త్రివిక్రమ్ సినిమాలంటే ఎంతటి సీరియస్ కంటెంట్ అయినా కామెడీగానే వుంటుందనేది తెలిసిందే. ఖలేజా, అజ్ఞాతవాసి చిత్రాల బేసిక్ లైన్స్ మంచివే అయినా కానీ వాటిని కామెడీగా డీల్ చేయడం వల్ల ఫలితాలు తేడా అయ్యాయి. ఇంతకాలం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోని త్రివిక్రమ్ ట్రెండ్ని ఇప్పుడు బాగానే స్టడీ చేసాడు.
ఎంటర్టైన్మెంట్ జోలికి పోకుండా సీరియస్గా కథలు చెప్పే కొరటాల నుంచి స్ఫూర్తి పొందాడో ఏమో 'అరవింద సమేత' చిత్రంలో పాత కథనే సిన్సియర్గా చెప్పాడు. అనవసరపు పాటలు, కామెడీ జోలికి పోకుండా తన కథకి స్టిక్ అయి వున్నాడు. దీంతో త్రివిక్రమ్ మార్కు వినోదం ఆశించే వర్గం కాస్త నిరాశ పడ్డారేమో కానీ చాలా మంది దీనిని స్వాగతిస్తున్నారు.
త్రివిక్రమ్ ఏదైనా పాయింట్ని సీరియస్గా చెబితే, తన మార్కు మాటలతో కన్విన్స్ చేస్తే ఎలాగుంటుందనేది ఈ చిత్రంలో పలు సన్నివేశాల్లో స్పష్టమయింది. ట్రెండుకి తగ్గట్టు అప్డేట్ అయిన త్రివిక్రమ్ నుంచి ఇకపై చాలా మంచి చిత్రాలు వస్తాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
ఇంకా తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకోని త్రివిక్రమ్ అయితే వెంకీ లేదా అల్లు అర్జున్తో అది చేస్తాడని సమాచారం.