రాజకీయాలకు డ్రీమ్ గర్ల్ గుడ్ బై!

తనకు ఇవే  చివరి ఎన్నికలు అని, ఈ సారి మాత్రం తనను గెలిపించాలని, ఇకపై తను పోటీ చేయనంటూ ఇటీవలి ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ నేత, అలనాటి డ్రీమ్ గర్ల్  హేమమాలిని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు హేమమాలిని. ఆ నియోజకవర్గం నుంచి వరసగా మరోసారి విజయం సాధించి ఎంపీ అయ్యారు. మథురలో గత ఐదేళ్లలో హేమమాలిని తీరుపై నిరసనల స్వరాలు వినిపించాయి.

ఆమె నియోజకవర్గానికి అందుబాటులో ఉండరనే పేరు వచ్చింది. ఆమె కనిపించడం లేదంటూ పోస్టర్లు సైతం వెలిశాయి. అయితే యూపీలో వీచిన బీజేపీ గాలిలో హేమమాలిని ఘన విజయం సాధించారు. ఎంపీ అయ్యారు. అయినప్పటికీ  ముందే ప్రకటించినట్టుగా తను రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్టుగా హేమమాలిని ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా హేమ మీడియా వర్గాలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రాజకీయాల నుంచి వైదొలగబోతున్న ప్రకటన చేశారు.

అయితే మరో నాలుగేళ్లకు పైనే ఆమె ఎంపీగా కొనసాగే అవకాశాలున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆమె సవతి తనయుడు సన్నీ డియోల్ కూడా ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ధర్మేంద్ర తనయుడు అయిన సన్నీ డియోల్ పంజాబ్ నుంచి ఎంపీగా నెగ్గారు. ధర్మేంద్ర రెండో భార్య అయిన హేమమాలిని యూపీ నుంచి నెగ్గారు.

ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా హేమ పంచుకున్నారు. దను ధరమ్ జీని పెళ్లి చేసుకున్నా, ఆయన మొదటి భార్య నుంచి ఆయనను వేరు చేయలేదని ఆమె వివరించారు. ఆయనపై మనసు పడి పెళ్లి చేసుకున్నట్టుగా వివరించారు. ధర్మేంద్రతో హేమకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్న సంగతి, వారు పలు సినిమాల్లో హీరోయిన్లుగా కూడా నటించిన సంగతి తెలిసిందే.

Show comments