అవున్నిజమే.. ఎనీ డౌట్స్??

‘ముఖ్యమంత్రి జగన్ చిటికేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు.. తెదేపాను వైకాపా కార్యాలయంలోని స్టోర్‌రూంకు మార్చేస్తాం’ అని మంత్రి కొడాలి నాని అన్న మాటలపై ఇప్పుడు నానా రాద్ధాంతమూ రేగుతోంది.

కొడాలి నాని ఏదో పెద్ద కుట్రను బయటపెట్టినట్టుగా.. తెలుగుదేశం నాయకులు యాగీ చేస్తున్నారు. వంశీని పార్టీనుంచి వారే సస్పెండ్ చేసి.. జగన్మోహన రెడ్డి ఫిరాయింపులకు కుట్ర చేస్తున్నట్లుగా తెదేపా నాయకులు విలపిస్తున్నారు.

ఈ  మాటను ప్రత్యేకించి కొడాలి నాని అనక్కర్లేదు. తెలుగుదేశం ప్రస్తుతం ఎంత దీనస్థితిలో ఉన్నదో.. చాన్సంటూ దొరికితే చాలు.. ఆ పార్టీ వీడిపోవడానికి చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. కానీ అనర్హత వేటు పడుతుందని, మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని  వారు భయపడుతున్నారు.

చంద్రబాబునాయుడు లాగా.. అనైతిక రాజకీయాలకు జగన్ కూడా దిగదలచుకుంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. వచ్చేవాళ్లు వచ్చేయండి అంటూ గేట్లు తెరిస్తే గనుక.. తెలుగుదేశం పార్టీ గంటలో ప్రతిపక్షహోదాను కోల్పోతుంది... అందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం 23 సీట్లకు పరిమితం అయినప్పుడే.. సగం మందికి ఆ పార్టీ భవిష్యత్తు మీద ఆశలు పోయాయి. ముందుజాగ్రత్త ఉన్నవారంతా పక్కదార్లు  చూసుకోవడం ప్రారంభించారు.

రాజ్యసభలో దాదాపు పార్టీ ఖాళీ అయిపోయింది. లోక్‌సభలో బేరాలు ఒకపట్టాన తెగడం లేదు. కేవలం శాసనసభలో మాత్రమే వారి అస్తిత్వం స్థిరంగా ఉంది. అంతమాత్రాన అది పార్టీ బలం అనుకుంటే పొరబాటు...! కేవలం జగన్మోహన రెడ్డి ఫిరాయింపులను వ్యతిరేకంచే విలువలు గల నాయకుడు కావడం వల్లనే వారి పార్టీ ఇంకా బతికి బట్ట కడుతోంది.

ఇలాటి నేపథ్యంలోనే... మంత్రి కొడాలి నాని ఆ మాటలు అన్నారు. తెలుగుదేశానికి అంత రోషంగా ఉంటే నాని సవాలును స్వీకరించాలి. ఎన్టీఆర్ స్థాపించిన ఈ తెలుగుదేశాన్ని వదిలేసి.. సీబీఎన్ –తెలుగుదేశం కొత్తగా స్థాపించి బరిలోకి దిగాలి.

నాని చెప్పినట్లు 175 స్థానాల్లో డిపాజిట్లు తెచ్చుకుని.. తమ సత్తా నిరూపించుకోవాలి.. సవాలు తీసుకుంటారా? ఎనీ డౌట్స్??

Show comments