బాల‌కృష్ణ అప్పుడ‌లా...ఇప్పుడిలా!

దిశ నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంపై సామాన్యులు మొద‌లుకుని సెల‌బ్రటీల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌త‌మ స్థాయిలో ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ స్పందిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సినీన‌టుల స్పంద‌న‌పై అంద‌రి దృష్టి ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా త‌న‌దైన శైలిలో ఎన్‌కౌంట‌ర్‌పై మాట్లాడారు.

నందమూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా ప్రారంభ వేడుక‌ల్లో  బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఎన్‌కౌంట‌ర్‌పై స్పందించడం అభినంద‌నీయం.

అయితే మూడేళ్ల క్రితం నారా రోహిత్ న‌టించిన  'సావిత్రి' చిత్రం ఆడియో వేడుకలో బాలయ్య మ‌హిళ‌ల‌పై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడిన బాల‌కృష్ణ కూడా ఎన్‌కౌంట‌ర్‌పై స్పందించ‌డ‌మా అని నిట్టూర్చుతున్నారు.

'అందరూ అన్ని రకాల పాత్రలు చేయలేరు. నేను కొన్ని పాత్రలు మాత్రమే చేయగలను. అమ్మాయిల వెంట పడే పాత్రలు చేస్తే మా ఫ్యాన్స్ ఊరుకోరు. అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి... కడుపైనా చేయాలి, కమిట్ కమిట్ అంటూ వెళ్లి పోవాలి' అంటూ   బాలయ్య మ‌హిళ‌ల‌ను చాలా అవ‌మాన‌క‌ర రీతిలో మాట్లాడారు.

బాల‌య్య మాట‌ల‌పై నాటి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీలో మాట్లాడుతూ 'ఒక ప్రోగ్రామ్‌లో బాల‌కృష్ణ అమ్మాయిల గురించి చాలా లోకువ‌గా మాట్లాడాడు. బాల‌కృష్ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై జాతీయ మీడియాలో కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. అలాంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే హౌస్‌లో ఉన్నారు'   అని అన్నారు.

జ‌గ‌న్ మాట‌ల‌పై బాల‌కృష్ణ అసెంబ్లీలో స్పందిస్తూ 'త‌న మాట‌ల‌ను త‌ప్పుగా తీసుకున్నార‌ని, అంద‌రూ ఎంజాయ్ చేశార‌ని' వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి... కడుపైనా చేయాలని అవ‌హేళ‌న చేసిన బాల‌కృష్ణ దిశ నిందితుల‌ ఎన్‌కౌంట‌ర్‌పై స్పందిస్తూ పోలీసుల‌కు, తెలంగాణ ప్ర‌భుత్వానికి అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాదు దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితుల‌ను శిక్షించాడ‌ని పేర్కొన్నారు.  దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందని బాలకృష్ణ అన్నారు.

మూడేళ్ల క్రితం అమ్మాయిల‌పై బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌ల‌ను, ఇప్పుడు ఎన్‌కౌంట‌ర్‌పై చెప్పిన అభిప్రాయాల‌ను పోల్చుకుంటూ...ఆయ‌న‌లో ఎంత‌లో ఎంత మార్పు అని అంటున్నారు. 

Show comments