అమరావతి అని మీరు చెప్పారా? బాబూ?

నన్ను లేవనివ్వొద్దు...నేను లేస్తే మనిషిని కాదు. కావాలంటే ట్రయ్ చేయ్...అన్నాడట వెనకటికి చెట్టుకింద బాసింపట్టు వేసుకుని, దానిపై టవల్ కప్పుకుని కూర్చున్న ఓ రౌడీ బాబు. జనం అంతా భయపడేవారట. ఆఖరికి ఒకడు ధైర్యం చేసి, లే చూద్దాం అన్నాడట. తీరా చేస్తే ఆ రౌడీ బాబు రిటైర్డ్ హర్ట్. రెండు కాళ్లూ దెబ్బతినేసాయి. ఆంధ్ర మాజీ సిఎమ్ చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇలాగే వుంది. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి అని హూంకరిస్తున్నారు. అంతే కాదు, 48 గంటల అల్టిమేటమ్ జారీ చేసారు. దీనికి కారణం కూడా చెప్పారు. ఎన్నికల ముందు రాజధాని మారుస్తారని మీరు చెప్పలేదు. అందువల్ల జనానికి తెలియక ఓట్లు వేసారు. సో, ఇప్పుడు మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగండి అంటున్నారు.

ఇక్కడ చాలా పాయింట్లు వున్నాయి.

ఒకటి...ఎన్నికల ముందు చంద్రబాబు కూడా చెప్పలేదు. తనకు అధికారం ఇస్తే, కనిపించినవి కనిపించినట్లు అన్నీ కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీసుకెళ్లిపోతానని. కర్నూలులో ఏర్పాట్లు చేయాల్సిన ఎయిమ్స్ ను మంగళగిరి కి తీసుకుపోతానని. పైగా ప్రభుత్వ భూములు అపారంగా వున్న ప్రకాశం జిల్లా, దోనకొండ ప్రాంతాన్ని కాదని, ప్రయివేటు భూములు సేకరించి మరీ అమరావతికి వెళ్లారు. దోనకొండ ప్రాంతంలో జగన్ కు భూములు వున్నాయని, అందుకే అక్కడకు వెళ్లడం లేదని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి అప్పటి ఎన్నికల ముందు చెప్పకుండా బాబు తన చిత్తానికి తాను చేసినపుడు, ఇప్పుడు జగన్ చేయడంలో తప్పేముంది?

రెండవది...సరే, జగన్ చెప్పకుండా చేస్తున్నారు. అందువల్ల ఫ్రెష్ గా జనాభిప్రాయం తీసుకోవాలి అన్నది బాబుగారి డిమాండ్. సరే, తన చేతిలో వున్న 23 మంది చేత రాజీనామా చేయించవచ్చుకదా? అది తన చేతిలో వున్న పనే కదా? పైగా ఆ 23 మంది రాష్ట్రం నలుమూలల నుంచి వున్నారు. అందువల్ల ఇదే రెఫరెండం అనుకోవచ్చు. ఇదే ప్రజాభీష్టం అనుకోవచ్చు. 23 మందిని గెలిపించేసుకోగల ధీమా బాబుగారికి వుంది కదా? అలా వుంది కనుకే కదా, మళ్లీ కొత్తగా ఎన్నికలు కావాలని కోరుతున్నారు. 

చంద్రబాబు అధికారానికి దూరంగా అస్సలు వుండలేరు. అందుకే మళ్లీ ఎన్నికలు అని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడయినా, ఏ పాలకపక్షం అయినా ఇలాంటి డిమాండ్ కు తలవొగ్గిన దాఖలా వుందా? చంద్రబాబే అధికారంలో వుంటే, జగన్ ఇలాంటి డిమాండ్ చేస్తే ఓకె అంటారా? ఆయన చేయాల్సిన లోకల్ బాడీ ఎన్నికలే చేయకుండా అయిదేళ్లు కాలక్షేపం చేసేసారు. అలాంటిది మిడ్ టెర్మ్ పోల్ కు వెళ్తారా?

ఆయన వెళ్లరు కానీ, అవతలివారిపై హుంకరిస్తారు. అల్టిమేటమ్ ఇస్తారు. డిమాండ్ చేస్తారు. ఇదంతా చూస్తుంటే చెట్టుకింద కూర్చుని, లేస్తే మనిషిని కాదు అన్న రౌడీ బాబే గుర్తుకువస్తున్నాడు కదా?

జగన్ కి రాఖీలు కట్టిన మహిళా ఎమ్మెల్యేలు

ఏరు దాటాకా తెప్ప తగలేసిన బాబు

Show comments