ఎందుకు ఈ అత్యాశ? సాధ్యమవుతుందా?

ఏ పార్టీ అధినేత అయినా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఈ ఆశ మంచిదే. కాని అది అత్యాశగా మారితే? అతిశయోక్తిగా మాట్లాడితే? ఎలా ఉంటుంది? ఎబ్బెట్టుగా ఉంటుంది. వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఇలాగే మాట్లాడారు విజయనగరం జిల్లాలో. 'ప్రజల ఆశీస్సులు ఉంటే రాబోయే ముప్పయ్‌ ఏళ్లూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా' అన్నారు. అంటే వరుసగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఆయన కోరిక.

అసలు ఒక నాయకుడు ముప్పయ్‌ ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగడం సాధ్యమా? ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా కొనసాగినవారు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు.. సీపీఎం దిగ్గజం జ్యోతి బసు 23 ఏళ్లు పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అలాగే సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్‌ కుమార్‌ ఛామింగ్‌ ఐదుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వీరు దశాబ్దాల తరబడి తామే ముఖ్యమంత్రులుగా ఉంటామని ప్రచారం చేసుకోలేదు. ప్రజాదరణతో సీఎంలుగా కొనసాగారు.

ప్రజాదరణ ఉంటే జగన్‌ కూడా సీఎంగా దశాబ్దాల తరబడి కొనసాగవచ్చు. అభ్యంతరం లేదు. కాని 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటానని తానే చెప్పుకోకూడదు. పార్టీలోని నాయకులు ఎవరైనా అంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కాని అధినేత చెప్పుకోకూడదు. మొదట ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఓపిక పట్టకపోతే ఎలా? వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే ఆ తరువాత టర్మ్‌కు కూడా తనను గెలిపించమని అడగొచ్చు.

'వచ్చే ఎన్నికల తరువాత నేనే ముఖ్యమంత్రిని' అని జగన్‌ బల్ల గుద్ది గతంలోనూ చెప్పారు. ' మన ప్రభుత్వం వస్తుంది' అని భరోసా ఇచ్చారు. 'రాజన్న రాజ్యం తెస్తా' అన్నారు. టీడీపీ నేతలు ఎంతగా ఎద్దేవా చేసినా, విమర్శిస్తున్నా విడువకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఎండా వానలను లెక్క చేయడంలేదు. ఇంత కష్టానికి ఫలితం దక్కితే మంచిదే.

'కాబోయే ముఖ్యమంత్రిని నేనే', 'వచ్చేది వైసీపీ ప్రభుత్వమే'... అని చాలాసార్లు చెప్పిన జగన్‌  ఓసారి '2017లో ముఖ్యమంత్రినవుతా' అని ప్రకటించి విస్మయపరిచారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని గతంలో అన్నారు. జగన్‌ ఇలా అతిశయోక్తిగా మాట్లాడితే అది ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముండొచ్చు. కాస్త అలోచించుకుంటే మంచిది.

Show comments