రాబోయేది రాజన్న రాజ్యం అనే సందేశం ప్రజలు, రాజకీయ నాయకులు, సినీతారలు అందరికీ వెళ్లిపోయింది. అందుకే జగన్ భేటీకి అందరూ క్యూ కడుతున్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వరసబెట్టి వైసీపీలో చేరుతున్నారు. ఇతర ప్రముఖులు కూడా జగన్ తో భేటీ అయి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది.
చేజారిపోతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీకి ఎలాంటి నష్టంలేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మధనపడిపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ తో ఎవరైతే భేటీ అవుతున్నారో, వాళ్ల ప్రత్యర్థుల్లో భయం మరింత ఎక్కువైంది.
ఎంపీ అవంతి శ్రీనివాస్ చేరిక సమయంలో మంత్రి గంటా శ్రీనివాస్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాను చేసిన రాయబేరాలు కూడా బయటపడతాయనే భయంతో అవంతిపై నోరు పారేసుకొని పరువు పోగొట్టుకున్నారు గంటా.
తాజాగా వైఎస్ జగన్ ని హీరో నాగార్జున కలవడం, ఆయన గుంటూరు నుంచి పోటీచేస్తారనే పుకార్లు రావడంతో ఎంపీ గల్లా జయదేవ్ ఉలిక్కిపడ్డారు. గుంటూరు సీటుపై నాగ్ కర్చీఫ్ వేస్తాడేమోనన్న అనుమానంతో గల్లా ముందుగానే బైటపడ్డారు.
నాగార్జున తనకు మంచి స్నేహితుడని, జగన్ ని కలసినంత మాత్రాన ఆయన రాజకీయాల్లోకి వస్తారని తాను అనుకోవడంలేదని, తనకు చెప్పకుండా ఆయన గుంటూరు నుంచి పోటీచేయరని చెప్పుకొచ్చారు. జగన్-నాగ్ భేటీ గురించి ఇంత సుదీర్ఘమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం గల్లాకు లేదు. అయితే తన సీటుకు ఎక్కడ పోటీ వస్తుందనే భయంతోనే ఆయన ఈ విధంగా కలరింగ్ ఇచ్చుకున్నాడు.
అసలే సర్వేలు టీడీపీకి దారుణ పరాభవం తప్పదని తేల్చేశాయి. ఈ దశలో నాగార్జున తనపై పోటీచేస్తే, అందులోనూ వైసీపీ టికెట్ పై.. ఇంకేమైనా ఉందా, డిపాజిట్ గల్లంతవదూ. అందుకే ముందు జాగ్రత్తగా నాగార్జున రాజకీయాల్లోకి రాడని ఓ స్టేట్ మెంట్ పడేశారు గల్లా జయదేవ్.
మొత్తమ్మీద జగన్ తో ఎవరు భేటీ అవుతున్నా పచ్చనేతలు మాత్రం వణికిపోతున్నారు. తమ సీటు కిందకు ఎక్కడ నీళ్లొస్తాయోనని హడలిపోతున్నారు.