ఎన్నికల పోరులో మొదటి అంకం ముగిసింది. అన్ని పార్టీల్లో టికెట్ ల కేటాయింపు పూర్తయింది. ఇక రెండో అంకం మొదలయింది. అదే అసలైనది. అలిగిన వారిని బుజ్జగించడం, దూరంగా జరిగిన వారిని దగ్గరకు తీసుకురావడం. అన్నివర్గాల నాయకులను భుజం భుజం కలిపేలా చేయగలగడం అన్నది అసలు సిసలైన అంకం. అసంతృప్తులు ఎక్కడున్నారా? అని అవతల పార్టీ జనాలు వెదుకుతుంటారు. కాస్త డబ్బులు ఇచ్చి, దగ్గరకు తీస్తుంటారు. ఇది ఏ పార్టీలో అయినా కామన్.
ఎప్పుడైతే గెలుపు మీద ధీమా వుంటుందో? అక్కడ టికెట్ ల కోసం పోటీ, అలకలు ఎక్కువగా వుంటాయి. వైకాపాలో పరిస్థితి ఇప్పుడు అలాగే వుంది. అందుకే అలకలు, కోపాలు కనిపిస్తున్నాయి. వాటిని కాస్త ఎక్కువ చేసి చూపించడంలో తేదేపా మీడియా ఫుల్ బిజీగా వుంది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు క్రైసిస్ మేనేజ్ మెంట్ కు టీమ్ రెడీగా వుంటుంది. అక్కడ పార్టీలో కీలకంగా వున్నవారే కాదు, పార్టీ సింపథైజర్లు కూడా తమవంతు సాయం తాము చేస్తారు. కానీ వైకాపాకు అలాకాదు. ఇక్కడ జగన్ నేరుగా మాట్లాడే అవకాశం తక్కువ. విజయసాయి రెడ్డి మీదే భరోసా అంతా. మిగిలిన వారిలో అంత సీన్ వున్నవారు లేరు.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, ఇలా అలకలు పూనిన వారంతా విజయసాయి రెడ్డి మీదే కోపంగా వున్నారు. ఆయన వల్లే టికెట్ ల కేటాయింపు ఇలా జరిగిందని అనుకుంటున్నారు. జగన్ ను విజయసాయి తప్పుదారి పట్టించారని ఫీలవుతున్నారు.
అందువల్ల కాస్తయినా తీరుబాటు చేసుకుని జగన్ రంగంలోకి దిగాల్సిందే. ఏదో రకమైన హామీనో, మరోటో ఇచ్చి బుజ్జగించాల్సిందే. లేదంటే జనంలో వున్న ఊపును వీళ్లంతా కలిసి చెడగొట్టే ప్రమాదం వుంది.