ఎన్టీఆర్ తో ఒకటి.. విజయ్ దేవరకొండతో రెండు

మహానటితో మళ్లీ ఊపందుకున్న వైజయంతీ మూవీస్ బ్యానర్ పై త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు నిర్మాత అశ్వనీదత్. ఈ మూవీతో పాటు విజయ్ దేవరకొండతో కూడా రెండు సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు

"ఎన్టీఆర్ తో చాలా రోజులుగా ఓ సినిమా అనుకుంటున్నాం. కుదరడంలేదు. రాజమౌళి సినిమా నుంచి తారక్ ఎప్పుడు బయటకొస్తాడో తెలీదు. ఆ తర్వాత చూడాలి. ఇక విజయ్ దేవరకొండతో 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. అవి త్వరలోనే స్టార్ట్ అవుతాయి."

ప్రస్తుతం నాగార్జున, నాని హీరోలుగా దేవదాస్ సినిమా చేస్తున్న అశ్వనీదత్, ఆ మూవీ విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆడియో రిలీజ్, మూవీ విడుదల తేదీల్ని షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వనీదత్, నాగార్జునను సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చారు

"ఒకప్పుడు నేను చూసిన నాగార్జున వేరు. ఇప్పటి నాగార్జున వేరు. ఒకప్పుడు పొద్దున్న షూటింగ్ కు వచ్చేవారు డైరక్టర్ చెప్పింది చెప్పినట్టు చేసేవారు.. సాయంత్రం 5కి అన్నీ పూర్తిచేసుకొని నీట్ గా పెళ్లికొడుకులా ఇంటికెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు ఆయన మారిపోయారు. స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ లో నేను చూసిన నిబద్ధత ఇప్పుడు నాగార్జునలో చూస్తున్నాను."

అటు ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న మరో సూపర్ హిట్ ప్రాజెక్టుపై కూడా స్పందించారు అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ వందేళ్లు నిలబడుతుందని, తన జమానాలో ఏదో ఒక టైమ్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ చేస్తానని ప్రకటించారు.

"నేను తీసిన సినిమాలను మళ్లీ టచ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి మాత్రం దీనికి మినహాయింపు. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఎప్పటికైనా ఆ సీక్వెల్ మాత్రం చేస్తాను. ఈ విషయంలో నాకు హెల్ప్ చేయడానికి నాగి (నాగ్ అశ్విన్) ఎలాగూ ఉన్నాడు కదా."

దేవదాస్ సినిమాలో భారీతనం కనిపించకపోయినా, కామెడీ కచ్చితంగా కనిపిస్తుందని, తమ టార్గెట్ కూడా అదేనని స్పష్టంచేశారు అశ్వనీదత్. ఈనెల 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది దేవదాస్.

Show comments