‘ప్రాణం పోయినా.. టీడీపీని వీడే ప్రసక్తిలేదు..' అని అంటోంది మంత్రి అఖిలప్రియ. ఈ మంత్రిగారు.. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారని, ఇక చేరడానికి మిగిలిన జనసేన పార్టీలోకి చేరతారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పరిణామాలు ఈ అభిప్రాయాలకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియ స్పందించింది. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
తనకు చంద్రబాబు నాయుడు ఎంతో చేశారని.. మంత్రిపదవి ఇచ్చారని.. అలాంటి టీడీపీని ఎందుకు వదులుతాం అన్నట్టుగా అఖిలప్రియ ప్రశ్నించింది. అయితే ఇప్పటికే ఫిరాయింపు మంత్రిగా ఉన్న అఖిలప్రియ ఇలా మాట్లాడితే.. కామెడీగానే ఉంటుంది.
ఎమ్మెల్యే పదవినేమో జగన్ పార్టీ ద్వారా తెచ్చుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యేగా భూమా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిలప్రియ తెలుగుదేశంలో చేరారు. వీరు వైసీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు.
భూమా నాగిరెడ్డి అంటే మరణించారు. అఖిల ఫిరాయించినందుకు గానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు! ఇలాంటి నేఫథ్యం కలిగిన ఈమె.. తను ఇంకెందుకు పార్టీ మారతాను? అనడం కామెడీనే. ఆల్రెడీ ఫిరాయించిన వారిపై మళ్లీ అనుమానాలు రావడం కూడా సహజమే.
ఇక హోంమంత్రి చిన్న రాజప్పకు అవగాహన లేదు అంటూ అఖిలప్రియ మండిపడింది. తమ జిల్లా పరిస్థితుల గురించి ఆయనకు అవగాహన లేదని అఖిల విమర్శించింది. ఇటీవల అఖిలప్రియ అనుచరుల ఇళ్లపై పోలీసుల సోదాల నేపథ్యంలో ఈమె ఆగ్రహావేశాలు కొనసాగుతూ ఉన్నాయి.
అందులో భాగంగా హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఏమీ తెలియదని.. అవగాహన లేదని వ్యాఖ్యానించింది.