కాంగ్రెస్ కే కిరీటం.. తథ్యం

దాదాపు నెలరోజులకు పైగా జరుగుతున్న తెలంగాణ రాజకీయ క్రీడ సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్ మీదుగా ఫలితం దగ్గరకు చేరిపోయింది. మరో రెండురోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఈలోగా అనేక మీడియా సంస్థలు వాటి వాటి అంచనాలు అందించేసాయి. వీటన్నింటికి భిన్నంగా లగడపాటి రాజగోపాల్ తన సర్వే తాను అందించారు.

మొత్తం మీడియా సంస్థలు టీఆర్ఎస్ మళ్లీ కిరీటం దక్కుతోంది అంటుంటే, లగడపాటి రాజగోపాల్ మాత్రం కాంగ్రెస్ సారథ్యంలో మహాకూటమికి అధికారం దక్కబోతోంది అని జోస్యం చెప్పారు.

ఇలాంటి నేపథ్యంలో గ్రేట్ ఆంధ్ర తనవంతు ప్రయత్నం తను చేసింది. జిల్లాల వారీగా వివిధ రాజకీయ పక్షాల బలాబలాలు, ప్రజల్లోని వివిధ వర్గాలు, కులసమీకరణలు, అసంతృప్తులు, ఇలా పలు అంశాల వారీగా అభిప్రాయ సేకరణ చేసింది. ఈ అభిప్రాయ సేకరణ దాదాపుగా లగడపాటి రాజగోపాల్ చెబుతున్న దానికి దగ్గరగానే వుంది.

కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి మెజారిటీ స్థానాలు చేజిక్కించుకుని, ఎటువంటి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కనిపిస్తోంది. సీట్ల సంఖ్య ఎంత అన్నది కచ్చితమైన అంచనా మేము అందించడం లేదు. కానీ అధికార పీఠం మాత్రం కాంగ్రెస్ కే దక్కబోతోందన్న పాయింట్ మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. కానీ అలా అని సీట్ల సంఖ్య మీద అంచనా లేకపోలేదు.

మా అంచనా ప్రకారం కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 55 నుంచి 60 సీట్ల మధ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెరాస కు 40 సీట్లకు అయిదు సీట్లు ప్లస్ ఆర్ మైనస్ వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నాం.

వాస్తవానికి ఈసారి ఎన్నికల స్పేషాలిటీ ఏమిటంటే, అంచనాలు వేయడం అన్నది బాగా కష్టం కావడం. రాజకీయ పక్షాలు అన్నీ కూడా పోలింగ్ తరువాత కూడా పూర్తి ధీమాతో వుండడం. 

అయితే టీఆర్ఎస్ కు రకరకాల సమస్యలు గ్రౌండ్ లెవెల్ లో కనిపించాయి. వివిధ పక్షాల్లో నెలకొన్న అసంతృప్తి క్లియర్ గా కనిపించింది. ఉద్యమ సమయంలో, అలాగే 2014లో కెసిఆర్ కు వెన్నుదన్నుగా ఏయే పక్షాలు నిలిచాయో వాటిల్లో చాలా పక్షాలు ఈసారి మహాకూటమి వెనుక వెళ్లడం అన్నది ఎన్నికల ముందూ కనిపించింది. ఎన్నికల తరువాత కూడా కనిపించింది. 

అదే సమయంలో మరీ దిగువ స్థాయి ఓటర్లలో మాత్రం టీఆర్ఎస్ పట్ల నిబద్దత కనిపించింది. తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ అన్న భావన కూడా కనిపించింది. ఇది కొంత వరకు టీఆర్ఎస్ కు శ్రీరామరక్షగా నిలిచింది.అయితే అందించిన స్కీములను కేసిఆర్ నమ్ముకుంటే, అందని స్కీములను హైలైట్ చేయడంలో కాంగ్రెస్ అండ్ కో విజయం సాధించాయి. 

సరిహద్దు జిల్లాలు, సెటిలర్ల సంఖ్య బాగా వున్న జిల్లాల్లో టీఆర్ఎస్ వ్యతిరేకత ఎక్కువ కనిపించింది. కేవలం వారం రోజుల్లో టీఆర్ఎస్ పై వున్న వ్యతిరేకత శాతం బాగా పెరగడం అన్నది ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి శాపంగా మారినట్లు కనిపిస్తోంది. దీనికి కారణం, మీడియాను ఈసారి కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి సమర్థంగా వాడుకోవడం కూడా కావచ్చు.

మొత్తం మీద చూసుకుంటే ఏ ఒక్కరికీ అందని ఓటరు నాడి ఏదయినా అద్భుతం చేస్తే తప్ప, తెలంగాణ ఏర్పాటైన తరువాత ఏర్పడే రెండో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ ముంగిట్లో రెడీగా వుందని చెప్పక తప్పదు.

Show comments