రవితేజ సినిమాలో వాస్తవ ఘటన అదేనా?

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైంది. హీరోయిన్ శృతిహాసన్ కూడా ఓపెనింగ్ కు రావడం కొసమెరుపు.

అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ ను రాఘవేంద్రరావు డైరక్ట్ చేశారు. అంతా ఊహించినట్టుగానే ఈ సినిమాకు క్రాక్ (Krack) అనే టైటిల్ పెట్టారు.

అయితే ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే, ఇవాళ జరిగిన ఓపెనింగ్ లో కొత్త విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట.

అవును.. గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాడట దర్శకుడు గోపీచంద్ మలినేని.

మరీ ముఖ్యంగా గత ఎన్నికల టైమ్ లో తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ తరఫున గెలిచిన గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. దీనికే కాస్త ఫిక్షన్, రవితేజ మేనరిజమ్స్ జోడించి క్రాక్ సినిమా తీయబోతున్నాడు.

రవితేజ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించడం కూడా ఈ రూమర్ కు మరింత ఊతమిస్తోంది. దర్శకుడు మాత్రం ప్రస్తుతానికి ఈ మేటర్ సస్పెన్స్ అంటున్నాడు.

ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను రెడీ చేయబోతున్నారు.

గతంలో రవితేజ, మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో క్రాక్ పై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి.

అటు చాన్నాళ్ల తర్వాత శృతిహాసన్ కూడా ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం సినిమాకు కాస్త హైప్ తీసుకొచ్చే అంశం.