మళ్లీ పాత రోజులు గుర్తు చేసిన జగన్

చంద్రబాబుకీ, జగన్ కీ నక్కకీ నాగ లోకానికీ ఉన్నంత తేడా ఉంది. పరిపాలనలోనే కాదు, ప్రజలతో మమేకమయ్యే విషయంలో కూడా వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసం. చంద్రబాబు పాదయాత్ర చేసినా ఆయన ప్రజల్ని దగ్గరకు తీసుకునే విధానం మొక్కుబడిగానే ఉండేది, కానీ జగన్ మనస్ఫూర్తిగా ప్రజలతో మమేకమయ్యారు.

సీఎం అయిన తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఆయన ప్రజల్లోకి వెళ్లడం సాధ్యపడలేదనుకోండి. బహిరంగ సభల్లో కూడా సెక్యూరిటీ కారణంగా కాస్త ప్రజలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే ఈరోజు జరిగిన మత్స్యకార భరోసా బహిరంగ సభలో జగన్ మళ్లీ తన పాత రోజుల్ని గుర్తు చేశారు. సభా ప్రాంగణం దిగి వెళ్లిపోతూ అక్కడే తన కోసం నిలబడి ఉన్న ప్రజల వద్దకు వెళ్లారు జగన్. బారికేడ్లు అడ్డంగా ఉన్నా కూడా ఆయన అక్కడే ఆగి అర్జీలు స్వీకరించారు.

తన పీఏకి చెబితే ఆ పని పూర్తవుతుంది. కానీ జగన్ తనే స్వయంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. అక్కడితో ఆగలేదు, ఒక్కొక్కరి సమస్యలను తానే స్వయంగా విన్నారు, వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మరీ కదిలారు. దాదాపు 10 నిమిషాల పాటు జగన్ ప్రజల దగ్గరే ఉన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా సెక్యూరిటీని పక్కన పెట్టి మరీ జగన్ ప్రజల వద్దకు వెళ్లడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. మళ్లీ పాతరోజుల్ని జగన్ గుర్తు చేశారని అనుకున్నారంతా. పాదయాత్ర సందర్భంగా ఏడాదిన్నరగా ప్రజల్లోనే ఉన్న జగన్, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వీలైనంతగా జనాల్లో కలవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి ఇవాళ్టి కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ.

Show comments