దాదాపు నెలన్నర కిందట.. ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి పిలుపు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలవుతోందంటే మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. ఈ రోజు పలానా ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది, రేపు ఆ జిల్లా వారికి పిలుపు రాబోతోంది, ప్రత్యేకించి ఎవరికైతే టికెట్ నిరాకరిస్తున్నారో వారికే పిలుపు వస్తోంది! దీంతో సీఎం ఆఫీసు నుంచి పిలుపు అంటేనే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో దడపుడుతోందనే వార్త బాగా హైలెట్ అయ్యింది!
ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేను, మీకు మరో అవకాశమో, ఇంకోలా అండగా ఉంటాను.. మీకు టికెట్ ఇవ్వడం లేదు..అనే విషయాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ అనుసరించిన మార్గం అది. పిలిచి, టికెట్ నిరాకరణ విషయాన్ని వారికి వివరించి, ముందున్న మార్గాల గురించి జగన్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. జగన్ మాటలతో సంతృప్తి పడిన వారూ ఉన్నారు, సమాధానపడని వారూ ఉన్నారు! అది వారి వ్యక్తిగతం. ఏపీ అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికే కొందరికి టికెట్ విషయంలో జగన్ నిరాకరించారని, దాంతోనే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటేశారనేది కూడా బహిరంగ రహస్యమే! వారితో అవసరం తీరాకా.. అసలు సంగతి చెప్పడం కంటే, ముందే క్లారిటీ ఇవ్వడం మేలనే తీరున జగన్ వ్యవహరించారు.
కట్ చేస్తే.. టీడీపీ అభ్యర్థుల ప్రకటనలోనూ చాలా మంది ఆశావహులకు నిరాశ తప్పలేదు! కొందరినైతే చంద్రబాబు నాయుడే బాహాటంగా అభ్యర్థులంటూ ప్రకటించారు! అలాంటి మాటపై కూడా చంద్రబాబు నిలబడలేదు! గత ఐదేళ్లుగా ఇన్ చార్జిలుగా ఖర్చులు పెట్టుకున్న వారూ ఉన్నారు! మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ వీరవిధేయులు ఉన్నారు! అయితే ఏ ఒక్కరినీ చంద్రబాబు నాయుడు ముందుగానే పిలిపించుకుని మాట్లాడిన దాఖలేనే లేదు! ఒక్కరినంటే ఒక్కరిని కూడా! వారు ఆశలు పెట్టుకున్న నియోజకవర్గంలో టీడీపీకి బదులు జనసేన లేదా బీజేపీలో పోటీ చేస్తుందని కానీ, లేదా ఇన్నాళ్లూ ఇన్ చార్జిలుగా వ్యవహరించిన వారికి బదులుగా వేరే వాళ్లకు టికెట్ కేటాయిస్తున్న విషయం కానీ .. ఎవరీని పిలిచి మాట్లాడుకున్న పరిస్థితి అయితే లేదు!
ఒక్కరినంటే ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు ముందే ఇచ్చిన సమాచారం లేదు! సముదాయింపు లేదు! అనంతపురం నుంచి పిఠాపురం వరకూ.. ఇదే పరిస్థితి! డైరెక్టుగా పత్రికా ప్రకటన ద్వారా తమకు టికెట్ ఉందో లేదో తెలుసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు! మీడియాలో ముఖంగానే చంద్రబాబు కమ్యూనికేషన్ జరిగింది ఈ ఎన్నికల విషయంలో!
బీజేపీ, జనసేనల పోటీకి నియోజకవర్గాలను వదలడంలో కానీ, టీడీపీ తరఫున అభ్యర్థిత్వాల విషయంలో కానీ.. ఇన్నాళ్లూ కోట్లు ఖర్చు పెట్టుకున్న ఇన్ చార్జిలను వెర్రి పువ్వులను చేశారు చంద్రబాబు గారు! పార్టీ కోసం కుటుంబాన్నే పణంగా పెట్టామని చెప్పుకునే పరిటాల కుటుంబానికి అయినా, ఇన్ చార్జి అని ప్రకటించి కోట్లు పెట్టించారని వాపోయే వారికి అయినా, ఆల్రెడీ చంద్రబాబు చేతే టీడీపీ అభ్యర్థిగా ప్రకటన పొందిన ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి అయినా ఒకటే!
జగన్ ను అహంకారి, ఎవ్వరినీ లెక్క చేయడు, తన పార్టీ వాళ్లను కూడా కోళ్లఫారంలో కోళ్లలాగా చూస్తాడు.. అంటూ విష ప్రచారం చేసింది పచ్చబ్యాచ్! అయితే వాస్తవం మాత్రం దాస్తే దాగని రీతిలో ఇలా స్పష్టంగా అగుపిస్తోంది. టికెట్ నిరాకరిస్తున్న తన వారని, ఎమ్మెల్యే గా బదులు ఎంపీ టికెట్ లేని ఎమ్మెల్సీ హామీ అని, మరో హామీ అని జగన్ వారిని పిలిపించుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు తీరులో మాత్రం సొంత పార్టీ తీరుపై హద్దేలేని లెక్కలేని తనం అగుపిస్తోంది!
-జీవన్