డ్రగ్స్ కేసు.. సినిమా ఇంకా వుందట

సినిమా జనాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన డ్రగ్స్ కేసుపై సమాచార హక్కు ద్వారా వెల్లడైన నిజాలు మీడియాలో చక్కర్లుకొట్టాయి. దీంతో కేసును నీరుకార్చారని, నిందితులను తప్పించారని విమర్శలు వినిపించాయి. ఈ మేరకు ఎక్సయిజ్ శాఖ నుంచి క్లారిటీ వచ్చింది.

''..ఇప్పుడు మీడియాలో వస్తున్న సమాచారం ఇప్పటిది కాదు, 2018 జూన్‌ 13న ఇచ్చిన సమాచారమని అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌, ప్రస్తుతం పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా ఉన్న అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ఛార్జిషీట్లు వేయాల్సి ఉందన్నారు. మాదక ద్రవ్యాల కేసులు పురోగతిలో ఉన్నాయి..''

ఇదీ ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన వెర్షన్ అనుకోవాలి. కానీ అసలు చార్జిషీట్ ల సంగతి అలా వుంచితే, వివిధ సినిమా జనాలకు నిర్వహించిన ల్యాబ్ పరీక్షల రిపోర్టులు ఏవి? ఎక్కడ అని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆ రిపోర్టులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇలా అందరూ అడుగుతుంటేనే అప్పట్లో సంచలనంగా నిలిచిన అకుల్ సబర్వాల్ ఈ వివరణ ఇచ్చారు. అదనపు చార్జిషీట్లు వేయాల్సి వుందని చెప్పారు.

కానీ విషయం ఏమిటంటే, ఆయన ఇప్పుడు ఆ శాఖలోలేరు. అదనపు చార్జిషీట్లు అయినా, మరోటి అయినా ఇప్పుడు ఆయనకు అంతగా సంబంధం వుండకపోవచ్చు. అదనపు చార్జిషీట్ లు వేయడం అన్నది ఏ కేసులో అయినా రిజర్వ్ లో వుండే వ్యవహారం. వేయచ్చు.. వేయకపోనూ వచ్చు. అందువల్ల ఈ సమాధానం కేవలం వినవస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి తప్ప వేరుకాదని అనుకోవచ్చు.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

Show comments