ఎమ్బీయస్‌ : 2017పై నోట్ల రద్దు ప్రభావం

2016కంటె 2017లో దేశ ఆర్థికపరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. ధరలు పెరిగాయి. నిరుద్యోగం పెరిగింది. ఉత్పత్తి రంగం, చిన్న వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు బాగా దెబ్బతిన్నారు. దీనికి కారణాలుగా నోట్లరద్దు, జిఎస్‌టి అని చెప్పడానికి సందేహం అక్కరలేదు. వాటి వలన చాలా మేలు జరిగిందని పాలకపక్షం చెప్పుకోవచ్చు. నోట్లరద్దు ప్రకటించిన నవంబరు 8ని 'కాలా ధన్‌ విరోధ్‌ దివస్‌' పండగగా జరపవచ్చు. కానీ వారు అనుకున్నది లేదా బయటకు చెప్పినది ఒకటి, జరిగినది మరొకటి. సరైన ఏర్పాట్లు చేయకుండా తలపెట్టిన దుస్సాహసమది అని గ్రహించకుండా జిఎస్‌టి రూపంలో మరో భారీ ప్రయోగం చేశారు.

గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా వాటిపట్ల ప్రజావ్యతిరేకత తెలియవచ్చింది కాబోలు, జిఎస్‌టిలో సంస్కరణలు చేపట్టారు. ఇవి ఎంతకాలం సాగుతాయో ఎవరికీ తెలియదు. వీటివలన ప్రజలకు నష్టం వాటిల్లి వుంటే దేశంలో తిరుగుబాటు రాలేదెందుకు? అని కొందరు ప్రశ్నిస్తారు. ఇంగ్లీషు వాళ్లు పాలించిన శతాబ్దం తర్వాత కానీ తిరుగుబాటు ఊపందుకోలేదు. అందుచేత ఇంగ్లీషువాళ్లు అన్నాళ్లూ అద్భుతంగా పాలించేశారని అనగలమా? అలాగే యూపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడమే నోట్లరద్దుకు ఆమోదమనుకుంటే 2009లో యూపీఏ గతంలో కంటె ఎక్కువ సీట్లు తెచ్చుకుంది కాబట్టి 2004-2009 మధ్య కాంగ్రెసుది నికార్సయిన పాలన అనాలి. జిఎస్‌టి సంస్కరణలకు గురవుతోంది కాబట్టి దాని చరిత్ర నడుస్తోందనే అనాలి. నోట్ల రద్దయితే ముగిసిన అధ్యాయం. 50రోజుల గడువు ముగియగానే 2017 వచ్చింది. 2017 ముగుస్తోంది కాబట్టి నోట్లరద్దు లక్ష్యాలేమిటి, ఏ మేరకు అవి నెరవేరాయి అని గణాంకాలు చూస్తే ఇది మోదీ దుస్సాహసం తప్ప వేరొకటి కాదని తేలుతుంది.

ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నారా? - ఆపరేషన్‌ను పేషంటు బీపీ, సుగర్‌ చెక్‌ చేసి ఆరంభిస్తారు. మొదలుపెట్టేశాక రక్తపరీక్షలు చేయరు. పందికొక్కును తరిమాలంటే ఇంటికున్న అన్ని కన్నాలూ మూసేసి, ఒక్క తలుపు మాత్రం తెరిచి, వేటాడతారు. వెతకడం మొదలుపెట్టాక కన్నాలు మూయాలని చూడరు. ఊర్జిత్‌ పటేల్‌కు సాధకబాధకాలు తెలిసినా 'నోట్ల రద్దును ఈ దశలో హ్యేండిల్‌ చేయలేము, ఇదీ యథార్థ పరిస్థితి' అని మోదీకి చెప్పివుండకపోతే అలాంటివాణ్ని నియమించి వాళ్లు లెంపలేసుకోవాలి. రిజర్వ్‌ బ్యాంకు ఏ విధంగా సన్నిద్ధంగా లేదో చూదాం.

2014 మే 23 నాటికి అంటే ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చేనాటికి రూ.13.70 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో (క్యాష్‌ ఇన్‌ సర్క్యులేషన్‌) ఉన్నాయి. నోట్లరద్దు చేసేనాటికి దాని విలువ 31% పెరిగి 17.97 లక్షల కోట్లయింది. రద్దు ముందే ప్లాన్‌ చేసి ఉంటే ఆర్‌బీఐ ఇలా పెరగనిచ్చేదా? ఈ నోట్లలో 500, 1000 నోట్ల విలువ 15.44 లక్షల కోట్లు. ఇవికాక 5లక్షల కోట్ల విలువైన 500, 1000 నోట్లు ఆర్‌బీఐ వద్ద ఉన్నాయి. త్వరలో రద్దు చేయబోయే నోట్లను ఆర్‌బీఐ ఎందుకు ముద్రించి ఉంటుంది? వాటికి బదులు 100రూ.ల నోట్లనే ముద్రించి పెట్టుకునేది కదా!

కొత్తనోట్లు రెడీగా ఉన్నాయా? - 500, 1000 రద్దుచేసి వాటి స్థానంలో 2000 రూ.ల నోట్లు తెద్దామని ఆర్‌బీఐ అనుకున్నపుడు ఆ మేరకు అంత విలువున్న 2వేల నోట్లు తన దగ్గర పెట్టుకోవాలి కదా! రద్దు చేసిన వాటి విలువ 15.44 లక్షల కోట్లయితే, నవంబరు 8కి వాళ్ల వద్ద ఉన్న 2వేల నోట్ల విలువ 4.9 లక్షల కోట్లు మాత్రమే. (10.5 లక్షల కోట్ల విలువున్న నోట్ల కొరత) రద్దు చేసిన నోట్లలో 65% బ్యాంకుల్లోకి తిరిగి రావని, మూడోవంతు విలువున్న నోట్లు ముద్రిస్తేచాలని ఆర్‌బీఐ ఆశపడిందా? (అలా అయితే ఆ లెక్క దారుణంగా చీదేసింది.

99% నోట్లు వెనక్కి వచ్చేశాయి) ఒకవేళ అలా జరక్కపోతే ఎలా అని ప్లాన్‌ బి సిద్ధంగా పెట్టుకుందా? దేశంలో ఉన్న నాలుగు ప్రెస్సులూ డబుల్‌ షిఫ్ట్‌ పనిచేసినా రోజుకి ఆరున్నర కోట్ల నోట్ల కంటె ఎక్కువ ముద్రించలేవు. ఇది కాస్త ఆలస్యంగా అర్థమై 50రోజులు టైమివ్వండి అని మోదీ అడిగారు. 50కాదు, 57రోజుల తర్వాత జనవరి 6న చూస్తే ఆర్‌బీఐ ప్రింటుచేసి పంపిణీ చేయగలిగినది 1.5 లక్షల కోట్లు మాత్రమే. అంటే రద్దు చేసిన నోట్ల విలువలో 42% మాత్రమే ఆర్‌బీఐ చలామణీలోకి తేగలిగింది. అందుకే నోట్ల కొరత ఏర్పడి అవస్థలు పడ్డాం. ఇక 500 రూ.ల నోటైతే ప్రకటన చేసిన 15రోజుల తర్వాత నవంబరు 23 నుంచే ముద్రణ ప్రారంభించారు!

పంపిణీ ఎలా చేద్దామనుకున్నారు? - నోట్లు ముద్రించగానే సరికాదు, జనంలోకి పంపిణీ చేయాలి. బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారానే పంపిణీ జరగాలి. భారత జనాభాలో 69% మంది గ్రామాల్లో ఉండగా, మొత్తం బ్యాంకు బ్రాంచీలలో 35% మాత్రమే అక్కడున్నాయి. క్యాష్‌ వాడకం అక్కడే ఎక్కువ. 12 గ్రామాలకు ఒకే బ్యాంకుంది కాబట్టి ఆ గ్రామాల ప్రజలు నగదు కోసం ఒకే బ్యాంకు మీద ఎగబడ్డారు. ఇక ఏటీఎంల సంగతికి వస్తే మొత్తం 18% మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ లభ్యత ఇవన్నీ లెక్క వేసుకుంటే ఏటీఎంల వద్ద కొల్లేటి చాంతాడంత క్యూలు ఎందుకు ఏర్పడ్డాయో, అలాంటి క్యూలలో 100 మంది వరకు ఎందుకు చనిపోయారో అర్థమవుతుంది.

రద్దు చేసిన నోట్ల సైజులోనే కొత్తవి తయారు చేయించి ఉంటే ఫరవాలేక పోయేది. సైజు మారడంతో ఏటీఎం ట్రేలు మార్చవలసి వచ్చింది. అది జరగడానికి టైము పడుతుంది. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలా ఉన్నాయని నిర్వహణాసామర్థ్యానికి పేరుబడిన భారత రిజర్వ్‌ బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియదా? నోట్లరద్దు వంటి భారీ కార్యక్రమం సవ్యంగా సాగదని ఊహించలేదా? ఊహించినా ప్రధానికి చెప్పడానికి భయపడ్డారా? ఏటీఎం సంక్షోభం తలెత్తాక నవంబరు 14న అంటే ప్రకటనకు 6రోజుల తర్వాత టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు. వాళ్లు అప్పటికప్పుడు ఏటీఎంలు సృష్టించలేరు. కొత్త నోట్లకు అనుగుణంగా ట్రేలు మార్చనూలేరు. బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలివ్వాలన్న దానిపై కూడా కసరత్తు జరగలేదు. అందుకే 50రోజుల్లో 66 నోటిఫికేషన్లు, ప్రకటనలు వెలువడ్డాయి. ఇంత గందరగోళంగా ఏ ప్రభుత్వ కార్యక్రమమూ సాగలేదు.

బ్లాక్‌ మనీ అరికట్టారా? - నవంబరు 8నాటి ప్రకటనలో మోదీ ప్రకటించిన మూడు లక్ష్యాలలో నల్లధనం అరికట్టడం మొదటిది - ఈ ఏడాది నవంబరు 8ని కూడా బీజేపీ వారు నల్లధనం వ్యతిరేక దినంగా నిర్వహించారు. నల్లధనం నగదు రూపంలో మాత్రమే ఉందని అనుకోవడం అవివేకం, స్విస్‌ బ్యాంకుల్లో లక్షల కోట్ల బ్లాక్‌ మనీ ఉంటుందని అందరికీ తెలుసు. అక్కడకు నగదు రూపంలో వెళుతోందా? అని ఆర్థికవేత్తలు ప్రశ్నించారు. కరక్టే కదా. నల్లధనం ఉన్నవాళ్లు బంగారం, వజ్రాలు, ఆభరణాలు కొంటారు, షేర్లు కొంటారు, బినామీల పేర్లతో ఆస్తులు కొంటారు, భూములు, ఇళ్లు కొని కొన్న ధర కంటె తక్కువ విలువ చూపిస్తారు.

షెల్‌ కంపెనీలు పెట్టి, డబ్బును అటూయిటూ తిప్పుతారు. ఇవి అందరికీ తెలుసు. ఈ మార్గాలను మూసివేయకుండా కేవలం నగదుపైనే విరుచుకుపడితే విజయం ఎలా సాధిస్తారు? నిజానికి క్యాష్‌ రూపంలో ఉన్న బ్లాక్‌ మనీ 6% మాత్రమే! ఇది ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు జరిగినపుడు తెలియవస్తూ ఉంటుంది. 2016 నవంబరు-2017 మార్చి మధ్య ఇన్‌కమ్‌టాక్స్‌ వారు పట్టుకున్న బ్లాక్‌ మనీ (దీన్ని అన్‌డిస్‌క్లోజ్‌డ్‌ వెల్త్‌, వెల్లడించని ఐశ్వర్యంగా వ్యవహరిస్తారు) రూ.19 వేలకోట్లు. దీనిలో రూ.12 వేలకోట్లు దాడుల (సెర్చ్‌ అండ్‌ సీజర్‌) ద్వారా దొరికింది. రూ.7 వేలకోట్లు సర్వేల ద్వారా దొరికింది.

దీనిలో వెయ్యికోట్లు మాత్రమే నగదు, బంగారం రూపంలో ఉంది. (ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ వీటిని విడివిడిగా చూపదు) అంటే 5% కంటె తక్కువ. ఏసీబీ దాడులంటూ టీవీల్లో చూపించినప్పుడు చెప్తూంటారు, బంగారం ఇటికలే ఉన్నాయి అని. ఆ విధంగా చూస్తే నగదు వాటా ఇంకా తక్కువే ఉంటుంది. ఈ దాడుల్లోనే వాళ్లకు ఫలానా చోట ఇళ్లున్నాయి, ఫ్లాటులున్నాయి అంటూ ఎక్కువగా చెప్తారు. అవీ బ్లాక్‌మనీ నెలకొని ఉన్న స్థావరాలు. నగదులో ఉన్నదెంతని ఈ ప్రక్రియ మొదలుపెట్టారు?

1% మాత్రమే వెనక్కి రాలేదు - నోట్లరద్దు కారణంగా 5,6 లక్షల కోట్ల రూ.ల విలువైన నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాకుండా ఉంటాయని, ఆ మేరకు నల్లధనం రద్దయినట్లేనని ప్రభుత్వం భావించింది అంటారు. అది నిజమే అయితే రద్దు చేసిన నెల్లాళ్లకే వాళ్లకు దిమ్మతిరిగి ఉండాలి. వెనక్కి ఎంత వచ్చింది అని మీడియా అడుగుతూ పోయేసరికి డిసెంబరు 13న చెప్పారు - డిసెంబరు 10 నాటికి రద్దు చేసిన రూ.15.44 లక్షల కోట్ల విలువైన నోట్ల స్థానంలో రూ.12.44 లక్షల కోట్లు వెనక్కి వచ్చేశాయి అని. ఇంకా డిసెంబరు 31 దాకా టైముంది కాబట్టి, తక్కినది కూడా వచ్చేయవచ్చని అందరికీ అర్థమైంది. ప్రకటన రాగానే కొందరు అమాయకులు కంగారుపడి నోట్లు పారేశారు కానీ అతి త్వరలోనే వాటిని వైట్‌ చేసుకోవడం ఎలాగో మార్గాలు నుక్కున్నారని ఆర్‌బీఐకు అర్థమయ్యి అప్పణ్నుంచి మౌనం పాటించడం మొదలుపెట్టింది. తర్వాత ఎన్నిసార్లు అడిగినా, నోట్ల లెక్కింపు జరుగుతోంది అంటూ చెప్పసాగింది.

మెకనైజేషన్‌ ఈ స్థాయిలో పెరిగాక కూడా నోట్ల లెక్కింపు నెలల తరబడి సాగిందంటే హాస్యాస్పదంగా లేదా? యూపీ ఎన్నికల కోసం ఆపారని అనుకున్నారు. చివరకు 2017 ఆగస్టులో జూన్‌ 30 వరకు ఉన్న వార్షిక నివేదిక ప్రకటించినప్పుడు 99% అక్షరాలా 15.28 లక్షల కోట్లు వెనక్కి వచ్చేశాయి అని ఒప్పుకోక తప్పలేదు. అంటే లక్ష్యం పూర్తిగా దెబ్బ తినిపోయింది. నగదు రూపంలో ఉన్న బ్లాక్‌మనీలో 99% లాండరింగ్‌ జరిగి, బ్యాంకు సిస్టమ్‌లోకి వచ్చేసింది. ఈ ప్రయోగానికై ముద్రించిన కొత్త నోట్ల ముద్రణా వ్యయం 2016-17లో దాదాపు 8వేల కోట్లు. అంతకు ముందు ఏడాది అది మూడున్నర కోట్లు. ఇతర ఖర్చులూ అవీ కలుపుకుని చూస్తే తడిసిమోపెడైంది. 2015-16 సం.లో ప్రభుత్వానికి రూ.66 వేలకోట్ల సర్‌ప్లస్‌ బదిలీ చేయగలిగిన ఆర్‌బీఐ 2016-17 సం.లో సగం కంటె తక్కువ 31 వేలకోట్లు మాత్రమే చేయగలిగింది.

బాంకుల్లోకి రప్పించడమే లక్ష్యమా? - 99% వెనక్కి వచ్చేసిందని తెలిశాక, క్యాష్‌ అంతటినీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తేవడమే తన లక్ష్యమని, అది నెరవేరిందని  బీజేపీ నాయకులు కొందరు చెప్పసాగారు. దానికి ఇంత హంగామా ఎందుకు? చిదంబరం ఆర్థికమంత్రిగా ఉండగా ఫలానా తేదీలోగా 2005కి ముందు ప్రచురించిన నోట్లన్నీ బ్యాంకుల్లో జమ చేయాలని, లేకపోతే చెల్లవని ప్రకటించాడు. అప్పుడు అందరూ తమ వద్ద డబ్బుని బ్యాంకుల్లోకి తెచ్చేశారు. ఏ ఇబ్బందీ లేకుండా జరిగిపోయింది. బ్యాంకుల్లోకి వచ్చాక వాళ్ల పని పట్టాం.

ఈ డబ్బు మీకెక్కడ  నుంచి వచ్చిందని నిలదీసి, వాళ్ల ముక్కుపిండి టాక్సులు వసూలు చేశాం అని గొప్పలు చెప్పుకున్నారు అధికార పక్షం వారు. దాని గురించి చెప్పుకునే ముందు ఈ ఆపరేషన్‌ వలన బయటపడిన బ్లాక్‌మనీ ఎంతో చూద్దాం. 2012-13లో 30వేల కోట్లు, 2013-14లో 101 వేలకోట్లు, 2014-15లో 23వేల కోట్లు, 2015-16లో 21వేల కోట్లు నోట్లరద్దు తర్వాత 2016 నవంబరు - 2017 జూన్‌ మధ్య అంటే 8నెలల్లో పట్టుబడింది 19వేల కోట్లు. గతంలో ఏడాదిలో బయటపడ్డది 8 నెలల్లోనే బయటపడింది అనుకున్నా భారీస్థాయి అయితే కాదని ఒప్పుకోలేం.

టాక్స్‌బేస్‌ ఏ మేరకు పెరిగింది? - ఇక దాడుల వలన, బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి డబ్బు వచ్చేయడం వలన టాక్స్‌ బేస్‌ పెరిగింది, కొత్తగా పన్నుకట్టే వాళ్లు ఎక్కువయ్యారు అని చెప్పుకునే దాని గురించి చూడబోతే - నోట్లరద్దు తర్వాత ఎంతమంది కొత్త పన్ను చెల్లింపుదార్లు చేరారు అని అడిగితే ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో అంకె చెపుతూ వచ్చింది. ఆర్థికశాఖ ఇచ్చిన గణాంకాలే చూద్దాం. 2014-15 సం.లో కొత్తగా చేరిన టాక్సు చెల్లింపుదారులు 78లక్షలు, 2015-16కి అది 100 లక్షలైంది.

అంటే గతేడాది కంటె 27.6% పెరిగిందన్నమాట. ఆగస్టు 2017లో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2016-17కి అది 126 లక్షలయిందని ప్రభుత్వం చెప్పింది. అంటే 26% వృద్ధి అన్నమాట. నోట్లరద్దు లేకపోయినా ఆ మేరకు పెరిగేదని అనుకోవాలి. సుమారు రెండులక్షల అనుమానిత ఖాతాలున్నాయని, వారి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నామని, దీన్ని ఇంకా పెంచుతామని ప్రభుత్వం అంటోంది. ఇది అంత సులభమైన వ్యవహారం కాదు. ఎన్నోరెట్ల సిబ్బంది కావాలి, వారు నిజాయితీగా పనిచేయాలి, చార్టెర్‌డ్‌ ఎక్కౌంటెంట్ల కంటె తెలివిగా వ్యవహరించాలి. జీఎస్‌టీ వైఫల్యానికి కారణాల్లో చెకింగ్‌ చేసే క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఒకటి. ఇక నిజాయితీ మాటకి వస్తే నోట్లరద్దు సమయంలో కింది స్థాయిల్లో బాంకు సిబ్బంది కష్టపడి పనిచేసినా, పైపైనే నోట్లు చేతులు మారిపోయాయి.

నోట్లకట్టలు ప్రెస్‌ నుంచి ప్రయివేటు బ్యాంకులకు, అక్కణ్నుంచి బడాబాబుల ఇళ్లకు చేరిపోయాయి. ధనికుడెవ్వడూ క్యూలలో కనబడలేదని బీదవారు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇక రూల్సును ఏర్పాటు చేయడంలో, వాటిని వంచడంలో, లోపాలను కనిపెట్టి తమ కనుగుణంగా మలచుకోవడంలో అధికారులు ఘనులు. వారికంటె ఘనులు చార్టెర్‌డ్‌ ఎకౌంటెంట్లు అని నోట్లరద్దు సమయంలో స్పష్టంగా రుజవైంది. బ్లాక్‌మనీ అంతా వైట్‌ అయిపోయింది. అందువలన నోట్లరద్దు కారణంగా ఆదాయపు పన్ను ఏ మేరకు పెరుగుతుంది అనేది వేచి చూడవలసినదే. పెరిగినా నోట్లరద్దు లేకుండా వేరే రకాలుగా టాక్స్‌ బేస్‌ పెంచేమార్గాలు ఉపయోగించుకోవచ్చు కదా అన్న ప్రశ్న ఎదురవుతుంది.

దొంగనోట్లు, ఉగ్రవాదం - రద్దు ప్రకటనలో మోదీ చెప్పిన మరో లక్ష్యం దొంగనోట్లను పట్టుకోవడం. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా ప్రకారం 2011- 15 మధ్య దేశంలో చలామణీలో ఉన్న దొంగనోట్ల విలువ రూ.400 కోట్లు. మొత్తం రూ.18 లక్షల కోట్ల విలువైన నోట్లలో ఇది ఎంత తక్కువ శాతమో చూడండి. అమెరికా, యూరోప్‌లలో ఇంతకంటె ఎక్కువ శాతం ఉంది. దీనిలో ఏటా 25-45కోట్లు పట్టుబడుతున్నాయి. బ్యాకింగ్‌ సిస్టమ్‌లో 30కోట్లు బయటపడుతున్నాయి. నోట్లరద్దు జరిగిన 2016-17లో పట్టుబడ్డ దొంగనోట్ల విలువ రూ.44 కోట్లు. కొత్త నోట్లు విడుదలైన 15 రోజుల్లోనే దొంగనోట్లు మార్కెట్‌లోకి వచ్చేశాయని అందరికీ తెలుసు.

అందువలన ఈ లక్ష్యం ఏ మేరకు నెరవేరినట్లు? మోదీ చెప్పిన మూడో లక్ష్యం - టెర్రరిస్టులకు నిధులు అందకుండా చేయడం. టెర్రరిస్టులకు నిధులు క్యాష్‌ రూపంలో అందుతున్నాయని ఎవరనగలరు? విదేశాల్లో కూర్చుని ప్లాన్లు వేసే వారికి ఆన్‌లైన్‌లో వెళ్లవా? బెల్జియం, ఫ్రాన్సు డిజిటల్‌ లావాదేవీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. రెండూ టెర్రరిస్టు బాధిత దేశాలే. నోట్లరద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిందో లేదో నిదర్శనాలు అక్కరలేదు. వాళ్లను అణచలేక, గత ప్రభుత్వాలలాగానే వాళ్లతో మంతనాలు మొదలుపెట్టారు. కశ్మీరు నుంచి సైన్యాన్ని ఉపసంహరించలేదు. కేరళలో శబరిమలతో సహా దేశంలో అనేక ప్రాంతాలు టెర్రరిస్టు భయాన్ని ఎదుర్కుంటున్నాయి.

డిజిటలైజేషనే అసలు లక్ష్యమా? - నోట్లరద్దు ప్రకటించిన ఒక వారానికే ఇవన్నీ అనుభవంలోకి వచ్చాయి. వెంటనే హుందాగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఉంటే సరిపోయేది. కానీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లింది. నోట్లరద్దు లక్ష్యాలను మార్చి చెప్పసాగింది. మా అసలు లక్ష్యం డిజిటలైజేషన్‌ వైపు దేశాన్ని నడిపించడం అనే పల్లవి అందుకుంది. అది అంత సులభమా? బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు, గూగుల్‌ వారి 2016 జులై నివేదిక ప్రకారం 2015లో కన్స్యూమర్‌ చెల్లింపులలో 78% క్యాష్‌ చెల్లింపులు కాగా 22% మంది మాత్రమే నగదేతర సాధనాల్లో చెల్లించారు. ఎందువలన విద్యుత్‌ సౌకర్యం ఇంకా భారత గ్రామాలన్నిటికీ చేరలేదు. సౌకర్యం ఉండగానే సరికాదు, సరఫరా కూడా ఉండాలి. పరిమిత గంటలు మాత్రమే విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నారు.

ఇక ఇంటర్‌నెట్‌ సౌకర్యం మాట చెప్పనే అక్కరలేదు. నగరాల్లోనే 35% ఇళ్లల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉంది. మొబైల్‌ ఫోన్‌ వాడకం పెరిగింది, ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోనే కదా అంటున్నారు. గ్రామాల్లో 68%కి మాత్రమే సెల్‌ఫోన్‌ ఉంది. ఇది కూడా దేశమంతా ఒకేలాలేదు. ఒడిశాలో ఇది 29%, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 44%. సెల్‌ఫోన్లున్నా వాటిలో స్మార్ట్‌ఫోన్ల వాటా తక్కువే. సిగ్నల్‌ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. సకల సౌకర్యాలు ఉన్నా ఇంటర్‌నెట్‌ ద్వారా ట్రాన్సాక్షన్లు చేయడం చాలామందికి తెలియదు. తెలిసినవారికి కూడా నమ్మకం తక్కువ. సైబర్‌ క్రైమ్‌లు విపరీతంగా జరుగుతున్నాయని, ఆ క్రిమినల్స్‌ను పట్టుకోలేకపోతున్నారనీ వార్తలు వస్తూ ఉంటే ధైర్యం ఎలా వస్తుంది?

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులు 74% పెరిగాయని అంకెలు చెప్తున్నారు. మొత్తం రిటైల్‌ ఎలక్ట్రానిక్‌ పేమెంట్స్‌ 14లక్షల కోట్లు. వాటిలో యూపీఐ వాటా 0.3%. దానిలో ఎంత వృద్ధి చెందినా ఏ మూలకు వస్తుంది? నోట్లరద్దు తర్వాత క్యాష్‌ వాడకం తగ్గిందని అంటున్నారు. 2016 ఆగస్టులో మొత్తం జనాభా ఏటీఎంలలో విత్‌డ్రా చేసిన మొత్తం రూ.2.19 లక్షల కోట్లు. 2017 ఆగస్టులో ఈ అంకె రూ.2.35 లక్షల కోట్లు! అంటే పెరిగిందన్నమాట. దీనికి కారణం నాబోటి వాళ్లే. నేను గతంలో ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకునేవాణ్ని కాను.

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేస్తూనే సాధ్యమైనంతవరకు కార్డు వాడుతూ ఇంటి అవసరాలకు అప్పుడప్పుడు విత్‌డ్రా చేసేవాణ్ని. నోట్లరద్దు తర్వాత బ్యాంకులపై నమ్మకం పోయింది. ఎప్పుడు ఏ ఏటీఎం పని చేస్తుందో తెలియదు. చాలాచోట్ల కార్డులు వాడనీయటంలేదు. అందువలన పెద్ద మొత్తంలో క్యాష్‌ విత్‌డ్రా చేసి ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఆన్‌లైన్‌ లావాదేవీలకు, కార్డ్‌ లావాదేవీలకు కన్సెషన్‌ ఇచ్చి ఉంటే, జనాలు వాటి వైపు మొగ్గేవారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు, ఇంకా ఆలోచించటం లేదు. డిజిటలైజేషన్‌ వైపు ప్రజలను ఆకర్షించటం లేదు. ఈ విధంగా నోట్లరద్దు అన్ని విధాలా విఫలమై సామాన్య ప్రజలకు కడగండ్లు మాత్రమే మిగిల్చింది. గుజరాత్‌ ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వస్తే, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెడుతుందని ఆశించవచ్చేమో!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com

Show comments