ఆ డ్రైవర్ చనిపోయాడు

హైదరాబాద్ కాచిగూడ వద్ద రెండు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతిచెందాడు. ఈనెల 11న ప్రమాదం జరగగా, అప్పట్నుంచి కేర్ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. 2 రోజుల కిందట అతడి కాలును వైద్యులు తొలిగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో చంద్రశేఖర్ మృతిచెందాడు.

కాచిగూడ యాక్సిడెంట్ లో చంద్రశేఖర్ దే తప్పంటోంది రైల్వే శాఖ. స్టేషన్ లో సిగ్నల్ ను గమనించకుండా వెళ్లాడని, ఫలితంగా హంద్రీ ఎక్స్ ప్రెస్, ఎంఎంటీఎస్ పరస్పరం ఢీకొట్టాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు లోకో పైలెట్ పై పలు కేసులు కూడా నమోదుచేశారు. తన కొడుకును కావాలనే బలిపశువును చేశారని చంద్రశేఖర్ తండ్రి ఆరోపిస్తున్నారు. ఇంతలోనే చంద్రశేఖర్ మృతిచెందాడు.

అప్పటి ఘటనలో రెండు రైళ్లకు చెందిన ఇంజిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఎంఎంటీఎస్ రైలుకు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 30మందికి గాయాలయ్యాయి. రైళ్లు పరస్పరం ఢీకొన్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి కూడా.
 
ఘటనలో లోకో పైలెట్ చంద్రశేఖర్ ఇంజిన్ క్యాబిన్ భాగంలో ఇరుక్కుపోవడంతో, 8 గంటల పాటు శ్రమించి అతడ్ని బయటకు తీశారు. అలా బయటకొచ్చిన అతడు, రాత్రి మృతిచెందాడు. చంద్రశేఖర్ మృతితో ఈ కేసు క్లోజ్ కాబోతోంది.

Show comments