జగన్ కు మద్దతు ఇస్తున్నా- టిడిపి ఎమ్మెల్యే

ప్రజల ఆదరణ పొంది అదికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. అవసరమైతే రాజీనామా చేసి జగన్ కు మద్దతు ఇస్తానని ఆయన అన్నారు.

తాను ప్రభుత్వం మంచి చేస్తే మద్దతు ఇస్తానని, మంచి చేయకపోతే వ్యతిరేకిస్తానని ఆయన అన్నారు. తనకు వైఎస్ జగన్ తో 1995 నుంచి పరిచయం ఉందని, ఆ తర్వాత తాను టిడిపిలో ఉన్నా, అప్పటి ముఖ్యమంత్రి గా వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు సాయం చేశారని, అలా చాలమందికి ఆయన సాయం చేశారని వంశీ అన్నారు.

జగన్ జైలులో ఉన్నా, తాను వెళ్లి కలవలేదని, అయినా జగన్ తన పట్ల అమర్యాదగా లేరని ఆయన అన్నారు.

తనపై టిడిపి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేసి తనను టిడిపిలో ఉంచుకుంటారా అని వంశీ ప్రశ్నించారు. తాను జగన్ కు మద్దతు ప్రకటిస్తున్నానని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే పదవి పెద్ద పదవి కాదని, ఇది శాశ్వతం కాదని, వారసత్వ పదవి కాని అన్నారు. ఎమ్మెల్యే పదవి కి రాజీనామా అవసరం ఉండవకపోవచ్చని, అవసరమైతే రాజీనామా చేస్తానని, వంశీ అన్నారు.