బెట్టింగ్‌ బురదలో యువతరం!

-ఐపీఎల్‌తో అదుపు తప్పిన వ్యవహారం
-జిల్లా స్థాయి పట్టణాల్లో తీవ్రస్థాయికి చేరిన బెట్టింగ్‌లు
-డిగ్రీ, బీటెక్‌ యువకుల్లో బెట్టింగ్‌ జాడ్యం
-నియంత్రించేవారు ఏరీ?
-రాజకీయం మీదా పందేరం!!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) క్రికెట్‌ ప్రేమికులకు వినోదం మాట ఇవ్వడం మాటేమిటో కానీ బెట్టింగ్‌లు ఆడాలనుకునే వారికి అదో పెద్ద వినోదం అయ్యింది. ఆ వినోదం వ్యసనంగా మారింది. ఆ వ్యసనం ప్రత్యేకించి యువతరాన్ని పట్టుకుంటోంది. ఇటీవలే ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అనేకమంది యువకుల జీవితాలనే ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టేసింది. బెట్టింగ్‌ జాడ్యం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి ఇది చిన్న, మధ్యతరహా పట్టణాలను కూడా పట్టుకుంది. జిల్లాస్థాయి పట్టణాల్లో ఇది ప్రమాదకరమైన స్థాయికి చేరింది. పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో ఈ బెట్టింగ్‌ ఒక మాఫియాగా మారుతూ ఉంది. యువతరాన్ని రొంపిలోకి దింపి, వారిని భ్రష్టుపట్టిస్తూ వారిని ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతోంది బెట్టింగ్‌.

క్రికెట్‌ మజా.. వ్యసనంగా మారిన వైనం!
పన్నెండేళ్ల కిందట మొదలైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొదట్లో వినోదంగానే అనిపించింది. అయితే అతి తక్కువ కాలంలోనే అది బెట్టింగ్‌లకు పని కల్పించింది. ఐపీఎల్‌కు ముందు కూడా క్రికెట్‌ బెట్టింగ్‌ ఉంది. ఆ బెట్టింగ్‌లే ఒకదశలో అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ల వరకూ వెళ్లాయి. అంతర్జాతీయ మాఫియాడాన్‌లే క్రికెట్‌ బెట్టింగుల్లో జోక్యం చేసుకుంటూ.. క్రికెట్‌ ఫలితాలను శాసించే దిశగా వచ్చారు. బెట్టింగులకు అనుగుణంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌లను చేయడం మొదలైంది. బుకీలు రంగంలోకి దిగి.. క్రికెటర్లను సంప్రదించి మ్యాచ్‌లు ఫిక్స్‌ చేసేంత వరకూ వెళ్లారు. ఆ వ్యవహారం అంతా బయటపడి అంతర్జాతీయ క్రికెట్‌ను వణికించింది. భారత క్రికెట్‌ జట్టును కూడా ఫిక్సింగ్‌ వ్యవహారం బాగా దెబ్బతీసింది. దాదాపు ఇరవై సంవత్సరాల కిందట బెట్టింగ్‌ వ్యవహారం సంచలనాలను రేపింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ రూపురేఖలు మారిపోయాయి.

అంతర్జాతీయ మ్యాచ్‌లపై ఐసీసీ ప్రత్యేక నిఘాను ఉంచింది. ఫిక్సింగ్‌ చర్యలు బాగా తగ్గుముఖం పట్టాయి. దుబాయి వేదికగా జరిగిన కొన్ని మ్యాచ్‌లు మాత్రం ఫిక్సింగ్‌ వాసన కొట్టాయి. పలుసార్లు పాకిస్తాన్‌ క్రికెటర్లే అలాంటి వ్యవహారాలతో వెలుగులోకి వచ్చారు. బెట్టింగులు పతాక స్థాయికి చేరినప్పుడే ఫిక్సింగుల వరకూ వెళ్తుంది వ్యవహారం. ఇండియన్‌ టీమ్‌ వరకూ అలాంటి కంపులేదు కొన్ని సంవత్సరాల పాటు. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో మళ్లీ బెట్టింగ్‌ బుసలుకొట్టి ఫిక్సింగ్‌గా మారింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం సంచలనం రేపింది.

స్పాట్‌ ఫిక్సింగ్‌ మూలాలు కూడా బెట్టింగుల వద్దే ఉన్నాయని తేలింది. ఐపీఎల్‌ మొదలైన అతి తక్కువ కాలంలోనే తీవ్రస్థాయికి చేరిన బెట్టింగ్‌లు స్పాట్‌ ఫిక్సింగ్‌కు క్రికెటర్లను పురికొల్పాయి. బెట్టింగ్‌లపై మొదలైన పోలీసుల విచారణ, స్పాట్‌ ఫిక్సింగ్‌ దగ్గర తేలింది. ఆ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో ఐపీఎల్‌ టీమ్‌ల ఓనర్ల పేర్లే బయటకు వచ్చాయి! దీంతో బీసీసీఐ ఇరకాటంలో పడింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో ఓనర్ల ఇన్‌వాల్వ్‌ మెంట్‌ ఉందని తేలడంతో రెండు ప్రాంచైజ్‌లను రెండేళ్లపాటు నిషేధించింది బీసీసీఐ. కొంతమంది క్రికెటర్లపై చర్యలు తీసుకుంది. అంతటితో ఆ వ్యవహారానికి అలా ముగింపును ఇచ్చింది బీసీసీఐ. అయితే బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ ఈ రెండూ తగ్గుముఖం పట్టాయంటే  నమ్మలేని పరిస్థితి. ప్రత్యేకించి బెట్టింగ్‌ తీవ్రస్థాయిలో ఉండటంతో.. అది మ్యాచ్‌లను ప్రభావితం చేసేందుకు అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటుంది. క్రికెట్‌లో ఈ అవినీతి వ్యవహారాన్ని బీసీసీఐ ఎంతవరకూ నియంత్రిస్తోందో అర్థంకాని పరిస్థితి!

సెలబ్రిటీల దగ్గర నుంచి అదే జాడ్యం!
స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై మొదలైన విచారణ అనేకమంది సెలబ్రిటీలకు కూడా బెట్టింగ్‌ అలవాటు ఉందనే విషయాన్ని బయటకు తెచ్చింది. ముంబై కేంద్రంలో బాలీవుడ్‌ ప్రముఖులు క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడినట్టుగా పోలీసులు తేల్చారు. కొంతమంది సెలబ్రిటీలకు బెట్టింగ్‌ వ్యసనంగా మారిందని నిర్ధారించారు. అయితే అలాంటి వారికి ప్రత్యేకంగా శిక్షలు ఏమీలేవు. వారి ఇళ్లలోని వారిని పిలిపించి మాట్లాడారు. వారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. తమవాళ్లకు బెట్టింగ్‌ జాడ్యం తీవ్రస్థాయికి వెళ్లిందని వాపోయారు. అలాంటి బెట్టింగులే స్పాట్‌ ఫిక్సింగ్‌కు కారణం అయ్యాయి. క్రికెటర్లతో బుకీలు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫిక్సింగ్‌ చేశారు. ఆ వ్యవహారం అంతా అప్పటికి ముగిసిందని ప్రకటించింది బీసీసీఐ. అయితే లోగుట్టు ఇప్పుడేమిటో తెలియని పరిస్థితి ఉంది.

మ్యాచ్‌ ఫలితంతో మొదలు.. టాస్‌ వరకూ ప్రతిదాని మీదా!
ఈ వేసవిలో ఐపీఎల్‌ సాగినన్ని రోజులూ.. చిన్న చిన్న పట్టణాల్లో ఎక్కడ చూసినా బెట్టింగ్‌ ముచ్చట్లే. ప్రత్యేకించి టీనేజ్‌ పిల్లల దగ్గర నుంచి షాపుల్లో పనిచేసే కుర్రాళ్ల వరకూ వాళ్ల చర్చంతా బెట్టింగుల మీదే సాగింది. మధ్యాహ్నానికి వారి బెట్టింగులు మొత్తం పడిపోయి  ఉంటాయి. ఆ రోజు మ్యాచ్‌లు ఏవి, ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టులో ఎవరు రాణించే అవకాశం ఉంది, ఎవరి లక్‌ ఎలా ఉందనే.. అంశాల గురించినే వారి చర్చలు. తమ తాహతుకు తగ్గట్టుగా వందల రూపాయలతో మొదలుపెట్టి వేలరూపాయల వరకూ బెట్టింగులు వేస్తూ దాన్నో వినోదంగా మొదలుపెట్టి, వ్యసనంగా మార్చుకున్నారు చాలామంది. మొత్తం స్కోరు ఎంతవరకూ వెళ్తుంది, ఎవరు గెలుస్తారు అనే వాటి మీదతో పాటు ఓవర్‌కు ఎన్ని పరుగులు.. అనే అంశాలపై కూడా అక్కడిక్కడ బెట్టింగులు వేసేసుకునే వారితో మొదలు.. దీన్నంతా ఒక నెట్‌వర్క్‌గా మార్చుకుని, భారీస్థాయిలో బెట్టింగులు సాగించే మాఫియాల వరకూ.. అన్నీ తమ పని తాము చేశాయి!

ఐపీఎల్‌ సాగినంతకాలం ఈ వ్యసనానికి పండగలా ఉండింది. బెట్టింగ్‌ మాఫియాకు యువతరం ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. కుర్రాళ్లకు క్రికెట్‌ అంటే కిక్‌. అందులోనూ ఎవరికివారు తాము క్రికెట్‌ పండితులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ టీమ్‌లో ఎవరు ప్లస్‌ పాయింట్‌, ఎవరు బాగా ఆడగలరు, ఆ క్రికెటర్ల గత చరిత్ర ఏమిటి, వారి ప్రస్తుత ఫామ్‌ ఏమిటి.. ఈ అంశాలన్నీ కలగలుపుతూ మేధావుల్లా మాట్లాడుతూ ఉంటారు కుర్రాళ్లు. వీళ్లలో చాలామంది పట్టణాల్లో ఉంటూ బీటెక్‌, డిగ్రీలు  చదివేవాళ్లే. సమ్మర్‌లలో కూడా అక్కడే మకాంపెట్టి.. ఇతర కుర్రాళ్లతో కలిసి బెట్టింగులు వేయడం వీళ్లలో చాలామందికి అలవాటుగా మారింది!

వ్యసనం ఎలాగైనా ప్రమాదకరమే!
ఈజీ మనీ. మ్యాచ్‌ గెలిస్తే డబ్బులు వచ్చేస్తాయి. పైకి అంతా బాగానే కనిపిస్తుంది. ఒక్కోసారి కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వందల రూపాయలతో మొదలుపెడితే.. డబ్బులు వస్తే అది వేల రూపాయలకు చేరుతుంది. ఒక్కసారి ఆ వ్యసనం పట్టుకుందంటే.. దాన్నుంచి బయటకు రావడం అంత తేలికకాదు. ఇంట్లో అబద్ధాలు చెప్పి డబ్బులు తెచ్చుకోవచ్చు. లేదా దొంగతనం చేయొచ్చు. స్నేహితులు అప్పలిస్తారు. ఇంకా టాలెంటెడ్‌ ఫెలోస్‌ మరెక్కడైనా డబ్బులు తీసుకురాగలరు... అలా చేతిలోకి వచ్చిన డబ్బే వీరి బెట్టింగులకు పెట్టుబడి. వీటితో బాగుపడే వాడు ఎవడూ ఉండడు. నాశనం అయ్యేవాడు తప్ప. జూదానికి ఉన్న గుణం. చాలామంది మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలు ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్న వైనం పట్టణాల్లోకి వెళ్లి తరిచిచూస్తే  అర్థం అవుతుంది. ఇలాంటి బెట్టింగు వ్యవహారాలు చెడినప్పుడు కుర్రాళ్లు పరస్పరం  దాడులు చేసుకోవడం, ఆత్మహత్య యత్నాలు చేయడం.. వంటి వార్తలు కూడా జిల్లా స్పెషల్స్‌లో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ వ్యసనాన్ని అపేదెలా? ఆపేదెవరు?
యువతరంలో ఈ బెట్టింగ్‌ వ్యసనం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. అత్యంత ఆందోళనకరమైన స్థితిలో ఉంది. దీన్ని నియంత్రించడం అంత తేలికకాదు. బెట్టింగ్‌ మాఫియాలను ముందుగా పోలీసులు నియంత్రించాల్సి ఉంది. అయితే వాళ్లకూ అది తేలికకాదు. ముఠాలుగా ఏర్పడిన బెట్టింగ్‌ రౌడీలు.. పోలీసులకు మామూళ్లు ఇచ్చి మేనేజ్‌ చేయడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మాత్రం ఇలాంటి గ్యాంగ్‌లను పోలీసులు పట్టుకుంటున్నారు. ఆ మధ్య ఉత్తరాదని ఒక జిల్లాస్థాయి పట్టణంలో ఒక బెట్టింగ్‌ ముఠా పట్టుబడింది. వారి నెట్‌వర్క్‌ కొన్ని పదుల కోట్ల రూపాయల్లో ఉంది! ఆ బెట్టింగ్‌ ముఠా సభ్యులు చూడటానికి అనామకుల్లా ఉంటారు. వారే కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్‌లను నిర్వహించినట్టుగా పోలీసులు తేల్చారు! ఒక చిన్న పట్టణంలోనే ఆ స్థాయి బెట్టింగులు జరిగాయంటే... ఐపీఎల్‌ సీజన్లో దేశమంతా జరుగుతున్న బెట్టింగులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహిస్తే.. అదొక రాష్ట్ర బడ్జెట్‌ స్థాయిలో ఉంటుందేమో!

తల్లిదండ్రుల పర్యవేక్షణే ముఖ్యం!
బెట్టింగులను నియంత్రించడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటే వారిని శంకించనక్కర్లేదు. అయితే ఈ వ్యవహారంలో తల్లిదండ్రుల పర్యవేక్షణే అత్యంత ముఖ్యం. తమ కొడుకు ఏం చేస్తున్నాడు? టీనేజ్లోకి వచ్చినవాడు ఎవరితో తిరుగుతున్నాడు. వాడి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? అనే అంశాల గురించి తల్లిండ్రులు సమీక్షించుకోవాల్సిన రోజులు ఇవి. ఐపీఎల్‌ అంటే ఆసక్తి ఉండొచ్చు. మ్యాచ్‌లను చూడవచ్చు. అయితే  అంతకుమించి లోతుల్లోకి వెళ్తున్నారా? బెట్టింగ్‌ బారినపడుతూ ఉన్నారా? అతడి స్నేహితుల తీరేమిటి? అనేఅంశాల గురించి తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎప్పుడైతే పర్యవేక్షణ లోపం వచ్చిందో అప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి తల్లిదండ్రులు పల్లెల్లో ఉండి, పిల్లలను టౌన్లలో రూముల్లో, హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తూ ఉన్నప్పుడు వారికి ఇలాంటి జాడ్యాలు పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా టీనేజ్‌ పిల్లలు ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవడం తల్లిదండ్రుల బాధ్యతే. ఈ విషయంలో వారు ఎవరిని నిందించీ ప్రయోజనం లేదు!

బెట్టింగుకు ధోనీ, కొహ్లీలే ప్రమోటర్లా?
కొన్ని దేశాల్లో బెట్టింగ్‌ చట్టబద్ధం. ఆన్‌లైన్‌ వేదికగానే ఆ బెట్టింగ్‌ సాగుతూ ఉంటుంది. అలాంటి చట్టబద్ధమైన పనులను ఆ దేశాలు నియంత్రించుకోగలవు. అయితే మనదేశంలో నిషేధం. ఏదైనా నిషేధంలో ఉంటుందో దానికే క్రేజ్‌ ఎక్కువ. మనదేశంలో ఏదైతే నిషేధమో అదే ఎక్కువమందికి చేరుతూ ఉంటుంది. బెట్టింగ్‌ తంతు కూడా ఇదే తరహాలో కనిపిస్తూ ఉంది. నిషేధం అనేది పేరుకు మాత్రమే. ప్రతి ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగినప్పుడూ కొన్ని వందల కోట్ల రూపాయల బెట్టింగ్‌ మొత్తాలు చేతులు మారుతూ ఉన్నాయని స్పష్టం అవుతోంది.

ఈ బెట్టింగ్‌ వ్యవహారం ఆఫ్‌లైన్‌, బెట్టింగ్‌ మాఫియాల ద్వారానే కాదు.. ఒకరకంగా ఆన్‌లైన్లో కూడా సాగుతూ ఉంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ తరహా వ్యవహారానికి మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కొహ్లీ వంటి స్టార్‌ క్రికెటర్లే ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదెలాగంటే.. ఫాంటసీ లీగ్‌, డీమ్‌ ఎలెవన్‌.. వంటి మొబైల్‌ యాప్స్‌తో ఒకరకంగా వారు బెట్టింగును ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ మొబైల్‌ యాప్స్‌కు ధోనీ, కొహ్లీలు ప్రమోటర్లు. ఐపీఎల్‌ సమయాల్లో అందుకు సంబంధించి యాడ్స్‌ కూడా వస్తూ ఉంటాయి.

ఇంతకీ ఏమిటా యాప్స్‌ అని ఆరాతీస్తే.. అదంతా ఒకరకమైన బెట్టింగ్‌ వ్యవహారం. ఆ యాప్స్‌లో ఏ రోజుకారోజు మ్యాచ్‌ల అప్‌డేట్స్‌ ఉంటాయి. వాటిల్లో మీరు ఒక జట్టును సెలెక్ట్‌ చేసుకోవచ్చు. రెండు టీమ్స్‌కు సంబంధించిన సభ్యుల్లో పదకొండు మందిని ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న పదకొండు మంది మీద కొంత సొమ్మును మీరు కట్టాలి. వారిలో ఎవరైనా రాణిస్తే.. మీకు డబ్బులు వస్తాయి. మీరు ఎంచుకున్న ప్లేయర్లు సరిగా ఆడకపోతే మీ డబ్బులు పోతాయి. ఇలాంటి అప్లికేషన్స్‌ ముందుగా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యువతరానికి పరిచయం అవుతున్నాయి. పదిరూపాయలు, వంద రూపాయల స్థాయితో మొదలు.. వేలరూపాయల వరకూ వీటిల్లో డబ్బులు పెట్టుకోవచ్చు.

గెలుపు-ఓటముల మీద కాకుండా.. ఆటగాళ్ల మీద బెట్టింగ్‌ వ్యవహారాలు ఇవి. ఆటాళ్లు రాణిస్తే డబ్బులు, లేకపోతే ఆ డబ్బులు పోతాయి. ఇలాంటి వాటికి మొబైల్స్‌ చాలు. ముందుగా వీటి పట్ల యువత ఆకర్షితం అవుతోంది. ఆ తర్వాత మెల్లమెల్లగా బెట్టింగులకు ఇలాంటి అప్లికేషన్లే మార్గాలుగా నిలుస్తూ ఉన్నాయి. డబ్బును కట్టి ఆడే జూదంలాంటి ఈ అప్లికేషన్లకు భారత ప్రభుత్వం ఎలా అనుమతిని ఇచ్చిందో, స్టార్‌ క్రికెటర్లు వీటికి ఎలా బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఇదో ఆన్‌లైన్‌ జూదంగా మారింది. యువతను చాలా తేలికగా ఇది బానిసగా మార్చుకుంటూ ఉంది. ఇలాంటి వాటిని తక్షణం నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.

ఐపీఎల్‌ అయిపోయింది, ఇక వరల్డ్‌ కప్‌, రాజకీయాల మీద!
యథారీతిన ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ బెట్టింగులు భారీగా సాగియి. ప్రతిరోజూ మ్యాచ్‌లే. ప్రతి మ్యాచ్యూ క్రేజీనే. దీంతో బెట్టింగులు కాశారు. చాలామంది చేతులు కాల్చుకున్నారు. ఐపీఎల్‌ అయిపోవడంతో వీరి వ్యసనానికి ఇబ్బంది ఏమీలేదు. త్వరలోనే మళ్లీ మ్యాచ్‌ లున్నాయి. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ రాయుళ్ల చూపు వాటి మీద ఉంది.

వాటికన్నా ముందు ఎన్నికల మీద భారీగా బెట్టింగులు సాగాయని వేరే చెప్పనక్కర్లేదు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వందల కోట్లరూపాయల బెట్టింగులు పడ్డాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి అనే పాయింట్లతో మొదలుకుని.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అనే అంశం మీద భారీగా బెట్టింగులు సాగాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల మీద బెట్టింగులు భారీ నుంచి అతి భారీస్థాయిలో ఉన్నాయి. ఎవరికి వారు  రాజకీయ పండిట్లుగా, ఎవరికివారు రాజకీయం గురించి అవపోసన పట్టిన వారుగా.. భారీగా బెట్టింగులు కాశారు.

మే 23న విడుదల అయ్యే ఎన్నికల ఫలితాలతో ఇలాంటి బెట్టింగ్‌ ముఠాల్లో సభ్యులైన వారి జాతకాలు మారిపోనున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల ఫలితాల గురించి రాజకీయ నేతల కన్నా బెట్టింగులు కాసినవారే చాలా ఎగ్జియిట్‌ మెంట్‌తో ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు అనే అంశం గురించి పోటీచేసిన నేతల కన్నా.. బెట్టింగులు వేసిన వారికే ఎక్కువ టెన్షన్‌ ఉంది. ఫలితాలు వచ్చిన రోజునే ఇలాంటి వారికి లాభనష్టాల బేరీజులన్నీ తేలిపోనున్నాయి. ఇలా క్రికెట్‌, రాజకీయం... వంటి అంశాలతో బెట్టింగ్‌ వ్యసనం పతాక స్థాయికి చేరింది. నియంత్రించలేని స్థాయిలో ఉంది.

తెలుగు హీరోల మంచితనం.. సినిమాల వరకేనా!

 

Show comments