వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పలువురు స్టార్లను తమ పార్టీ తరఫున బరిలోకి దింపాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే మాట వినిపిస్తోంది. విఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ ను కూడా బీజేపీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోందనే మాట వినిపించింది కొన్నాళ్ల కిందట. కపిల్ ను రాజ్యసభకు నామినేట్ చేయనుంది బీజేపీ అనే వార్తలూ వచ్చాయి.
ఆ సంగతేమో కానీ.. కొంతమంది క్రికెటర్లను కమలం పార్టీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి వాళ్లను రంగంలోకి దించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
వీరిలో గంభీర్ దాదాపు రెడీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్స్ నుంచి గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో గంభీర్ రాజకీయ నేతగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని, ఢిల్లీలోని ఒక ఎంపీ సీటు నుంచి పోటీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇలా గంభీర్ ను మాత్రమేగాక.. అలనాటి అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను కూడా బీజేపీ రంగంలోకి దించనుందని సమాచారం. మాధురిని బీజేపీ పుణే నుంచి పోటీ చేయించనుందనే మాట వినిపిస్తోంది. అక్కడ సిట్టింగ్ బీజేపీ ఎంపీనే ఉన్నా, సిట్టింగులను మార్చడానికి అనుగుణంగా పుణే నుంచి మాధురిని పోటీ చేయించాలని బీజేపీ అనుకుంటోందట!