బాబుకు ఆల్జీమర్స్ వచ్చినట్టుందిః ఆమంచి

తెలుగుదేశం పార్టీలో తనకు ఏదో ప్రత్యర్థులు తయారు అయ్యారని తను ఆ పార్టీకి రాజీనామా చేయలేదని అన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఈయన మాట్లాడారు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు తీరుతోనే విసిగిపోయినట్టుగా ఆమంచి వివరించారు.

చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడిందని.. ఆయనకు ఆల్జిమర్స్ సోకినట్టుగా ఉందని ఈ ఎమ్మెల్యే అన్నారు. బాబు ఒకరోజు మాట్లాడినట్టుగా మరోరోజు మాట్లాడటం లేదని.. ఈరోజు మాట్లాడింది ఆ రోజుకే అన్నట్టుగా తయారైందని ఆమంచి అన్నారు. హోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో, ఎలా యూటర్న్ తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే అని అన్నారు.

ఇక డ్వాక్రా మహిళలకు ఇప్పుడు పుసుపు- కుంకుమ అంటూ మరో మోసం చేస్తున్నారని.. వాస్తవానికి వారికి వడ్డీ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉందని.. ఆ డబ్బు బకాయిలు ఆరువేల ఐదువందల కోట్లరూపాయల వరకూ ఉన్నాయన్నారు. వాటిని పక్కనపెట్టి.. ఇప్పుడు ఓటుకు రెండు వేల రూపాయలు అన్నట్టుగా డ్వాక్రా మహిళలకు ఇస్తూ అనైతిక రాజకీయం చేస్తున్నారని ఆమంచి అన్నారు.

బాబుతో మాట్లాడితే పిచ్చి ఎక్కిపోయే పరిస్థితి ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే విషయంలో తన గురువు రోశయ్య ఆశీస్సులు తనకు ఉన్నాయని ఆమంచి అన్నారు. రాష్ట్రంలో ఒక కులం గుత్తాధిపత్యం కోసం పాకులాడుతోందని.. చంద్రబాబు నాయుడును వారే ఆడిస్తున్నారని.. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు చదివితే, కొన్ని చానళ్లు చూస్తే వాస్తవాలు తెలిసే పరిస్థితి లేదని.. చంద్రబాబు పాలనను వాటి ద్వారా చూస్తే కలిగేది భ్రమలే అని ఆమంచి అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పలుసార్లు మాట్లాడినట్టుగా చెప్పిన ఆమంచి.. అయితే ఆ పార్టీలో చేరే ఉద్దేశం కలగలేదని అన్నారు. మంచిరోజు చూసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా ఆమంచి ప్రకటించారు.

పచ్చ కోటలు బీటలు వారుతున్నాయా..?!

Show comments