జగన్ తో టచ్ లో టాలీవుడ్ కింగ్ పిన్?

టాలీవుడ్ లో కింగ్ పిన్ ఆయన. తెరవెనుకే వుండి చక్రం తిప్పడంలో సిద్దహస్తులు. తన పేరు బయటకు రానివ్వరు. కానీ సినిమారంగంలోని ప్రతిచోటా తన మనుషులు వుండేలా చూసుకుంటారు. తనవాళ్లే ఎన్నికయ్యేలా చూసుకుంటారు. పైకి తన ప్రమేయం కనిపించకుండానే అన్ని వ్యవహారాలను శాసిస్తుంటారు. పైగా ఆంధ్ర సిఎమ్ చంద్రబాబుకు బాగా దగ్గర అని పేరు.  అయితే వ్యాపార దక్షతకు మారుపేరు అయిన ఆయన, రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అటు కేసిఆర్ కు కూడా దగ్గరయిపోయారు.

ఇద్దరు ముఖ్యమంత్రులతో సఖ్యత, పలుకుబడి చాలా జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఇక్కడో కాలు, అక్కడో కాలు అన్నట్లు, అన్నిచోట్లా తనమాట చెల్లేలా చేసుకుంటున్నారని టాలీవుడ్ లో టాక్ వుంది.

ఇలాంటి నేపథ్యంలో ఆయన త్రివిక్రముడి మాదిరిగా మూడోకాలును జగన్ క్యాంప్ లో పెట్టినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా ఆయన జగన్ తో కంటిన్యూగా టచ్ లో వున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. భవిష్యత్ ను ఊహించారో, ఊహిస్తున్నారో మరి ఆయన ఉన్నట్లుండి మూడు నెలలుగా జగన్ క్యాంప్ కు, ఆపై జగన్ కు టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి అత్యంత లాయలిస్ట్ అని పేరుంది. ఆయన కుటుంబానికి ప్రజాపదవుల నేపథ్యం వుంది. అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచే. మరి అలాంటిది ఉన్నట్లుండి ఈ టర్నింగ్ అన్నది టాలీవుడ్ లో డిస్కషన్ గా వుంది. వాస్తవానికి ఆయన గతంలో విశాఖలో తన వ్యాపారాలకు సంబంధించి వైఎస్ నుంచి ఉపకారం పొందారని గుసగుసలు వున్నాయి. తరువాత మళ్లీ తెలుగుదేశంలో తన మూలాలు అలాగే వుంచుకున్నారు.

ఆంధ్రలో వ్యాపారాలు దండిగా వున్నందున, ఎందుకయినా మంచిది అని ముందుగానే జగన్ తో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

బాబుకు దూరమవుతున్న టాలీవుడ్
అవసరార్థం పాదసేవ అన్నది నానుడి. అవసరం వుంటేనే ఎవరన్నా దగ్గరకు చేరతారు. లేదంటే లేదు. ఇప్పుడు టాలీవుడ్ జనాల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. టాలీవుడ్ కీలక వ్యవహారాలు అన్నీ హైదరాబాద్ లోనే వున్నాయి. అందుకే రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి టాలీవుడ్ కేసిఆర్ కు దగ్గర కావడం, బాబుకు దూరంకావడం ప్రారంభమైంది.

సినిమా జనాలతో కేటిఆర్ టచ్ లో వుండడం, సినిమా రంగానికి బాగా దగ్గరగా వుండే తలసాని శ్రీనివాస యాదవ్ ను సినిమాటోగ్రఫీ మంత్రిగా చేయడంతో గత అయిదేళ్లలో టాలీవుడ్ దాదాపు బాబును మరిచిపోయింది.

హీరో కృష్ణ ఫ్యామిలీ కేసిఆర్ కు దగ్గరయ్యారు. అల్లు అరవింద్ లేదా చిరంజీవి మెగా క్యాంప్ కాంగ్రెస్ తో వుండి ఇప్పుడు జనసేనకు దగ్గరయింది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి నేరుగా జగన్ తో దగ్గరి బంధుత్వమే వుంది. దివంగత దర్శకుడు దాసరి తనయుడు వైకాపాకు దగ్గరవుతున్నారని వార్తలు వున్నాయి.

హీరో నాగార్జున నేరుగా వెళ్లి జగన్ ను కలిసి పాదయాత్రపై అభినందించి వచ్చారు. ప్రమఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే వైకాపా ఎమ్మెల్యేతో బంధుత్వం కలుపుకున్నారు. హీరో నిఖిల్ మామయ్య వైకాపా తరపున పోటీలోకి దిగబోతున్నారు. పృథ్వీ, పోసాని వైకాపా తరపున గట్టిగా గొంతు వినిపిస్తున్నారు.

బాబు చేసింది లేదు
ఇదిలా వుంటే అయిదేళ్లలో బాబు టాలీవుడ్ కు చేసిదంటూ ఏమీలేదనే చెప్పాలి. టాలీవుడ్ ను ఆంధ్రలో కూడా అభివృద్ధి చేస్తామని అనడమే కానీ, అటు అమరావతిలో కానీ, ఇటు విశాఖలో కానీ లేదా తిరుపతి ప్రాంతంలో కానీ, అందుకోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అమరావతిలో ఎన్నో సంస్థలకు, వ్యక్తులకు వేల ఎకరాలు ధారాదత్తం చేసారు కానీ, టాలీవుడ్ స్టూడియోలకో, ఇతర సంస్థలకో ఏమీ ఇవ్వలేదు. అలా అని దరఖాస్తులు చేయలేదా అంటే చాలామంది ప్రయత్నాలు చేసారన్న టాక్ వుంది.

కేవలం థియేటర్ల టికెట్ ల పెంపు, పన్నుల వ్యవహారాలు చూసీ చూడనట్లు వదిలేయడం మినహా బాబు చేసింది లేదని విమర్శ వుంది. అలాగే ఆంధ్రలో షూటింగ్ లకు సబ్సిడీలు ఇవ్వడంలో విధించిన నిబంధనల కారణంగా పెద్దగా ఉపయోగం లేదనీ టాక్ వుంది.

ఇలా మొత్తంమీద టాలీవుడ్ వ్యవహారం చూస్తుంటే బాబుకు దూరం అవుతున్నట్లే వుంది. ప్రస్తుతానికి. ఎందుకంటే ఎక్కడ అధికారం వుంటే అక్కడ వాలడం అన్నది టాలీవుడ్ కు అలవాటు. బాబుతో, తరువాత వైఎస్ తో, ఆపై బాబుతో ఇలా అటు ఇటు షిఫ్ట్ అయిన నేపథ్యం టాలీవుడ్ కు వుంది.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments