జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే సూపర్ నే

ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ, ప్రయివేటుగా ప్రాక్టీసు చేసుకుంటూ, అక్కడి నుంచి పేషెంట్లను ప్రయివేటు ఆసుపత్రులకు తరలిస్తారనే అపవాదు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు డాక్టర్లు. గతంలో అనేకసార్లు ప్రభుత్వ డాక్టర్ల పనితీరు మెరుగుపర్చాలనే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసాయి. కానీ విజయం సాధించింది తక్కువ. సరైన నిపుణులైన వైద్యులు ప్రభుత్వానికి దొరకరని, వారి ప్రయివేటు ప్రాక్టీసును అనుమతిస్తూ వస్తున్నారు. దీనివల్ల పేదలు, మధ్యతరగతి జనాలు లక్షలు నష్టపోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ వైద్యుల ప్రయివేటు ప్రాక్టీసును నిషేధించాలని ఆంధ్రలో వైద్యసేవల మెరుగుకు సలహాలు ఇవ్వడం కోసం నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. కావాలంటే ఆ మేరకు వారికి జీతాలు పెంచవచ్చని సూచించింది. ప్రయివేటు ప్రాక్టీసు నిషేధిస్తే డాక్టర్లు సకాలంలో ఆసుపత్రులకు రావడం, పూర్తి సమయం అక్కడ వెచ్చించడం సాధ్యమవుతుంది.

కమిటీ సూచనలకు సిఎమ్ జగన్ అమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయం కొంతమంది డాక్టర్లకు రుచించకపోవచ్చు కానీ, ఇంకా నిరుద్యోగులుగా వున్న డాక్టర్లకు, పేషెంట్లకు మాత్రం ఆమోదయోగ్యంగా వుంటుంది. రాను రాను డాక్టర్ల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల వైద్యులు దొరకరు అన్న సమస్యలేదు.

వైద్యులు-సంబంధిత శాఖ అధికారులు కుమ్మకై, వివిధ లొసుగులు ఆధారం చేసుకుని, గ్రామాలకు వెళ్లకుండా పట్టణాలు పట్టుకుని వేలాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేవలం ప్రయివేటు ప్రాక్టీసు కట్టడి చేస్తే సరిపోదు. నిబంధనలను కూడా కట్టుదిట్టం చేసి, లూప్ హోల్స్ సెట్ చేసి, పరిస్థితి చక్కదిద్దడం అవసరం.

మారని చంద్రబాబు నాయుడు తీరు

Show comments