చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా తన దీక్షలను జనాలు నమ్ముతారనే భ్రమలోనే ఉన్నట్టుగా ఉన్నారు. ఎన్నికల ముందు ప్రజల సొమ్ముతో చంద్రబాబు నాయుడు ఎన్ని దీక్షలు చేశారో అందరికీ తెలిసిందే. వచ్చిన వారికి సకల ఏర్పాట్లు చేసి, ఎదురుడబ్బులు ఇచ్చి చేసిన ఆ దీక్షలను జనాలు లైట్ తీసుకున్నారు. 

ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ ఖర్చులతో దీక్ష చేసి ఉండవచ్చు గాక. అయితే ఎంచుకున్న ఇష్యూ ఎంతమందితో కనెక్ట్ అవుతుంది? ఆ సమస్య మూల కారణం ఏమిటి? అనే కనీస అవగాహన ఉన్న వారు ఎవరైనా ఈ దీక్షకు ఉన్న పవరేంటో చెబుతారు.

వానా కాలం, ఇసుక దొరకడం లేదు.. అనేది వాస్తవం. దాన్నొక అంతర్జాతీయ సమస్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉండటం మాత్రం కామెడీగా మారుతూ ఉంది. ఆ సంగతలా ఉంటే… ప్రతిపక్షంలోకి వెళ్లాకా చంద్రబాబు నాయుడు చేసిన తొలి దీక్షకు తెలుగుదేశం ఎమ్మెల్యేలే గట్టి ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు దీక్షా శిబిరం వద్ద కనిపించిన ఎమ్మెల్యేల సంఖ్య కేవలం ఎనిమిది మాత్రమే అని తెలుస్తోంది.

అది కూడా చంద్రబాబుతో కలిపి! 23 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది మాత్రమే అక్కడ అగుపించారని, 15 మంది చంద్రబాబు నాయుడి దీక్షకు హాజరే కాలేదని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు దీక్ష చేసింది ఏ ఉత్తరాంధ్రలోనో, రాయలసీమలోనో అయితే అందరూ రాలేరని అనుకోవచ్చు. విజయవాడ ధర్నాచౌక్ లో చంద్రబాబు దీక్ష చేశారు.

 దానికి ఎనిమిది మంది హాజరై, 15 మంది ఝలక్ ఇచ్చారు. దీన్ని బట్టి..ఆయన చేసిన దీక్షను సొంత వాళ్లు ఎలా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఆ పై ఆ 15 మంది దీక్షకు హాజరు కాకుండా కొత్త అనుమానాలు రేపారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

Show comments