబడినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ అధినేత హోదాలో  చంద్రబాబు నాయుడు సోనియా, రాహుల్ తో ముసిముసి నవ్వులు నవ్వడం తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా సహించలేకపోయారు! అందుకు మూల్యం చంద్రబాబు చెల్లించుకున్నారు కూడా. తనతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ ను కూడా ముంచేశారనుకోండి.

ఆ సంగతలా ఉంటే.. కర్ణాటకలో కొన్నాళ్లుగా ఇలాంటి స్నేహం ఒకటి సాగుతూ ఉంది. అదే డీ శివకుమార, కుమారస్వామిల మధ్యన. వీళ్లిద్దరూ ఇప్పుడు ఆప్తమిత్రులుగా మారారు. ఎంతలా అంటే.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న డీకేను కుమారస్వామి పరామర్శించారు. డీకే ధైర్యంగా ఉన్నారని, అన్నింటినీ ఎదుర్కొనడానికి ఆయన రెడీగా ఉన్నారని, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని కుమారస్వామి ప్రకటించారు కూడా.
ఇప్పుడైతే ఇలా ఆప్యాయతతో మాట్లాడుతున్నారు కానీ, కొన్నాళ్ల కిందటి వరకూ దేవేగౌడ కుటుంబానికి, డీకేశికి అసలు పడేదికాదు.

కర్ణాటకలో దేవేగౌడ కుటుంబ-పార్టీ  ఆధిపత్యం దెబ్బతినడంలో డీకే శివకుమార హస్తం చాలా ఉందంటారు. వీరిద్దరూ ఒకే కులస్తులే. ఆ కులానికి దేవేగౌడ ప్రతినిధిగా ఉంటూ వచ్చారు. వక్కలిగలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జేడీఎస్ హవా కొనసాగింది దశాబ్దాల పాటు. మండ్యా, మైసూరు, హాసన ప్రాంతాల్లో జేడీఎస్ కు తిరుగుండేది కాదు. బెంగళూరు శివార్లలోని రామనగర, తుమకూరు ప్రాంతాల్లో కూడా గౌడలు సాలిడ్ గా జేడీఎస్ కు అండగా నిలబడుతూ వచ్చారు.

అయితే కాంగ్రెస్ లో నేతగా ఎదిగిన డీకే శివకుమార తన చాకచక్యంతో గౌడల్లో చీలిక తీసుకొచ్చారు. గౌడలు అంటే జేడీఎస్ అనే పరిస్థితి పోగొట్టారీయన. దేవేగౌడ కుటుంబీకులను కాంగ్రెస్ నుంచి ఈయన ఓడించారు. గౌడల కంచుకోట్ల కాంగ్రెస్ జెండా పాతాడు డీకేశి. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగాడు. అన్ని కుదిరితే కాంగ్రెస్ తరఫున సీఎం కావాల్సింది. అయితే అవకాశం త్రుటిలో చేజారింది. తను కూడా గౌడ కావడంతోనే డీకేశీ వక్కలిగ కంచుకోటల్లో జెండా పాతగలిగారు.

ఇటీవల ఆయన అరెస్టు జరిగిన తర్వాత వక్కలిగలు భారీ నిరసన ప్రదర్శన ఒకటి నిర్వహించారంటే ఆ కమ్యూనిటీపై ఆయన బలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గతంతో దేవేగౌడ ఉండిన ప్లేస్ లో ఇప్పుడు డీకేశి ఉన్నారు. అలా తమ ఆధిపత్యానికి చెక్ పెట్టాడని డీకేపై దేవేగౌడకు చాలాకోపం అంటారు. అయితే ఇటీవల కుమారస్వామి సీఎం కావడంలో డీకేశి కృషి కూడా చాలా ఉంది. వైరాలు మరిచి కలిసిపోయారు. ఇప్పుడు పాత రాజకీయ శత్రువును పరామర్శించడానికి కుమారస్వామి తీహార్ కు కూడా వెళ్లారు. 

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

Show comments