వినాయక్ కోసం కోన కథ?

వివి వినాయక్ తరువాత సినిమా ఏంటీ? ఇదీ క్వశ్చను. ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత, ఇండస్ట్రీలో సరైన డైరక్టర్ దొరికితే అమాంతం ఎగరేసుకుపోతున్న ఈ రోజుల్లో వినాయక్ ఖాళీగా వుండడం ఆశ్చర్యమే. దీనికి కారణం మరేమీ కాదు. వినాయక్ సమస్య కథే. వినాయక్ లో మంచి దర్శకుడు వున్నాడు కానీ కథకుడు లేడు. ఆయనకు కథ ఎవరైనా తయారుచేసి ఇవ్వాల్సిందే.

ఇప్పడు అదే ప్రయత్నం జరుగుతోంది. ఇద్దరు కథకులు వినాయక్ కోసం కథలు వండుతున్నారు. వాళ్లలో ఒకరు వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివ. మరొకరు అనేక తెలుగు సినిమాలకు హిట్ కథలు ఇచ్చిన కోన వెంకట్. ఈ మధ్య కోన వెంకట్ తెలుగు సినిమాకు కాస్త దూరంగా వున్నారు. నానితో నిను కోరి సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. శ్రీదేవి లేటెస్ట్ సినిమా మామ్ కు కథ అందించారు. ఇప్పుడు ఆయన వినాయక్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వినాయక్ తన తరువాతి సినిమా సాయి ధరమ్ తేజ తో చేస్తారని టాక్. కానీ వినాయక్ సన్నిహితులు మాత్రం ఆయనను కాస్త వెనక్కులాగుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి లాంటి టాప్ హీరోతో, ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమా ఇచ్చిన తరువాత మళ్లీ ఆ రేంజ్ హీరోలు ఎవరితో అయినా చేయాలి కానీ, సాయి ధరమ్ తో ఏమిటి అన్నది వాళ్ల వాదన. కానీ పెద్ద హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. ఎవరి కమిట్ మెంట్ లు వారికి వున్నాయి.

అందుకే వినాయక్ సాయి ధరమ్ తో అడ్జస్ట్ కావాల్సి వస్తోంది. మరి కోన కథ సాయి ధరమ్ కేనా, లేదా ఎన్టీఆర్ లాంటి మరే హీరోతో కాంబినేషన్ కోసమా అన్నది ఇంకా తెలియదు.

Show comments