ఐటీదాడులు ట్రయిలర్ మాత్రమే.. బాబుకు చుక్కలే

టీడీపీ రాజకీయ వ్యాపారులపై జరుగుతున్న దాడులు జస్ట్ ట్రయిలర్ మాత్రమేనా? అసలు కథ, పూర్తి సినిమా ఇంకా మిగిలే ఉందా..? ప్రస్తుతం హస్తిన నుంచి ఇలాంటి లీకులే వస్తున్నాయి. తనకు ఎదురు తిరిగినా, ఎదురు తిరగాలన్న ఆలోచన వచ్చినా వారిని పాతాళంలోకి తొక్కేయడం మోడీ స్టయిల్. మహా మహా అద్వానీలాంటి వాళ్లనే బలవంతంగా రిటైర్మెంట్ చేయించాడు, వెంకయ్యనాయుడుపై అదురుదెబ్బ వేసి సైడ్ ట్రాక్ లోకి నెట్టేశాడు. అలాంటి మోడీకి చంద్రబాబు ఓ లెక్కా.

ప్రత్యేకహోదా పేరుతో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని నానా యాగీ చేయడం, కేంద్రం సహకరించడం లేదని ప్రచారం చేయడం, మోదీ కంటే నేనే సీనియర్ అంటూ దెప్పిపొడవడం.. ఇవన్నీ అక్కడ రికార్డ్ అయిపోయాయి. వీటిపై చిన్నగా రియాక్షన్ మొదలైంది. ఐటీ దాడుల పేరుతో చంద్రబాబు క్యాష్ టీమ్ పై జరుగుతున్న దాడులు జస్ట్ శాంపిల్ మాత్రమే.

నిన్నటితో ఐటీ రైడ్స్ ముగిశాయని టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. వీటికి భయపడటం లేదని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మోడీని ముందుంచి తెరవెనక అమిత్ షా రివేంజ్ డ్రామాని రక్తికట్టించే పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన కొన్ని కుంభకోణాల్ని కేంద్రం బయటపెట్టబోతోందని తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు, రాజధాని ఒప్పందాలు, భూసేకరణలో జరిగిన అవినీతి, తాత్కాలిక నిర్మాణాల పేరుతో జరిగిన దోపిడీ, రుణమాఫీ పథకాల్లో లొసుగులు, అమరావతి బాండ్లు.. ఒకటేంటి, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి బండారాన్నంతా బయట పెట్టేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

ఇవన్నీ ఒక ఎత్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతి మరో ఎత్తు. ఇది భారీ కుంభకోణం అంటూ ఉండవల్లి వంటి నేతలు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. దీనితో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా కేంద్రం దృష్టిసారించింది.

కేంద్రం నిధులిస్తున్న పథకాలను కూడా సరిగ్గా అమలు చేయకుండా వాటికి కోతలు వేసి రాష్ట్రం పేదల కడుపు కొడుతోందని ప్రచారం చేయబోతోంది. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి, చంద్రబాబు ఎలా జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారో కూడా బయటపెట్టబోతోంది.

కుంభకోణాలను బయటపెట్టడమే కాదు, దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి చంద్రబాబు పరువుని ఢిల్లీ స్థాయిలో బజారు కీడ్చాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐటీ దాడుల్ని కుట్ర అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సరే, మరి ఇలాంటి కుంభకోణాలు సాక్ష్యాధారాలతో సహా బైటపడితే చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొంటారు.

క్రమశిక్షణ, నిజాయితీ, ఒక్క పైసా అవినీతి చేయలేదని రోజూ కబుర్లు చెప్పుకునే చంద్రబాబు, కుంభకోణాలు బయటపడితే ప్రజలకు ముఖం ఎలా చూపిస్తారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments