'అమ్మ ఒడి..' టీడీపీకి పెద్ద షాకే తగిలింది

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 'అమ్మ ఒడి' పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం విదితమే. తొలుత ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి.? దీనికి విధి విధానాలు ఎలా వుంటే బావుంటుంది.? అన్నదానిపై చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌ కన్పించింది. నిజానికి, అది మీడియాలో క్రియేట్‌ అయిన కన్‌ఫ్యూజన్‌ మాత్రమే. ఎందుకంటే, అది వైఎస్‌ జగన్‌ మెదడులో మెదిలిన గొప్ప ఆలోచన. అలా ఆలోచన మెదలినప్పుడే దానికి సంబంధించి పూర్తి అంశాల గురించి ఆయన ఆరా తీశారు. 

కన్‌ఫ్యూజన్‌ లేకుండా, తక్కువ టైమ్‌లోనే అమ్మ ఒడి పథకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళు అన్న తేడా లేకుండా, పేదరికం ప్రాతిపదికగా.. పిల్లల్ని స్కూలుకు పంపే ప్రతి తల్లి అకౌంట్‌లోకీ ఏడాదికి 15 వేల రూపాయలు జమ చేయడమే ఈ అమ్మ ఒడి పథకం తాలూకు ఉద్దేశ్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల్ని చదివించలేక, వారిని రకరకాల పనుల్లో పెట్టి, తద్వారా వచ్చే డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నవారికి ఈ పథకం పెద్ద వరం కాబోతోంది. అదే సమయంలో, ప్రైవేటు స్కూళ్ళలో తమ పిల్లల్ని చదివించే కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరట. నిరక్షరాస్యతను తగ్గించడం కూడా అమ్మ పథకం తాలూకు ఉద్దేశ్యమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 

అయితే, 'అమ్మ ఒడి' పథకం విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తడబడుతోందనీ, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటిదాకా భావిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఈ పథకం గురించి స్పష్టత ఇచ్చిందో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు కూడా షాక్‌కి గురయ్యాయి. 
'వైఎస్‌ జగన్‌ అత్యంత సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు..' అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానించడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.  

Readmore!
Show comments